త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవ‌రు? 45 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు ఏమైంది?: రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | సింగరేణిలో ఒక అటెండర్‌ను కూడా నియమించే అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి లేవని.. అడ్మినిస్ట్రేషన్ అయినా, ఫైనాన్షియల్ పవర్స్ అయినా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణం బయటపడుతుందనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై నిరాధార విమర్శలకు దిగుతున్నారని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Jun 20, 2026, 6.20 pm IST

Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవ‌రు? 45 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు ఏమైంది?: రాంచంద‌ర్‌రావు
Advertisement
  • బొగ్గు కుంభ‌కోణం నిజాలు బ‌య‌టికి రావాల‌నే సీఎం రేవంత్‌కు కిష‌న్‌రెడ్డి లేఖ రాశారు
  • భ‌యంతోనే రేవంత్ నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్న‌రు
  • సింగ‌రేణి ప‌వ‌ర్స‌న్నీ రాష్ట్ర ప్ర‌భుత్వానికే ఉన్న‌య్‌
  • కేంద్రానికి అటెండ‌ర్‌ను కూడా నియ‌మించే అధికారం లేదు
  • కాంగ్రెస్ స‌ర్కార్‌పై బీజేపీ రాష్ట్ర‌ చీఫ్ రాంచంద‌ర్‌రావు ఫైర్‌

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: సింగరేణిలో ఒక అటెండర్‌ను కూడా నియమించే అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి లేవని.. అడ్మినిస్ట్రేషన్ అయినా, ఫైనాన్షియల్ పవర్స్ అయినా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణం నిజాలు బయటకు రాకుండా అణిచివేస్తూ, బీజేపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేయడం రేవంత్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్య‌బట్టారు. బొగ్గు కుంభకోణం బయటపడుతుందనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై నిరాధార విమర్శలకు దిగుతున్నారని మండిప‌డ్డారు. శ‌నివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

51 శాతం రాష్ట్ర ప్ర‌భుత్వానిదే..

45 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు ఎక్క‌డ పోయింది. ఆ బొగ్గు దొంగ ఎవ‌రు? బొగ్గు కుంభకోణంపై నిజానిజాలు వెలుగులోకి రావాలని కిషన్ రెడ్డి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సింగరేణి కాలరీస్‌లో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది. 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది. కానీ స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలో ఒక అటెండర్‌ను కూడా నియమించే అధికారాలు లేవు. అన్ని అధికారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అందుకే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బొగ్గు కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాశారు. దీనిపై సమాధానం చెప్పాల్సింది పోయి బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం అని ఫైర‌య్యారు.

కేంద్రంలో కాంగ్రెస్ పాలనలోనే ఎమర్జెన్సీ విధించి నియంతృత్వ పాలన సాగించారు. తమ సొంత పార్టీలే ముక్కలైన చరిత్ర కాంగ్రెస్‌ది. అలాంటి కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందంటూ బురదజల్లడం సరికాదు అని రాంచంద‌ర్‌రావు హెచ్చ‌రించారు.

రేవంత్ తీరుపై క‌థ..

ఒక ఊళ్లో ఒక సావుకారి అన్ని అప్పులు ఇస్తుండ‌ట‌. ఆయ‌న ద‌గ్గ‌ర ఎవ‌రూ కూడా పైస‌లు ఇచ్చి కొన‌ట్లేద‌ట‌. చివ‌రికి ఒక బోర్డు పెట్టారంట‌. ఇప్ప‌టినుంచి మ‌ళ్లీ మీ అంద‌రికీ అప్పులు ఇస్తా కానీ.. రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి అయినంక అప్పులిస్తా అని పెట్టిండ‌ట బోర్డు. రాహుల్ ప్ర‌ధాని అయ్యేది లేదు. అప్పులు ఇచ్చేది లేదు. ఇలా ఉంది రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి. రాహుల్ ప్రైమ్ మినిస్ట‌ర్ అయ్యేది లేదు.. రేవంత్ ధాన్యం కొనేది లేదు. అందుకే రేవంత్ ధైర్యంగా చెప్పిండు ధాన్యం కొంటా అని. రాహెల్ ప్ర‌ధాని అయినంక‌నే విద్యా వ్య‌వ‌స్థ‌ను బాగు చేస్తా అంట‌డేమో మ‌రి.

విద్యా వ్య‌వ‌స్థ‌పై నిర్ల‌క్ష్యం ప్ర‌మాద‌క‌రం..

ప్రభుత్వ పాఠశాలల్లో “No Admission” బోర్డులు పెట్టాల్సి వచ్చిందని గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదం. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం పూర్తిగా చంపేస్తోంది. కేంద్రీయ విద్యాలయాల స్టాండర్డ్ మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లకు ఎందుకు లేదు? టీచర్లకు ప్రమోషన్లు లేవు. చాలాచోట్ల DEOలు, MEOలు కూడా లేరు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విద్యావ్యవస్థను కాపాడాలి. స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో నిర్లక్ష్యం ప్రమాదకరం. విద్యాశాఖ బడ్జెట్ వెంటనే పెంచాలి. ప్రస్తుత బడ్జెట్ సాలరీలు, మెయింటెనెన్స్‌కే సరిపోవడం లేదు. టీచర్లు, ప్రొఫెసర్లు హక్కులు గురించి మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు మండిప‌డ్డారు.

బీ హాస్ట‌ల్ మూత‌ప‌డింది..

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? అమలు ఏది? ఓయూ హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. B హాస్టల్ ఇప్పటికే మూసివేశారు. D, E హాస్టళ్లు కూడా మూసివేత అంచున ఉన్నాయి. ఇప్పటికైనా పాత హాస్టళ్లను వెంటనే పునర్నిర్మించాలి. రాష్ట్రంలోని 90 శాతం కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు గానీ, కనీస మౌలిక సదుపాయాలు గానీ లేవని స‌మాచారం ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచినా ఇప్పటికీ కొత్త పాఠ్యపుస్తకాలు ముద్రించలేదు. యూనిఫారాలు కూడా పంపిణీ చేయలేదు అని రాంచంద‌ర్‌రావు ఆరోపించారు.

Advertisement
Advertisement