త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ‘రైతు డిస్కం’ వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

'రైతు డిస్కం' పేరుతో వ్యవసాయ రంగాన్ని ముంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

J

Medak | Published On May 31, 2026, 9.45 pm IST

Harish Rao | ‘రైతు డిస్కం’ వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
Advertisement

Harish Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో విద్యుత్ రంగం వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న 'రైతు డిస్కం' (RPDCL) పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. ఆర్పీడీసీఎల్‌తో రైతులకు ఉచిత కరెంట్ రాకపోగా, అది వ్యవసాయ రంగానికి ఉరితాడుగా మారబోతోందని ఆయన హెచ్చరించారు.

పగలు సోలార్.. మరి రాత్రి కరెంట్ ఎలా?

24 గంటల ఉచిత కరెంట్ కోసమే ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పడం పచ్చి అబద్ధమని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 8 లో స్పష్టంగా RPDCL కు 'సోలార్ పవర్' (రిన్యూవబుల్ ఎనర్జీ) ఇస్తామని చెప్పారని.. సోలార్ పవర్ ఉదయం 7 కు వచ్చి సాయంత్రం 5 కు ఆగిపోతుందని, మరి అలాంటప్పుడు పగలు మాత్రమే ఉండే సోలార్ కరెంటుతో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. దమ్ముంటే '24 గంటల ఉచిత విద్యుత్‌ను రైతులకు ఇస్తేనే నేను ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను' అని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు.

Harish Rao Slams CM Revanth Reddy Over RPDCL and Farmer Power Supply

తాగు, సాగు నీటికి ఎసరు

రైతు డిస్కం నిర్ణయం వల్ల కాళేశ్వరం, దేవాదుల లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు మిషన్ భగీరథకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం పగలు మాత్రమే కరెంట్ ఇస్తే మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేయాల్సి వచ్చి అవి పాడైపోతాయని, వర్షాకాలం, చలికాలంలో సోలార్ ఎనర్జీ లేకపోతే తాగునీటి పథకాలు ఆగిపోయి ప్రజలు అల్లాడిపోతారని అన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే సీఎం ఈ మూడో డిస్కం ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.

Harish Rao Slams CM Revanth Reddy Over RPDCL and Farmer Power Supply

అప్పుల లెక్కలు బయటపెట్టిన హరీశ్

డిస్కంలు అప్పుల పాలైంది బీఆర్ఎస్ వల్లే అని సీఎం మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డిస్కంలకు ప్రభుత్వం రూ. 27 వేల కోట్లు బకాయి పడితే (ఏడాదికి సగటున రూ. 2 వేల కోట్లు), ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఏడాదికే రూ. 25,284 కోట్లు (ఏడాదికి సుమారు రూ. 10 వేల కోట్లు) బకాయి పడిందని లెక్కలు వివరించారు. బీఆర్ఎస్ హయాంలోనే విద్యుత్ వ్యవస్థ బలోపేతమైందని గుర్తుచేశారు.

Harish Rao Slams CM Revanth Reddy Over RPDCL and Farmer Power Supply

నా ప్రయాణం కేసీఆర్‌తోనే

తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను హరీశ్‌రావు కొట్టిపారేశారు. "పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నా పుట్టుక, నా ప్రయాణం, నా జీవితమంతా కేసీఆర్ గారి వెంటే" అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ ఎగబెట్టిన రేవంత్ రెడ్డి.. తన ఇంటి పేరును 'అబద్ధాల రేవంత్ రెడ్డి'గా మార్చుకోవాలని సెటైర్లు వేశారు. తక్షణమే ఆర్పీడీసీఎల్ ఏర్పాటును రద్దు చేయకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

[video width="1024" height="576" mp4="https://www.trinethra.news/static-media/wp-content/uploads/2026/05/WhatsApp-Video-2026-05-31-at-19.44.40-1-1.mp4"][/video]

Advertisement
Advertisement