త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కేసీఆర్‌ వ‌ల్లే తూప్రాన్ మారింది.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు వైద్యం దిక్కు లేదు

Harish Rao | ఒకప్పుడు తూప్రాన్‌ (Toopran)లో మంచినీళ్లు మూడు రోజులకోసారి వచ్చేవ‌ని.. గీతారెడ్డి (Geetha Reddy) ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిందెలతో అడ్డం పడి నిరసన తెలిపేటోళ్లని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) విమ‌ర్శించారు.

S

Telangana | Published On Feb 7, 2026, 6.02 pm IST

Harish Rao | కేసీఆర్‌ వ‌ల్లే తూప్రాన్ మారింది.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు వైద్యం దిక్కు లేదు
Advertisement

- గీతారెడ్డి హ‌యాంలో తెల్లారితే బిందెల కొట్లాట‌లే
- నీళ్ల క‌ష్టాలు తీర్చింది కారు గుర్తు కాదా?
- తూప్రాన్‌కే పిల్లనిద్దామ‌నేలా చేసిండు కేసీఆర్‌
- ఇప్పుడేమో కాంగ్రెస్ గిట్లజేయ‌వ‌ట్టే
-​ ​పువ్వు గుర్తుకు ఓటేసినా.. మోరీలో పారేసినా ఒకటే
- ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ మంత్రి హరీష్ రావు

త్రినేత్ర‌.న్యూస్‌: ఒకప్పుడు తూప్రాన్‌ (Toopran)లో మంచినీళ్లు మూడు రోజులకోసారి వచ్చేవ‌ని.. గీతారెడ్డి (Geetha Reddy) ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిందెలతో అడ్డం పడి నిరసన తెలిపేటోళ్లని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) విమ‌ర్శించారు. తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లాపూర్ (Allapur) చౌరస్తా నుంచి తూప్రాన్ బస్టాండ్ వరకు నిర్వ‌హించిన భారీ రోడ్ షో (Road show) లో హరీష్ రావు పాల్గొని ప్ర‌సంగించారు. ​కేసీఆర్ (KCR) రాకముందు తూప్రాన్‌కు పిల్లనియ్యాలంటే నీళ్లు మోపిస్తారని భయపడేవాళ్లని.. ఇప్పుడు తూప్రాన్‌కే పిల్లనియ్యాలన్నట్టు పరిస్థితి మారిందన్నారు. తూప్రాన్‌ను మున్సిపాలిటీ చేసింది, ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది, నాలుగు లైన్ల రోడ్లు వేసి హైవేలా మార్చింది కారు గుర్తు కాదా.. అని అన్నారు. పది లక్షలు లేని భూమికి కేసీఆర్ కోటి రూపాయలు వ‌చ్చేలా చేశార‌ని, కానీ రేవంత్ వచ్చాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశాన్నంటాయ‌ని ఎద్దేవా చేశారు.

మెదక్, గజ్వేల్ కు పంపుతున్నారు...

50 పడకల ఆసుపత్రిలో డాక్టర్లు లేక రోగుల‌ను మెదక్, గజ్వేల్ (Medak, Gajwel) కు పంపుతున్నారని వాపోయారు. ​మహిళలకు రూ. 2500 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మోసం చేశాడ‌న్నారు. ఈ 26 నెలల్లో ఒక్కో అక్కకు, చెల్లెకు రూ. 65,000 బాకీ పడ్డట్లు వివ‌రించారు. తులం బంగారం ఇస్తానని చెప్పి కల్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఆపుతున్న పాపం రేవంత్‌ది కాదా అని ప్ర‌శ్నించారు. రూ. 4000 పించ‌న్ విష‌యం ఊసే లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ​కేసీఆర్ ఉన్నప్పుడు పంట పంటకు రైతుబంధు పడేదని.. కరోనా కష్టకాలంలో కూడా ఆపలేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి రెండు రైతుబంధులు ఎగ్గొట్టి, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, చేప పిల్లలు, దళిత బంధు వంటివి అన్నీ బంద్.. చేసి ప్రజలను అరిగోస పెడుతున్నాడ‌న్నారు.

పువ్వు గుర్తోళ్లు ఏంజేసిండ్రు?

​బీజేపీ (BJP) వాళ్లు ఓట్ల కోసం గిర్ర గిర్ర తిరుగుతున్నారని.. వాళ్లు తూప్రాన్‌ (Toopran) కు ఏమైనా చేశారా? ఒక్క హాస్పిటల్ కట్టించారా? కల్యాణ లక్ష్మి ఇచ్చారా? రూ. 15 లక్షలు వేస్తామని 12 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వని ఈ పువ్వు గుర్తుకు ఓటేసినా, మోరీలో పారేసినా ఒక్కటేన‌ని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ (Asembly)లో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి మింగుడు ప‌డ‌డం లేద‌న్నారు. పెన్షన్ ఎప్పుడిస్తావ‌ని అడిగితే లాగుల తొండలు ఇడుస్తా, హామీలు అడిగితే పేగులు మెడలో వేసుకుంటా, తులం బంగారం ఏదంటే గుడ్లు పీకి గోటీలు ఆడుతా.. అని అన‌డం ఆయ‌న అవివేకానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? ఇలాంటి బూతుల ముఖ్యమంత్రికి ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ​ఐదేళ్ల కోసం కౌన్సిలర్లను గెలిపించాల‌ని.. రెండేళ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేన‌ని ఉద్గాటించారు. తూప్రాన్ అభివృద్ధి బాధ్యత నాది.. ఏ పని ఉన్నా నేను చేసి పెడతా అని వివ‌రించారు.

కాంగ్రెస్ లో ఆధిప‌త్య పోరు..

తూప్రాన్‌లో కాంగ్రెస్ (Congress) నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని, నర్సారెడ్డి, మైనంపల్లి (Narsareddy, Mainampalli) మధ్య జ‌రుగుతున్న పోరుకు ప్రజలు బ‌లైతున్నార‌ని ఆవేద‌న చెందారు. ఆధిపత్య రాజకీయాలు కావాలా? లేక అభివృద్ధి కావాలో తూప్రాన్ ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని కోరారు. రెండేళ్ల నుంచి ఇక్క‌డ అభివృద్ధిని అడ్డుకున్నారని మండిప‌డ్డారు. రోడ్లకు గుంతలు పడితే క‌నీసం డాంబర్ వేసే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

Advertisement
Advertisement