త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SLC | మీరు మ్యాచ్ ఆడ‌క‌పోతే మేం తీవ్రంగా న‌ష్ట‌పోతాం, ఆలోచించండి.. పాక్‌కు శ్రీ‌లంక లేఖ‌..

SLC | భారత్‌తో జరిగే టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup 2026) మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని శ్రీలంక క్రికెట్ (SLC) అధ్యక్షుడు షామ్ని సిల్వా విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన గ్రూప్-ఎ కీలక పోరుపై ఈ మేరకు ఆయన పీసీబీకి లేఖ రాశారు.

S

Sports | Published On Feb 6, 2026, 11.29 am IST

SLC | మీరు మ్యాచ్ ఆడ‌క‌పోతే మేం తీవ్రంగా న‌ష్ట‌పోతాం, ఆలోచించండి.. పాక్‌కు శ్రీ‌లంక లేఖ‌..
Advertisement

SLC | భారత్‌తో జరిగే టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup 2026) మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని శ్రీలంక క్రికెట్ (SLC) అధ్యక్షుడు షామ్ని సిల్వా విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన గ్రూప్-ఎ కీలక పోరుపై ఈ మేరకు ఆయన పీసీబీకి లేఖ రాశారు. ఇప్పటివరకు పీసీబీ తమ వైఖరిని అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి తెలియజేయకపోయినా, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చారు. గత నెల ఐసీసీ బంగ్లాదేశ్‌ను వరల్డ్‌కప్ నుంచి తప్పించడాన్ని నిరసిస్తూ, ఐక్యత చాటే చర్యగా భారత్‌తో మ్యాచ్‌కు తమ ఆటగాళ్లు మైదానంలోకి దిగబోరని ఆయన ప్రకటించారు.

తీవ్ర‌మైన న‌ష్టాలు ఉంటాయని హెచ్చ‌రిక‌..

శ్రీలంక మీడియా సంస్థ న్యూస్‌వైర్ కథనం ప్రకారం, భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడంలో తమకు అత్యంత ఆసక్తి ఉందని ఎస్‌ఎల్‌సీ పీసీబీకి తెలియజేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అన్ని వాణిజ్య, ఆపరేషనల్, లాజిస్టికల్, భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని లేఖలో పేర్కొంది. అతిథ్య ఏర్పాట్లు, టికెట్ల విక్రయం కూడా పూర్తయ్యాయని వివరించింది. టికెట్లకు భారీ డిమాండ్ నెలకొనడం ద్వారా ప్రజల్లో అపూర్వమైన ఆసక్తి, గణనీయమైన వాణిజ్య అంచనాలు ఉన్నాయని శ్రీలంక స్పష్టం చేసింది. అంతేకాకుండా, మ్యాచ్‌కు పాకిస్థాన్ హాజరుకాకపోతే శ్రీలంకకు తీవ్రమైన ఆర్థిక నష్టాలు తప్పవని హెచ్చరించింది. ఆశించిన పర్యాటక ఆదాయం కోల్పోవడంతో పాటు, విస్తృత ఆర్థిక ప్రభావాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొంది.

హోట‌ల్ బుకింగ్స్ ర‌ద్దు..

పాకిస్థాన్ బహిష్కరణపై నెలకొన్న ఊహాగానాల న‌డుమ కొలంబోలో ఇప్పటికే అనేక హోటల్ బుకింగ్‌లు రద్దయ్యాయి. ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందని హోటళ్లు అంచనా వేసుకున్నాయని, అయితే ఈ క్యాన్సిలేష‌న్లు వరల్డ్‌కప్ కాలంలో గదుల ఆక్యుపెన్సీ అంచనాలను తీవ్రంగా దెబ్బతీశాయని పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. వివరమైన లేఖలో గతంలో రెండు దేశాల మధ్య కొనసాగిన సహకారాన్ని కూడా ఎస్‌ఎల్‌సీ గుర్తు చేసింది. సున్నితమైన, సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య కూడా శ్రీలంక జట్టు పలుమార్లు పాకిస్థాన్‌లో పర్యటించిందని పేర్కొంది.

ఇటీవల ఉదాహరణగా గత ఏడాది నవంబర్‌లో శ్రీలంక జట్టు పాకిస్థాన్‌లో వైట్-బాల్ సిరీస్ ఆడుతున్న సమయంలో, ఇస్లామాబాద్‌లోని ఒక న్యాయ సముదాయం వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇది 16 ఏళ్ల క్రితం లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వద్ద శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడి జరిగిన ఘటన తర్వాత జరిగిన మరో తీవ్ర సంఘటనగా నిలిచింది. అయితే శ్రీ‌లంక చేసిన విజ్ఞ‌ప్తిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు లేదా ఆ దేశ ప్ర‌భుత్వ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Advertisement
Advertisement