త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC | పాక్ తోక జాడిస్తే బంగ్లాదేశ్‌కు చాన్స్‌.. ప్లాన్ రెడీ చేస్తున్న ఐసీసీ..?

ICC | టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇకపై ఎలాంటి వివాదాలు, రాజకీయ నాటకాలు సహించబోమన్న సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే భద్రతా కారణాలు చూపిస్తూ భారత్‌కు రావడానికి నిరాకరించిన బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించి, వారి స్థానంలో స్కాట్లండ్‌ను చేర్చిన సంగతి తెలిసిందే.

S

Sports | Published On Jan 27, 2026, 1.15 pm IST

ICC | పాక్ తోక జాడిస్తే బంగ్లాదేశ్‌కు చాన్స్‌.. ప్లాన్ రెడీ చేస్తున్న ఐసీసీ..?
Advertisement

ICC | టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇకపై ఎలాంటి వివాదాలు, రాజకీయ నాటకాలు సహించబోమన్న సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే భద్రతా కారణాలు చూపిస్తూ భారత్‌కు రావడానికి నిరాకరించిన బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించి, వారి స్థానంలో స్కాట్లండ్‌ను చేర్చిన సంగతి తెలిసిందే. కాగా, పాకిస్థాన్ పాల్గొనడంపై ఇంకా స్పష్టత రావడం లేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ, ఈ విషయంలో తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని వెల్లడించారు. అయితే బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించే ఆలోచనలో పీసీబీ ఉందన్న వార్తలు వెలువడడంతో, ఐసీసీ కీలకమైన ప్రత్యామ్నాయ ప్లాన్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

పాక్ త‌ప్పుకుంటే బంగ్లాకు అవ‌కాశం..

పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే, బంగ్లాదేశ్‌ను తిరిగి టోర్నీలోకి తీసుకునేందుకు ఐసీసీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. ఒకవేళ పాకిస్థాన్ తప్పుకుంటే, అదే గ్రూప్‌లో బంగ్లాదేశ్‌ను చేర్చి, వారి అసలు డిమాండ్ ప్రకారం శ్రీలంకలోనే అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పిస్తామని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్‌ను ఇప్ప‌టికే స్టాండ్ బై గా ఉంచిన‌ట్లు తెలిసింది. పాకిస్థాన్ వెనక్కి తగ్గితే, గ్రూప్-ఎలో బంగ్లాదేశ్‌కు అవకాశం ఇస్తాం. వారు కోరినట్టుగా శ్రీలంకలోనే మ్యాచ్‌లు నిర్వహించవచ్చు. దీనివల్ల పెద్దగా లాజిస్టికల్ సమస్యలు రావు, అని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ఓ అధికారి వెల్లడించారు. కాగా ఇదే విష‌యంపై పాకిస్థాన్‌కు ఐసీసీ కఠిన హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. మొత్తం టోర్నీని లేదా ఫిబ్రవరి 15న భార‌త్ తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

బ‌హిష్క‌రిస్తే భారీ మూల్య‌మే..

బహిష్కరణ జరిగితే, పాకిస్థాన్‌ను ప్రపంచకప్, ఆసియా కప్ వంటి గ్లోబల్ టోర్నీల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడే విదేశీ ఆటగాళ్లకు ఇచ్చే ఎన్‌ఓసీలను కూడా రద్దు చేసే అవకాశం ఉందని ఐసీసీ హెచ్చరించినట్టు సమాచారం. ఈ నిర్ణయం పీసీబీకి ఆర్థికంగా, క్రీడాపరంగా భారీ నష్టాన్ని కలిగిస్తుందని ఐసీసీ అధికారులు స్పష్టంగా తెలియజేశారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ వారం చివర్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నప్పటికీ, కఠిన ఆంక్షల భయం, తమ స్థానంలో బంగ్లాదేశ్‌ను చేర్చే అవకాశాన్ని ఐసీసీ సిద్ధంగా ఉంచుకోవడం వంటివి దృష్టిలో ఉంచుకుంటే, పాకిస్థాన్ టోర్నీని బహిష్కరించే అవకాశం ఇప్పుడు చాలా తక్కువగా ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఏర్పడిన ఈ రాజకీయ, దౌత్య పరిణామాలు క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక పాకిస్థాన్ చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఐసీసీ దానిపై ఎలా స్పందిస్తుందోన‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement