త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR Adilabad Visit | పంట కొనకపోతే ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ లీడర్ల కాలర్ పట్టుకొని నిలదీయండి : కేటీఆర్ పిలుపు

ఆదిలాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని కోరారు.

J

Telangana | Published On Jun 20, 2026, 3.24 pm IST

KTR Adilabad Visit | పంట కొనకపోతే ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ లీడర్ల కాలర్ పట్టుకొని నిలదీయండి : కేటీఆర్ పిలుపు
Advertisement
  • ఆదిలాబాద్ జిల్లాలో జొన్న పంట అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆదర్శ రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
  • బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధిత కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేత
  • రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
  • పంటలు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్ లీడర్ల కాలర్ పట్టుకుని నిలదీయాలని సూచన

KTR Adilabad Visit | త్రినేత్ర.న్యూస్ : తాను ఆరుగాలం కష్టపడి పండించిన జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగ కుటుంబాన్ని.. బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఆయన, రాష్ట్రంలో రైతుల దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

ప్రభుత్వ హత్యలే..

కాంగ్రెస్ లీడర్లను ఎక్కడికక్కడ నిలదీయాలని, రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ప్రాణాలు తీసుకోవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. "రెండేండ్లు ఓపిక పట్టండి, మళ్లీ కేసీఆర్ వస్తాడు. ఒక్కొక్క రైతన్నను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాడు" అని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిందని, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నవి రైతుల ఆత్మహత్యలు కావని.. అవి ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయిస్తున్న ప్రభుత్వ హత్యలేనని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

Grab Their Collars if Crops Aren't Bought KTR Warns Congress Over Farmer Suicides

కన్నీరు పెట్టిస్తున్న పాండురంగ దీనస్థితి

ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) రూ. 3,720 వస్తుందని ఆశపడిన పాండురంగ.. తన జొన్నల కుప్ప వద్దే నెలరోజుల పాటు మార్కెట్ యార్డ్‌లో వెయిట్ చేశారు. కానీ చివరకు క్వింటాల్‌కు రూ. 50 లంచం అడిగే దుస్థితి రావడం, అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయి అదే పంట కుప్పపై విషం తాగి చనిపోవడం రాష్ట్ర వ్యవసాయ దుస్థితికి అద్దం పడుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన రూ. 500 బోనస్ ఇవ్వకపోగా.. ప్రైవేట్ మార్కెట్లో రూ. 2 వేలకే అమ్ముకునే దయనీయ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. తీసుకున్న లక్షన్నర రుణంలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని పాండురంగ భార్య కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది.

బీఆర్ఎస్ సపోర్ట్.. కాంగ్రెస్‌కు డిమాండ్స్

ఈ ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిందని, కనీసం రైతు బీమా ప్రీమియం కూడా కట్టకపోవడం వల్ల దాదాపు 7 వేల క్లెయిమ్స్ (Claims) పెండింగ్‌లో ఉన్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాండురంగ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున తక్షణ సాయంగా రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా (Ex-gratia) చెల్లించాలని, ఆయన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Grab Their Collars if Crops Aren't Bought KTR Warns Congress Over Farmer Suicides

ప్రభుత్వం పంటలు కొనకపోతే నాయకుల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని, వాళ్ల కాలర్ పట్టుకుని నిలదీయాలని.. రోడ్డెక్కకుండా కాంగ్రెస్ లీడర్ల ఇళ్ల ముందే కూర్చుని హక్కుల కోసం ప్రశ్నించాలని రైతులకు కేటీఆర్ సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement