త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ప‌శ్చిమాసియాలో సంక్షోభం..! ఐపీఎల్‌కి అడ్డంకిగా..!

IPL 2026 | ఐపీఎల్ 19వ సీజన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐకి ఇంకా ప్రకటించలేదు. టోర్నీ తొలి 20 రోజుల షెడ్యూల్‌ను మార్చి 12 నాటికి విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.

P

Sports | Published On Mar 10, 2026, 9.30 pm IST

IPL 2026 | ప‌శ్చిమాసియాలో సంక్షోభం..! ఐపీఎల్‌కి అడ్డంకిగా..!
Advertisement

IPL 2026 | ఐపీఎల్ 19వ సీజన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐకి ఇంకా ప్రకటించలేదు. టోర్నీ తొలి 20 రోజుల షెడ్యూల్‌ను మార్చి 12 నాటికి విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఇదిలా ఉండగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ ఏర్పాట్లపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వంటగ్యాస్ (LPG) సరఫరా, విదేశీ ఆటగాళ్ల ప్రయాణ ఏర్పాట్లపై పరిస్థితిని సమీక్షిస్తోంది. దీనిపై ఐపీఎల్ చైర్మ‌న్ అరుణ్ ధుమాల్ స్పందించారు. హోట‌ల్స్‌, ఇత‌ర భాగ‌సామ్య సంస్థ‌ల నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదులు రాలేవ‌న్నారు. అయినప్పటికీ పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు. ఎల్‌పీజీ కొరత కారణంగా హోట‌ల్స్ సమస్యలు వ‌స్తే బోర్డుకు స‌మాచారం ఇస్తార‌ని, అప్పుడు పరిస్థితిని బట్టి తగిన నిర్ణయాలు తీసుకుంటామ‌న్నారు.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పశ్చిమ ఆసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాని ప్ర‌భావం ఎల్‌పీజీ సరఫరాపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ప్రకారం.. గృహ వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. దాంతో హోట‌ల్స్‌, రెస్టారెంట్లకు అవసరమైన కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరాలో కొర‌త ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబ‌యి, బెంగళూరు, చెన్నై త‌దిత‌ర నగరాల్లోని పలువురు రెస్టారెంట్ యజమానులు గ్యాస్ కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా దెబ్బతింటే ఐపీఎల్ సమయంలో హోటల్, హాస్పిటాలిటీ సెక్టార్‌ఫై ప్రభావం పడే అవకాశం ఉన్న‌ది.

విదేశీ ఆటగాళ్ల ప్రయాణంపై ఆందోళన

ఐపీఎల్‌కి ముందు విదేశీ ఆటగాళ్లు, బ్రాడ్‌కాస్ట‌ర్స్ ప్ర‌యాణ ఏర్పాట్లు సైతం స‌వాల్‌గా మార‌నున్న‌ది. సాధారణంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ దేశాల ప్లేయ‌ర్స్ భార‌త్‌కు వ‌చ్చేందుకు దుబాయి మీదుగా వ‌స్తుంటారు. అయితే, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా కొన్ని విమాన మార్గాలు ప్రభావితమయ్యే అవ‌కాశం ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ సమయంలో ఇవే స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. దుబాయి మార్గం ప్ర‌భావితం కావ‌డంతో జింబాబ్వే జ‌ట్టును అడిస్ అబాబా మీదుగా ఈథియోపియన్ ఎయిర్‌లైన్స్ మూడు విడుత‌ల్లో స్వ‌దేశానికి పంపాల్సి వ‌చ్చింది.

కోల్‌కతాలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లను చార్టర్డ్ విమానాల ద్వారా జోహానెస్‌బర్గ్‌కు త‌ర‌లించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రూట్స్‌లో ప్ర‌భావం లేక‌పోయినా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల ఆటగాళ్లు, కోచ్‌లు, ప్రసార బృందాలు ఐపీఎల్‌లో ఆడేందుకు స‌మ‌యానికి భార‌త్‌కు చేరుతారా? లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా కొన్ని వారాల సమయం ఉన్నందున పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని అరుణ్ ధుమాల్ తెలిపారు. అవసరమైతే ప్రయాణం సహా ఇతర ఏర్పాట్లపై తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement