త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | మ‌తం పేరుతో బీజేపీ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం: మ‌హేశ్ కుమార్ గౌడ్‌

Mahesh Kumar Goud | మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) స‌మ‌యంలో మ‌తం పేరుతో బీజేపీ (BJP) ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోందని టీపీసీసీ అధ్య‌క్షుడు (TPCC President), ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. బీజేపీ కుట్ర‌ల ప‌ట్ల తెలంగాణ ప్ర‌జ‌ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

A

Telangana | Published On Feb 4, 2026, 4.14 pm IST

Mahesh Kumar Goud | మ‌తం పేరుతో బీజేపీ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం: మ‌హేశ్ కుమార్ గౌడ్‌
Advertisement

Mahesh Kumar Goud | మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) స‌మ‌యంలో మ‌తం పేరుతో బీజేపీ (BJP) ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోందని టీపీసీసీ అధ్య‌క్షుడు (TPCC President), ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. బీజేపీ కుట్ర‌ల ప‌ట్ల తెలంగాణ ప్ర‌జ‌ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan)లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మ‌హేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీకి గుండు సున్నా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. అందుకే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ‌ను నిండా ముంచార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి, బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎంత ఇచ్చారో బీజేపీ అధ్యకుడే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బ‌డ్జెట్‌లో రాష్ట్రంపై శీత‌క‌న్ను..

ద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులను మంజూరు చేయడం లేదు మ‌హేశ్ దుయ్య‌బ‌ట్టారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు, ఐఐఎమ్ ఏర్పాటు వంటి అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు, మెట్రో రైలు, మూసీ ప్రాజెక్టు వంటి కీల‌కాంశాల‌ను సైతం విస్మ‌రించింద‌ని వాపోయారు. బయో, ఫార్మా, సెమీ కండక్టర్ పరిశ్రమలు, టూరిజంల‌లో సైతం రాష్ట్రంపై శీత‌క‌న్ను వేశార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్రం ప్రణాళికలు రూపొందిస్తూ దేశ, అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్రప్ర‌భుత్వం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదని ఆరోపించారు.

స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర బ‌డ్జెట్‌

సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని మ‌హేశ్ మండిప‌డ్డారు. తెలంగాణ ప్రజలు కడుతున్న ట్యాక్స్ గుజరాత్, ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాలకు తరలించేందుకే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టార‌ని ఆరోపించారు. దేశ‌ జీడీపీలో తెలంగాణ వాటా 5.01 శాతమ‌ని, ఈ లెక్కన కేంద్రం నుంచి రూ.3.76 లక్షల కోట్లు దక్కాల్సి ఉన్నా గత ఐదేళ్లలో రూ.1.84 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని వివ‌రించారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఐదేండ్లలో రూ.4.32 ల‌క్షల కోట్లు కేంద్రానికి ఇస్తే రాష్ట్రానికి తిరిగి రూ.3.76 లక్షల కోట్లే ఇచ్చిందని చెప్పారు. మహిళలకు బడ్జెట్‌లో రూ.90 వేల కోట్ల నిధులు కోత పెట్టారని, బీసీలకు ఇచ్చింది రూ.13 వేల 600 కోట్లు మాత్రమేన‌ని పేర్కొన్నారు.

ప్ర‌జ‌లు ఆలోచించి ఓటు వేయాలి..

ఓట్ చోరీతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింద‌ని మ‌హేశ్ కుమార్ విమ‌ర్శించారు. భైంసా అల్లర్లను ఆసరాగా చేసుకొని బీజేపీ నేతలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పొందారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరిట కాంగ్రెస్ ఓట్లు అడుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మత వైషమ్యాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించరని అభిప్రాయ‌ప‌డ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టిన బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని గుర్తు చేశారు.

Advertisement
Advertisement