త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA World | ఫిఫా వరల్డ్‌కప్ ప్రసారాలపై ఉత్కంఠ.. భార‌త్‌లో లైవ్ టెలికాస్ట్ జ‌రిగేనా?

FIFA World | ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నా, భారత్‌లో టోర్నీ ప్రసారాల అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. జూన్ 11 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. మ్యాచ్‌లను ఏ ప్రసార సంస్థ అందించబోతోందన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొర‌క‌డం లేదు.

P

Sports | Published On May 31, 2026, 7.17 pm IST

FIFA World | ఫిఫా వరల్డ్‌కప్ ప్రసారాలపై ఉత్కంఠ.. భార‌త్‌లో లైవ్ టెలికాస్ట్ జ‌రిగేనా?
Advertisement

FIFA World | ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నా, భారత్‌లో టోర్నీ ప్రసారాల అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. జూన్ 11 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. మ్యాచ్‌లను ఏ ప్రసార సంస్థ అందించబోతోందన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొర‌క‌డం లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తితో పాటు కొంత ఆందోళన కూడా నెలకొంది. అయితే, ఈ అనిశ్చితి త్వరలోనే తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థ జీ నెట్‌వర్క్ ఫిఫా వరల్డ్‌కప్ ప్రసార హక్కులను దక్కించుకునేందుకు చివరి దశ చర్చలు జరుపుతున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. సుమారు 30 నుంచి 35 మిలియన్ డాలర్ల మధ్య విలువైన ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది.

ఒప్పందం ఖరారైతే టోర్నీలో జరిగే మొత్తం 104 మ్యాచ్‌లను జీ స్పోర్ట్స్ ఛానెళ్లతో పాటు జీ5 ఓటీటీ వేదికలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వివిధ భారతీయ భాషల్లో వ్యాఖ్యానం అందించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రసార హక్కుల ఖరారులో ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఫిఫా నిర్ణయించిన భారీ ధరేనని తెలుస్తోంది. 2026, 2030 ప్రపంచకప్‌ల హక్కులను కలిపి దాదాపు 100 మిలియన్ డాలర్ల మేర విలువ కట్టడంతో పలువురు బ్రాడ్‌కాస్టర్లు వెనక్కి తగ్గినట్లు సమాచారం. మరోవైపు భారత ప్రేక్షకులకు అనుకూలం కాని మ్యాచ్ సమయాలు కూడా ఆసక్తిని తగ్గించాయి.

టోర్నీలోని చాలా మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి తర్వాత లేదా తెల్లవారుజామున జరగనున్నాయి. మొత్తం 104 మ్యాచ్‌లలో కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే అర్ధరాత్రిలోపు ప్రారంభమవుతాయి. ఫైనల్ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 12.30 గంటల తర్వాత ప్రారంభం కానుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా జియోస్టార్ సుమారు 20 మిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చినప్పటికీ, ఫిఫా దాన్ని ఆమోదించలేదని తెలుస్తోంది. భారత్ జట్టు ప్రపంచకప్ బరిలో లేకపోయినా.. దేశంలో ఫుట్‌బాల్‌కు ఉన్న ఆదరణ మాత్రం భారీగానే ఉంది. 2022 ఖతార్ ప్రపంచకప్‌ను భారత్‌లో సుమారు 110 మిలియన్ల మంది డిజిటల్ వేదికల ద్వారా వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన ఫిఫా డిజిటల్ వ్యూవ‌ర్స్‌లో భారత వాటా 2.9 శాతంగా ఉండటం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, ఆలస్యమైనా భారత అభిమానులు ప్రపంచకప్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది.

Advertisement
Advertisement