త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao vs Kishan Reddy | తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ.. తెలంగాణ గొంతు కోస్తారా? కిష‌న్‌రెడ్డిపై హరీశ్ రావు ధ్వజం

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కించపరిచారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని 7 మండలాలను ఏపీకి అప్పగించింది బీజేపీనే అని, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

J

Telangana | Published On Apr 2, 2026, 8.30 pm IST

Harish Rao vs Kishan Reddy | తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ.. తెలంగాణ గొంతు కోస్తారా? కిష‌న్‌రెడ్డిపై హరీశ్ రావు ధ్వజం
Advertisement
  • ఏడు మండ‌లాల‌ను అప్ప‌గించిందే బీజేపీ
  • పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన కిషన్ రెడ్డి

Harish Rao vs Kishan Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టానికి స‌వ‌ర‌ణ తెచ్చి, ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను ఏపీకి అప్ప‌గించిందే బీజేపీ అని మాజీ మంత్రి హ‌రీశ్ రావు మండిప‌డ్డారు. ఈ పాపంలో ప్ర‌స్తుత కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డికి కూడా పాత్ర ఉంది. పైగా ఈ విష‌యం విభ‌జ‌న చ‌ట్టంలో ఉంద‌ని కిష‌న్‌రెడ్డి పార్ల‌మెంట్ సాక్షిగా పేర్కొన‌డం చారిత్ర‌క అవాస్త‌మేన‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇది తెలంగాణ‌కు చేస్తున్న తీర‌ని ద్రోహ‌మ‌ని విమ‌ర్శించారు. రాజ్య‌సభ‌లో మాట్లాడిన కిష‌న్‌రెడ్డి పచ్చి అబద్దాలతో, చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయట పెట్టుకున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయక వెన్నుచూపి పారిపోయిన కిషన్ రెడ్డి నేడు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ద్రోహానికి పాల్పడ్డాడ‌ని నిప్పులు చెరిగారు. ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి బీజేపీ చేసిన ద్రోహాన్ని ఎండగట్టిన విషయాన్ని మర్చిపోయి నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంట అన్నట్లు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై రేవంత్‌ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే నేడు కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో చేయడం కాంగ్రెస్, బీజేపీ చీకటి పొత్తుకు సాక్ష్యమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మించడం అబద్దమా.. 148మీటర్ల దిగువ ప్రాంతం నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం అబద్దమా అని ప్ర‌శ్నించారు. ఈరోజు, ఈ నిమిషానికి మండుటెండల్లో సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వల ద్వారా జలాలు రైతుల పొలాలకు చేరుతుండటం అబ‌ద్ద‌మా చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

పంట పొలాల్లో పారుతున్న కాలేశ్వరం జలాలను చూపించేందుకు తాను సిద్ధమ‌ని, వ‌చ్చేందుకు కిష‌న్‌రెడ్డికి ద‌మ్ముందా అని స‌వాల్ చేశారు. మీరు క్యాబినెట్ మంత్రిగా ఉండి.. ఏ ప్రభుత్వమైనా ప్రజాధనంతోనే నిర్మాణాలు చేస్తుందన్న ఇంగితం మరిచి కేసీఆర్ గారి జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టారా అని అడగడం ఆయ‌న‌ అవివేకానికి, అతి తెలివికి నిదర్శనమ‌ని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదార్లు, ప్రాజెక్టులకు వారి సొంత పైసలు ఖర్చు పెడుతున్నారా చెప్పాల‌ని సూచించారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని గొంతు చించుకున్న కిషన్ రెడ్డి గారూ.. గతంలో మీ ప్రభుత్వ పెద్దలే నితిన్ గడ్కరీ నుంచి సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ వరకు కాళేశ్వరంపై కురిపించిన ప్రశంసలు అబద్దమంటారా, అవివేక‌మంటారా చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌స్తుత‌ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా' (చాప్టర్ 8) రిపోర్ట్ ప్రకారం.. "2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ గారు నిర్మించిన 'కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ' పథకాలే" అని కుండబద్దలు కొట్టిందని గుర్తు చేశారు. ఇది ఆయ‌న‌ కళ్ళకు కనిపించడం లేదా? రేవంత్ చెప్పింది మాత్రమే చెవుల్లోకి వెళుతుందా అని ప్ర‌శ్నించారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, తెలంగాణకు నిధులు కేటాయించాలని త‌మ‌ ఎంపీ సురేశ్ రెడ్డి ఎంతో హుందాగా బాధ్యతగా మాట్లాడితే.. కిష‌న్‌రెడ్డి దాన్ని సమర్థించకపోగా ఉల్టా బాధ్యత మరిచి వ్యర్థ రాజకీయ ప్రేలాపనలకు పాల్పడ్డారని విమ‌ర్శించారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణ వాదాన్ని రెప్రజెంట్ చేయకుండా సప్రెస్ చేస్తుండటం సిగ్గుచేటని అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement
Advertisement