త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan | పోలీస్ కమిషనర్‌కే రక్షణ లేకపోతే, సామాన్యుల పరిస్థితేమిటి : ఎమ్మెల్సీ శ్ర‌వ‌ణ్ దాసోజు

MLC Dasoju Sravan | మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి నిర్వహించిన "అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్"లో వెలుగుచూసిన భయంకర నిజాలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

S

Telangana | Published On May 6, 2026, 7.46 pm IST

MLC Dasoju Sravan | పోలీస్ కమిషనర్‌కే రక్షణ లేకపోతే, సామాన్యుల పరిస్థితేమిటి : ఎమ్మెల్సీ శ్ర‌వ‌ణ్ దాసోజు
Advertisement

హైదరాబాద్‌లో శాంతిభ‌ద్ర‌త‌లు కుప్ప‌కూలాయ‌ని ధ్వ‌జం

MLC Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్ : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి నిర్వహించిన "అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్"లో వెలుగుచూసిన భయంకర నిజాలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారిణికి, అది కూడా నగర నడిబొడ్డున 40 మంది పోకిరీల నుంచి వేధింపులు ఎదురయ్యాయంటే, రేవంత్‌ పాలనలో మహిళల భద్రతను పాతాళానికి తొక్కేసారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ మాటలైన “ఏ రోజైతే ఒక మహిళ అర్ధరాత్రి వేళ నిర్భయంగా రోడ్డుపై నడవగలుగుతుందో, ఆ రోజే భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు”ను ఉటంకిస్తూ దశాబ్దాల తర్వాత, రేవంత్ పాల‌న‌లో తెలంగాణలో ఆ స్వాతంత్య్రం కాస్తా భయంకరమైన రౌడీ రాజ్యంగా మారిపోయిందని వాపోయారు. దిల్‌సుఖ్‌నగర్ వంటి రద్దీ ప్రాంతంలో స్వయంగా పోలీస్ కమిషనర్‌నే చుట్టుముట్టి వేధించారంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో అర్థమవుతోందన్నారు. ఇది కేవలం పోలీస్ వైఫల్యం మాత్రమే కాదని, నేరగాళ్లలో చట్టం పట్ల భయం పూర్తిగా నశించిందని చెప్పడానికి నిదర్శనమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు పెర‌గ‌డం సిగ్గుచేటు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, వార్షిక క్రైమ్ రిపోర్టుల ప్రకారం హైదరాబాద్‌లో మహిళలపై నేరాలు గత ఏడాది కంటే 6% పెరిగాయని శ్ర‌వ‌ణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలను వేధించే కేసులు 9% పెరిగాయని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే మహిళలపై అఘాయిత్యాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. కిడ్నాపులు, వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఫ్యూచర్ రెడీ అంటూ గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమ‌ని ఎద్దేవా చేశారు. ఇవి కేవలం అంకెలు కావని, ఈ ప్రభుత్వం రక్షించలేకపోయిన వేలాది మంది మహిళల ఆర్తనాదాలని దుయ్య‌బ‌ట్టారు.

రాజ‌కీయ కుట్ర‌ల కోస‌మే కమాండ్ కంట్రోల్ సెంటర్

హోం శాఖ బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ని ఒక రాజకీయ అడ్డాగా మార్చేశారని డాక్టర్ శ్రవణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి సచివాలయం కంటే ఎక్కువగా కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే కనిపిస్తున్నారని విమ‌ర్శించారు. కానీ అక్కడ ఆయన ఏం చేస్తున్నారు? వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వ్యవస్థను ప్రజల రక్షణ కోసం వాడుతున్నారా లేక ప్రతిపక్ష నాయకుల కదలికలను ట్రాక్ చేయడానికి, రాజకీయ వ్యూహాల కోసం వాడుతున్నారా? అని ప్ర‌శ్నించారు. దేశంలోనే అత్యంత అధునాతన నిఘా వ్యవస్థ ఉండి కూడా, నడిరోడ్డుపై ఒక మహిళను 40 మంది చుట్టుముట్టిన విషయాన్ని గుర్తించలేకపోయిందంటే.. అక్కడ ‘కమాండ్’ ఫెయిల్ అయ్యిందని ధ్వ‌జమెత్తారు. ‘కంట్రోల్’ అస్సలు లేదని, కేవలం రాజకీయ గూఢచారి కోసం టెక్నాలజీని వాడుకుంటూ, సామాన్యులను నేరగాళ్ల పాలు చేస్తున్నారని ఆరోపించారు.

పోలీసుల రాజకీయ బానిసత్వం.. అణిచివేతే లక్ష్యం

పోలీస్ వ్యవస్థపై రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు. పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా ప్రతిపక్షాలను అణిచివేసేందుకు, అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకుంటున్నారని దుయ్య‌బ‌ట్టారు.. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులను రాజకీయ బానిసలుగా మార్చడం వల్లే శాంతిభద్రతలు బలి అవుతున్నాయని అన్నారు. షీ టీమ్స్ ఏమయ్యాయని, మూడు నాలుగు గంటల పాటు పెట్రోలింగ్ వాహనం ఎందుకు కనిపించలేదని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో బిజీగా ఉండటం వల్లే, గంజాయి బ్యాచ్‌లకు, పోకిరీలకు భయం లేకుండా పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సుమతి ఆపరేషన్ ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టని అన్నారు. రేవంత్ రెడ్డి గారు కేవలం ఫుల్ టైమ్ పొలిటీషియన్ గానే మిగిలిపోయారు తప్ప, బాధ్యతగల హోం మంత్రిగా విఫలమయ్యారని విమ‌ర్శించారు. హైదరాబాద్ వంటి గ్లోబల్ సిటీని నేరగాళ్ల అడ్డాగా మార్చకూడ‌ద‌ని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా శ్ర‌వ‌ణ్ ముఖ్యమంత్రికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. త‌క్ష‌ణ‌మే వాటికి రేవంత్‌రెడ్డి స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

1. ఒక ఐపీఎస్ ఆఫీసర్‌కే రక్షణ లేని హైదరాబాద్‌లో.. విద్యార్థినులు, ఐటీ ఉద్యోగినులు, తల్లులు ఎలా సురక్షితంగా ఉండగలరు?
2. పెట్రోలింగ్ వాహనాలను ప్రజల రక్షణకు కాకుండా, రాజకీయ సభలకు, వీవీఐపీ సెక్యూరిటీలకు ఎందుకు మళ్లిస్తున్నారు?
3. మీరు కేవలం రాజకీయాల కోసమే హోం శాఖను వాడుకుంటారా, లేక ప్రజల రక్షణ కోసం బాధ్యత తీసుకుంటారా?

Advertisement
Advertisement