త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Laxman | ఏ శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను విభ‌జించారు..? సీఎం రేవంత్‌కు ఎంపీ ల‌క్ష్మ‌ణ్ సూటి ప్ర‌శ్న‌

MP Laxman | రాజ్యాంగ ప‌రిధికి లోబ‌డి డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చేప‌డుతున్నాం.. మ‌రి ఏ శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను విభ‌జించారంటూ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ రాజ్య‌స‌భ ఎంపీ ల‌క్ష్మ‌ణ్ సూటిగా ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Apr 15, 2026, 3.09 pm IST

MP Laxman | ఏ శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను విభ‌జించారు..? సీఎం రేవంత్‌కు ఎంపీ ల‌క్ష్మ‌ణ్ సూటి ప్ర‌శ్న‌
Advertisement

MP Laxman | త్రినేత్ర‌.న్యూస్ : రాజ్యాంగ ప‌రిధికి లోబ‌డి డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చేప‌డుతున్నాం.. మ‌రి ఏ శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను విభ‌జించారంటూ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ రాజ్య‌స‌భ ఎంపీ ల‌క్ష్మ‌ణ్ సూటిగా ప్ర‌శ్నించారు. ఎంపీ ల‌క్ష్మ‌ణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి ఖూనీ చేస్తున్నారు. రేవంత్ డబ్బుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. నేను తెలంగాణ రాష్ట్ర హ‌క్కుల కోసం నా గొంతు వినిపిస్తున్నారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చేశారా..? తుపాకీ ప‌ట్టుకొని ఆయ‌న ఎవ‌రి ప‌క్క‌న నిల్చున్నారో అంద‌రికీ తెలుసు. అలాంటి వ్య‌క్తి మాకు నీతులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో150 డివిజ‌న్ల‌ను 300 డివిజ‌న్ల‌కు పెంచారు. ఏ శాస్త్రీయ పద్ధతిలో గ్రేటర్ హైదరాబాద్‌ను విభజించారంటూ సీఎంను ఆయన సూటిగా ప్రశ్నించారు.

డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగా అవి పెరుగుతాయి. 543 సీట్లలో మహిళా రిజర్వేషన్లు పెంచమనడం వెనుక ఎస్సీ, ఎస్టీ మహిళలకు నష్టం చేయాలన్న కుట్ర దాగి ఉంది. ప్రధాని మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారు. జీఎస్డీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్నది కాంగ్రెస్ విధానమా? ఓటు విలువ ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా అందరికీ సమానంగా ఉంటుంది. జీడీపీలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. తెలంగాణ వ్యతిరేక ప్రతిపాదన చేస్తున్నారని వెంటనే దీనిని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే డబ్బే. ఢిల్లీకి ఆయన డబ్బుల మూటలు మోశారు. నగదు కేంద్రంగా రాజకీయం చేస్తున్నారు. డబ్బున్న వాళ్ళకి ఓటు విలువ ఎక్కువ అనేలా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య హాస్యాస్పదంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement