త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | తొలి దశలో 7,680 ఇందిర‌మ్మ‌ ఇండ్లు.. జ‌నావాసాల ప‌రిధిలోనే ఉండాలి

Revanth Reddy | నిరుపేద‌ల‌కు తొలి ద‌శ‌లో 7,680 ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌ని.. జ‌నావాసాల ప‌రిధిలోనే వాటిని నిర్మించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా స‌మావేశం నిర్వహించారు.

S

Telangana | Published On Jul 24, 2026, 3.06 pm IST

Revanth Reddy | తొలి దశలో 7,680 ఇందిర‌మ్మ‌ ఇండ్లు.. జ‌నావాసాల ప‌రిధిలోనే ఉండాలి
Advertisement
  • అన్ని శాఖ‌ల్లో ఉన్న‌ నిరుపయోగ స్థలాలను గుర్తించండి
  • క్యూర్ పరిధి ఇండ్లపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: నిరుపేద‌ల‌కు తొలి ద‌శ‌లో 7,680 ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌ని.. జ‌నావాసాల ప‌రిధిలోనే వాటిని నిర్మించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా స‌మావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను వెంట‌నే గుర్తించాలని సూచించారు. జ‌నావాసాల‌కు ద‌గ్గ‌ర ఇండ్లు నిర్మిస్తే జీవ‌నోపాధి కోల్పోకుండా ఉంటార‌ని చెప్పారు.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి గుర్తించిన నిరుప‌యోగ స్థలాలను తీసుకుని, వేరేచోట సంబంధిత శాఖలకు స్థలాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించొద్ద‌న్నారు. అలా చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పని ప్రదేశాలకు దగ్గరగా ఇండ్లు నిర్మించేలా చూడాలన్నారు.

ల్యాండ్ కాస్ట్‌ను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది

ఒక్కో ప్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్న‌ట్లు పేర్కొన్నారు. దీని నిర్మాణానికి దాదాపు 11 లక్షల రూపాయల ఖర్చవుతుండగా.. ప్రభుత్వం ఇందులో 5 లక్షల రూపాయల భారీ సబ్సిడీని అందిస్తోందన్నారు. మిగిలిన 6 లక్షల రూపాయలను లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుందని.. ల్యాండ్ కాస్ట్‌ను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోందని వివ‌రించారు.

నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించండి..

రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్‌గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో ప్రభుత్వం తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనుంద‌ని వెల్ల‌డించారు. సంబంధిత నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎన్.శ్రీధర్, వి.శేషాద్రి, రెవెన్యూ సెక్రెటరీ లోకేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హౌజింగ్ స్పెషల్ సెక్రెటరీ వీపీ గౌతమ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement