త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

కేసీఆర్‌ ‘పదేళ్లు’.. కేటీఆర్‌ ‘పాదయాత్ర’.. హరీశ్‌ ‘ప్రజా పోరాటం’.. గులాబీ త్రిసూత్రం ఇదేనా?

పదేళ్ల పాలనను ప్రజలకు గుర్తుచేస్తూ కేసీఆర్ త్వరలోనే 'మైండ్ గేమ్' స్టార్ట్ చేయనున్నారా? మరోవైపు కేటీఆర్ పాదయాత్ర హెచ్చరికలు, హరీశ్‌రావు స్పాట్ అటాక్‌లతో బీఆర్ఎస్ విసురుతున్న ఈ ‘గులాబీ త్రిసూత్రం’ కాంగ్రెస్‌కు రివర్స్ పంచ్ ఇస్తుందా?

S

Telangana | Published On Sep 15, 2026, 6.00 am IST

కేసీఆర్‌ ‘పదేళ్లు’.. కేటీఆర్‌ ‘పాదయాత్ర’.. హరీశ్‌ ‘ప్రజా పోరాటం’.. గులాబీ త్రిసూత్రం ఇదేనా?

సంక్షిప్త సారాంశం

పదేళ్ల పాలనా అనుభవాన్ని అస్త్రంగా మార్చి గ్రామీణ ఓటర్లలో పునరాలోచన తెచ్చేందుకు కేసీఆర్ యోచిస్తున్నారు. నాగార్జునసాగర్ నీటి విడుదలపై కోదాడ-హాలియా పాదయాత్ర హెచ్చరికతో కేటీఆర్ వర్తమాన సమస్యలపై పోరుబాట పట్టారు. మరోవైపు 22ఏ భూములు, పాలిటెక్నిక్ విలీనం వంటి క్షేత్రస్థాయి బాధితుల తరఫున నిలబడి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు.

Advertisement

గతంపై కేసీఆర్.. వర్తమానంపై కేటీఆర్ & హరీశ్: బీఆర్ఎస్ మైండ్ గేమ్‌లో కాంగ్రెస్‌కు డబుల్ డిఫెన్స్ సవాల్!

 

కాంగ్రెస్ సర్కార్ వేయి రోజుల పాలన తర్వాత.. గులాబీ వ్యూహాలు పదునెక్కుతున్నాయా?

అధికారానికి దూరమై ఇన్నాళ్లూ రాజకీయ కదలికలను గమనిస్తూ వచ్చిన బీఆర్ఎస్‌..

ఇప్పుడు మళ్లీ ప్రజాక్షేత్రంలో తన బలాన్ని చూపించేందుకు అడుగులు వేస్తోందా?

గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఇక నేరుగా ప్రజల్లోకి వస్తారా?

 

అసెంబ్లీ సమావేశాల వేళ పార్టీ నేతలతో కేసీఆర్‌ చేసిన చర్చల్లో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరంపై సంకేతాలు కనిపించగా.. కేటీఆర్‌ కూడా నీటి సమస్యను పట్టుకుని ప్రత్యేక పాదయాత్రకు సిద్ధమంటూ ప్రకటించారు. మరోవైపు హరీశ్‌రావు 22ఏ భూములు, పాలిటెక్నిక్‌ కళాశాలల వంటి అంశాలను పట్టుకుని ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కేసీఆర్‌ చేతిలో పదేళ్ల పాలన.. కేటీఆర్‌ ముందు ప్రత్యేక పాదయాత్ర.. హరీశ్‌రావు చేతిలో ప్రజా సమస్యలు. ఇవి కేవలం విడివిడిగా జరుగుతున్న పరిణామాలేనా? లేక వెయ్యి రోజుల తర్వాత బీఆర్ఎస్‌ మళ్లీ కదలికలోకి వస్తోందనడానికి సంకేతాలా? గులాబీ త్రిసూత్రం వెనుక అసలు లెక్క ఏంటి?

కేసీఆర్‌ చేతిలో ‘పదేళ్ల’ అస్త్రం!

కేసీఆర్‌కు కొత్త అస్త్రం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన చేతిలో ఉన్న పదేళ్ల పాలనే పెద్ద రాజకీయ బ్రహ్మాస్త్రం. సాగునీరు, ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్‌, రైతుబంధు, సంక్షేమ పథకాలను తన పాలనకు ప్రధాన గుర్తులుగా చూపించగల ఆయన.. ప్రజల్లోకి వస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో పోలిక పెట్టే అవకాశం ఉంది. అయితే పదేళ్ల పాలన ఆయనకు బలమే కాదు.. ప్రత్యర్థులకు విమర్శల అస్త్రం కూడా. అందుకే కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తే “అప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది?” అనే చర్చను ముందుకు తీసుకెళ్లే అవకాశమే ఎక్కువ. ముఖ్యంగా 2023లో బీఆర్ఎస్‌కు దూరమైన గ్రామీణ ఓటర్లను తిరిగి పలకరించడంలో ‘పదేళ్ల పాలన’ కేసీఆర్‌కు కీలక రాజకీయ అస్త్రంగా మారొచ్చు.

కేటీఆర్‌ పాదయాత్ర.. ‘అడుగు’ ప్రత్యేకంగా!

కేటీఆర్‌ ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్నా.. ఇప్పుడు దానికి మరో రూపం జోడించారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన షెడ్యూల్ ఇవ్వకపోతే కోదాడ నుంచి హాలియా వరకు రైతులతో కలిసి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. పాదయాత్ర తీరు తెన్నులేమి ఇంకా రూపుదిద్దుకోలేదు. తేదీ కూడా ఖరారు కాలేదు. కానీ ప్రత్యేకంగా పాదయాత్ర ప్రకటించడం వెనుక రాజకీయ సందేశం స్పష్టమే. ఒక సమస్యను పట్టుకుని ప్రజల మధ్య మరింత విస్తృతంగా పోరాటం చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారన్న సంకేతం ఇది. అది కూడా గతంలో కేసీఆర్‌ (2003లో) చేపట్టిన కోదాడ–హాలియా పాదయాత్రను గుర్తు చేసే మార్గంలోనే. కేటీఆర్‌ పాదయాత్ర నిజంగా మొదలైతే.. ఇది ప్రతిపక్ష పార్టీగా చేస్తోన్న పోరాటానికి ఇది మరో కీలక అడుగుగా మారొచ్చు.

హరీశ్‌రావు.. సమస్య ఉన్న చోటే పోరాటం!

ఇక హరీశ్‌రావు తనదైన పద్ధతిలో ప్రజా సమస్యలను పట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 22ఏ భూముల వ్యవహారంలో బాధితులతో సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థుల తరఫున గళమెత్తుతున్నారు. సమస్యను పట్టుకోవడం.. బాధితుల దగ్గరకు వెళ్లడం.. ప్రభుత్వాన్ని నిలదీయడం హరీశ్‌రావు రాజకీయ శైలికి ఇవే ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి.

మూడు అడుగుల వెనుక గులాబీ బాస్ లెక్కలేనా?

ఇక్కడే అసలు రాజకీయ ఆసక్తి మొదలవుతోంది.

కేసీఆర్‌ – పదేళ్ల పాలనను రాజకీయ అస్త్రంగా మార్చే అవకాశం.

కేటీఆర్‌ – ప్రస్తుత సమస్యలపై ప్రత్యేక పాదయాత్రకు సిద్ధమవుతున్న అడుగు.

హరీశ్‌రావు – ప్రజా సమస్యలను పట్టుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న పోరాటం.

వీటిని విడివిడిగా చూస్తే మూడు రాజకీయ కార్యక్రమాలే. కానీ కలిపి చూస్తే.. బీఆర్ఎస్‌ పాత బలాన్ని గుర్తు చేస్తూనే, ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే త్రిసూత్ర వ్యూహంగా కనిపిస్తోంది.

కేసీఆర్‌ ఎంట్రీతో.. గులాబీ గేమ్‌ మారుతుందా?

ఇప్పటి పరిణామాలు ఒక రకంగా సన్నాహక దశ. కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ ఇంకా మొదలుకాలేదు. కేటీఆర్‌ పాదయాత్ర కూడా ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఇద్దరూ ప్రజా రాజకీయాల దిశగా తమ అడుగులను స్పష్టం చేశారు. హరీశ్‌రావు మాత్రం తనదైన శైలిలో ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇక ఈ మూడు దారులు గులాబీ పార్టీని ఒకే రాజకీయ లక్ష్యం వైపు ఎంతవరకు తీసుకెళ్తాయన్నదే కీలకం. కేసీఆర్‌ ‘పదేళ్లు’.. కేటీఆర్‌ ‘పాదయాత్ర’.. హరీశ్‌ ‘ప్రజా పోరాటం’ ఈ త్రిసూత్రం గులాబీ పార్టీకి మళ్లీ రాజకీయ ఊపు తెస్తుందా? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement