త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కాంగ్రెస్‌కు తీరిక లేదు.. బీజేపీకి సోయి లేదు.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

KTR | ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో రాష్ట్రంలో ప్ర‌భుత్వం న‌డుపుతున్న కాంగ్రెస్‌కు తీరిక లేదు.. దేశంలో ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న బీజేపీకి సోయి లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Jan 28, 2026, 7.51 pm IST

KTR | కాంగ్రెస్‌కు తీరిక లేదు.. బీజేపీకి సోయి లేదు.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

కాంగ్రెస్, బీజేపీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అసంతృప్తి
సీఎం శ‌ఠ‌గోపం పెట్టిండు త‌ప్ప చేసిందేమీ లేదు..
ఆరూరి ర‌మేశ్ రాక పార్టీకి బ‌లం..
పాత కొత్త అని చూడ‌కండి..
అంద‌ర్నీ కలుపుకుపోండి..
వ‌ర్ధ‌న్న‌పేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగ‌రాలి..
గులాబీ శ్రేణుల‌కు కేటీఆర్ పిలుపు

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో రాష్ట్రంలో ప్ర‌భుత్వం న‌డుపుతున్న కాంగ్రెస్‌కు తీరిక లేదు.. దేశంలో ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న బీజేపీకి సోయి లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా ఆయ‌న‌కు కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.. వేలాదిగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చిన‌ట్లు.. ఆరూరి ర‌మేశ్ చేరిక సంద‌ర్భంగా జాత‌ర‌ను త‌ల‌పించే విధంగా కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరావ‌డం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. నామినేష‌న్లు షురూ అయ్యాయి. వ‌ర్ద‌న్న‌పేట మున్సిపాలిటీని పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ ప‌ట్ల తెలంగాణ‌లో అంద‌రూ కూడా తీవ్ర‌మైన అసంతృప్తిలో ఉన్నారు. బాధ‌లో ఉన్నారు. ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న కాంగ్రెస్ పార్టీకి తీర‌క లేదు. దేశాన్ని న‌డుపుతున్న బీజేపీకి సోయి లేదు అని కేటీఆర్ మండిప‌డ్డారు.

ఆరూరి ర‌మేశ్ 2014లో 87 వేల ఓట్ల మెజార్టీతో, 2018లో 99 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక అంద‌రి దిష్టి త‌గిలి.. 2023 ఎన్నిక‌ల్లో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మ‌ళ్లా త‌ప్ప‌కుండా రాబోయే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గులాబీ జెండా ఎగ‌రాలి. ర‌మేశ్ నాయ‌క‌త్వంలో అటు మున్సిపాలిటీని, ఇటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ముందుకు తీసుకుపోదాం. కొత్త పాత అని చూడ‌కండి.. అంద‌రిని క‌లుపుకుపోనివ్వండి. తేడా రావొద్దు అని కేటీఆర్ సూచించారు.

ఓపిక లేనోడు, తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ముఖం బాగా లేక అద్ధం ప‌గుల‌కొట్టుకున్న‌ట్టు ఉంది రేవంత్ పాల‌న తీరు. కేసీఆర్‌ను తిట్టుడు త‌ప్ప ఇంకో ప‌ని చేత కాదు రేవంత్‌కు. హామీల‌పై నిల‌దీస్తే తొండ‌లు విడుస్తా, పేగులు మెడ‌లో వేసుకుంటా అని బెదిరిస్తున్నాడు. ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడ‌తున్నాడు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేసిండు అని కాంగ్రెసోళ్లు అంటున్నారు. ఎంత దుర్మార్గ‌మైన ప్ర‌చారం అంటే ఒక మంత్రి 6 ల‌క్ష‌లు, ఇంకో మంత్రి 7 ల‌క్ష‌లు, సీఎం 8 ల‌క్ష‌లు అంటుండు. వీరి మాట‌ల్లో తేడాల‌ను గుర్తించి.. ఎంత అప్పు చేసిండు అని పార్ల‌మెంట్‌లో బీజేపీ ఎంపీ అడిగిండు. కేసీఆర్ గ‌ద్దెనెక్కిన నాడు 2014 జూన్ 2న రాష్ట్రం అప్పు రూ. 72 వేల కోట్లు. 2023 డిసెంబ‌ర్ నాడు రాష్ట్ర అప్పు రూ. 2 ల‌క్ష‌ల 80 వేల కోట్లు అప్పు మాత్ర‌మే. ఈ అప్పుతో అన్ని స‌మ‌కూర్చాడు కేసీఆర్. 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చేందుకు 50 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టిండు. ఒక ల‌క్షా కోట్ల‌తో కాళేశ్వ‌రం లాంటి ప్రాజెక్టు క‌ట్టి నీళ్లు ఇచ్చిండు. రైత‌న్న‌ల కోసం 73 వేల కోట్లు రైతుబంధు ఇచ్చిండు. రూ. 40 వేల కోట్ల‌తో ఇంటింటికి న‌ల్లా నీళ్లు ఇచ్చిండు. కొత్త జిల్లాలు చేసి 33 మెడిక‌ల్ కాలేజీలు, న‌ర్సింగ్ కాలేజీలు క‌ట్టించిండు. వెయ్యి గురుకులాల క‌ట్టించిండు. 24 అంత‌స్తుల ఎంజీఎం ద‌వ‌ఖానా క‌ట్టిండు. ఐటీ హ‌బ్‌లు క‌ట్టిండు. కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు. రేవంత్ రెడ్డి ఈ రెండేండ్ల కాలంలో రూ. 2 ల‌క్ష‌ల 50 వేల కోట్లు అప్పు చేసి కొత్త కాల్వ త‌వ్వ‌లేదు. కొత్త ఇటుక పెట్ట‌లేదు. రైతుబంధు, పెన్ష‌న్లు, తులం బంగారం ఎగ్గొట్టిండు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

అబ‌ద్దాల మీద బ‌తుకుడు అల‌వాటు చేసుకుండు రేవంత్ రెడ్డి. సీఎం శ‌ఠగోపం పెట్టిండు త‌ప్ప చేసిందేమీ లేదు. రెండోసారి మోస‌పోతే.. త‌ప్పు మ‌న‌ది అయిత‌ది. పాత కొత్త పంచాయితీ ప‌క్క‌కు పెట్టి అంద‌ర్నీ క‌లుపుకుపోండి. కారు గుర్తు మీద ఏ వ్య‌క్తి వ‌చ్చినా కేసీఆర్‌కు ఓటేస్తున్నామ‌ని భావించాలి. అది గ‌ల్లీ ఎల‌క్ష‌న్ అయినా, ఢిల్లీ ఎల‌క్ష‌న్ అయినా.. కారు మీద ఒత్తుడే ఉండాలి. ఈ సారి వ‌రంగ‌ల్‌లో 12కి 12 కొట్టాలి. గులాబీ జెండా ఎగ‌రాలి. వ‌ర్ధ‌న్న‌పేట‌లో గులాబీ జెండా ఎగుర‌వేసేందుకు ముందుకు పోదాం. మంచి ఫ‌లితం తీసుకువ‌ద్దాం అని కేటీఆర్ గులాబీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement