త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కూలింది కాళేశ్వ‌రం కాదు.. కుట్ర‌లు, కుతంత్రాలు కూలిపోయాయి : కేటీఆర్

KTR | కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో.. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ కూలింది కాళేశ్వ‌రం కాదు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన కుట్ర‌లు, కుతంత్రాలు కూలిపోయాయ‌ని కేటీఆర్ అన్నారు.

S

Telangana | Published On Apr 22, 2026, 6.33 pm IST

KTR | కూలింది కాళేశ్వ‌రం కాదు.. కుట్ర‌లు, కుతంత్రాలు కూలిపోయాయి : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో.. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ కూలింది కాళేశ్వ‌రం కాదు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన కుట్ర‌లు, కుతంత్రాలు కూలిపోయాయ‌ని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

హైకోర్టు తీర్పు చూసిన త‌ర్వాత‌.. నిజం నిల‌క‌డ మీదే తేలుతుంది.. నిజం క‌డ‌ప దాటే లోప‌ల అబ‌ద్దం అంగీలాగా వేసుకుని ప్ర‌పంచ‌మంతా తిరిగి వ‌స్తుంద‌నే తెలుగు సామెత నిజ‌మైంది. కాళేశ్వ‌రం విష‌యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్ర‌చారం హైకోర్టు తీర్పుతో ప‌టాపంచాలు అయిందిని ప్ర‌తి ఒక్క‌రూ భావిస్తున్నారు. అబ‌ద్దాల‌తో అద్భుతాలైన నిజాల‌ను చాలా కాలం వ‌ర‌కు దాచ‌లేరు. కాళేశ్వ‌రం మ‌హ‌త్యాన్ని కూడా క‌న‌బ‌డకుండా దాచ‌లేరు.

అబ‌ద్దానికి ఆడంబ‌రం ఎక్కువ కానీ ఆయుష్షు త‌క్కువ‌. రాహుల్ గాంధీని తీసుకొచ్చి బ్యారేజీ మీద నిల‌బెట్టి.. అక్క‌డ‌నున్న పర్రెను చూపెట్టి కొట్టుకుపోయింద‌ని చిల్ల‌ర ప్ర‌య‌త్నం చేశారో అది అబ‌ద్ద‌మ‌ని తేలింది. గోబెల్స్‌ను మించి దుష్ప్ర‌చారం చేసిన దూర్తుల‌కు గువ్వ గూయ్‌మ‌నిపించే తీర్పు హైకోర్టు ఇచ్చింది. హైకోర్టుకు మా పార్టీ ప‌క్షానా.. తెలంగాణ రైతాంగం పక్షానా ధ‌న్య‌వాదాలు.

అభండాలు వేసి ఇష్ట‌మొచ్చిన‌ట్టు పిచ్చి ప్ర‌చారాలు చేసిన రాజ‌కీయ రాబందుల‌కు హైకోర్టు చెంప చెల్లుమ‌నిపించేలా తీర్పు ఇచ్చింది. ఇవాళ రైతులు, ప్ర‌జ‌లు గెలిచారు. కుట్ర‌లు, కుతంత్రాల‌తో కాంగ్రెస్ ఓడిపోయింది.. క‌క్ష క‌ట్టిన‌ట్టుగా మూడేండ్లుగా చేస్తున్న చిల్ల‌ర ప్ర‌చారాలు కూలిపోయాయి. కాళేశ్వ‌రం కూలింది.. కుంగింది అంటూ ప్ర‌చారం చేసిన పిట్ట‌ల దొర‌ల‌కు ముఖం ప‌గిలే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఇవాళ కూలింది కాళేశ్వ‌రం కాదు.. కేసీఆర్ మీద మీరు చేసిన కుట్ర‌లు, కుటిల ప్ర‌య‌త్నాలు కూలిపోయాయి. మీరు సిగ్గు విడిచి ఆడిన అబ‌ద్దాలు గోదావ‌రి ప్ర‌వాహంలో కొట్టుకుపోయాయి. మోస‌పూరిత గార‌డీ కూలిపోయింది. స‌త్య‌వ‌మేవ జ‌య‌తే అనే నిజం నిరూపిత‌మైంది. కొన్ని రోజులు కొంత‌మందిని మోసం చేయొచ్చు.. అన్ని రోజులు అంద‌ర్నీ మోసం చేయ‌లేమ‌ని ఇవాళ తేలిపోయింది. కేసీఆర్ మీద బుర‌ద‌జ‌ల్లి, రాష్ట్రంలో కొంత రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొంది ఉండొచ్చు.. కానీ నిప్పు లాంటి నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది.. రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా త‌ప్పుడు ప‌ని చేస్తే ఊరుకోమ‌నేది ఈ తీర్పు ద్వారా వెల్ల‌డైంది.

ఒక‌టి మాత్రం వాస్త‌వం. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఎవ‌ర్నీ తెచ్చి వాదించినా.. ఎన్ని క‌మిష‌న్లు వేసినా.. కుట్ర‌లు చేసినా ఎంత అబ‌ద్దాన్ని నిజంగా న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసినా.. పారుతున్న‌ ప్ర‌తి నీటి బొట్టు కేసీఆర్ గొప్ప‌త‌నానికి సాక్ష్యం. పండుతున్న ప్ర‌తి పంట ఆయ‌న అకుంఠిత దీక్ష‌కు నిద‌ర్శ‌నం. కేసీఆర్ క‌ట్టిన కాళేశ్వ‌రం అజ‌రామం. భూమి ఉన్నంత కాలం కాళేశ్వ‌రం ఉంటుంది. ఈ గోదావ‌రి న‌ది పారినంతా కాలం ప్రాజెక్టు చ‌రిత్ర‌ను తాక‌లేరు అని సీఎంకు చెప్తున్నా అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement