త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | తుమ్మిడిహెట్టిపై మంత్రులవి మ‌తి లేని మాట‌లు.. వీళ్లకు బేసిక్ సెన్స్ లేదు: హ‌రీశ్‌రావు

Harish Rao | తుమ్మిడిహెట్టి (Tummidihatti barrage) పై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నార‌ని.. అసలు వీళ్లకు బేసిక్ సెన్స్ లేదని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) కి పొలిటికల్ స్కోరింగే తప్ప, స్టేట్ స్కోరింగ్ మీద ధ్యాస లేదని.. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఎద్దేవా చేశారు.

S

News | Published On May 9, 2026, 1.31 pm IST

Harish Rao | తుమ్మిడిహెట్టిపై మంత్రులవి మ‌తి లేని మాట‌లు.. వీళ్లకు బేసిక్ సెన్స్ లేదు: హ‌రీశ్‌రావు
Advertisement
  • కటిక చీకట్లో కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు
  • కాళేశ్వరాన్ని కించపరిస్తే, ముక్తేశ్వరుడి శిక్ష తప్పదు
  • మేడిగడ్డ మరమ్మతులు చేతగాక, తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ డ్రామాలు
  • 150 మీటర్లకు ఒప్పందం జరిగితే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తట్టెడు మట్టైనా ఎందుకు తీయలే?
  • ఎల్ నినో ముప్పుతో తక్షణమే మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేయాలి
  • మ‌హారాష్ట్ర పోకుండా కిష‌న్‌రెడ్డికి లేఖ‌లా?
  • రేవంత్‌కు పొలిటిక‌ల్ స్కోరింగ్ త‌ప్పా.. స్టేట్ స్కోరింగ్ లేదు
  • ఒప్పందం లేకుండా క‌డితే ప‌నుల‌న్నీ నీళ్ల పాలే
  • హార‌తుల‌తో డ్రామాలు త‌ప్పా ప‌నులు లేవు
  • మూడు చోట్ల అధికారం ఉన్న‌ప్పుడే క‌ట్ట‌లేక‌పోయారు
  • బ‌డ్జెట్‌లో పెట్టిన డ‌బ్బులు ఏ మూల‌కు స‌రిపోవు
  • ప్రాణ‌హిత‌-చేవెళ్ల‌పై కాంగ్రెస్‌కు చిత్త‌శుద్ధి లేదు
  • కాంగ్రెస్ స‌ర్కార్‌పై హ‌రీశ్‌రావు ధ్వ‌జం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తుమ్మిడిహెట్టి (Tummidihatti barrage) పై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నార‌ని.. అసలు వీళ్లకు బేసిక్ సెన్స్ లేదని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) కి పొలిటికల్ స్కోరింగే తప్ప, స్టేట్ స్కోరింగ్ మీద ధ్యాస లేదని.. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఎద్దేవా చేశారు. సిద్దిపేట‌లో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బ్యారేజీ క‌ట్టాలంటే మ‌హారాష్ట్ర వెళ్లి ఒప్పందం చేసుకోవాల‌ని సూచించారు. అలా కాకుండా కిష‌న్‌రెడ్డికి రేవంత్ లేఖ రాయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు.

మంత్రుల‌వి ప‌రిజ్ఞానం లేని మాట‌లు..

తుమ్మిడిహెట్టి ద‌గ్గ‌ర బ్యారేజీ క‌డితే గ్రావిటీ ద్వారా ఎల్లంప‌ల్లికి నీళ్లు పోతాయ‌ని మంత్రి జూప‌ల్లి అంట‌డు. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి ద‌గ్గ‌ర బ్యారేజీ క‌ట్టి సుందిళ్లకు నీళ్లు తెస్త‌మ‌ని అంట‌డు. మేం తుమ్మిడిహ‌ట్టి నుంచి ఎల్లంప‌ల్లికి నీళ్లు తెస్త‌మ‌ని సీఎం రేవంత్ అంట‌డు. లిఫ్ట్ పెడ‌త‌మంట‌డు. లిఫ్ట్ ఎందుక‌ని జూప‌ల్లి అంట‌డు. అస‌లు ఎవ‌రు క‌రెక్టు, ఏదీ క‌రెక్టు, ఇంత అవ‌గాహ‌నా రాహిత్య‌మా? మ‌తిలేని మాట‌లు, సోయిలేని మాట‌లు.. అవ‌గాహ‌న లేని, ప‌రిజ్ఞానం లేని మాట‌లు మాట్లాడుతూ రాష్ట్ర ప‌రువు తీస్తున్న‌రు. మీ ప‌రువు తీసుకుంటే తీసుకోండి. మాకు అభ్యంత‌రం లేదు. కానీ రాష్ట్రాన్ని ఆగం చేయొద్దు అని ఆయ‌న‌ విమ‌ర్శించారు.

బీఆర్ఎస్‌పై బుర‌ద జ‌ల్లే కుట్ర‌..

నిన్న ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావిడి చూసిన తర్వాత ఒక‌ విషయం అర్థమవుతోంది. పని తక్కువ ప్రచారం ఎక్కువ. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యం. ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని తెలిసినప్పుడు హడావిడిగా బాయి తవ్వినట్లు కాకుండా, ముందస్తుగా మేడిగడ్డ రిపేర్లు చేయాలి. కానీ దాన్ని వదిలేసి తమ్మిడిహట్టి కడుతున్నట్లు పేపర్లకు ఫోజులిస్తున్నారు. కురచ బుద్ధితో బీఆర్ఎస్ పై బురద జల్లే కార్యక్రమం తప్ప వారు చేస్తున్నది శూన్యం. మేం మంత్రులం ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని అతి విశ్వాసంతో వాళ్లు మాట్లాడుతున్నట్లుంది. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నాడు. కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఆయన తన అవివేకాన్ని బయటపెట్టుకున్నాడు. తమ్మిడిహట్టి వద్ద ఎకో సెన్సిటివ్ జోన్ ఉంది, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది. సుప్రీంకోర్టు తీర్పు రావాలి. ఈ సాధకబాధకాలు తీర్చకుండా.. మేనిఫెస్టోలో పెట్టి డైలాగులు కొట్టడం తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు.

150 మీట‌ర్ల ఎత్తుకు బ్యారేజీ క‌ట్టడానికి కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర‌ను ఒప్పించాల‌ని, అందుకు నేను లేఖ రాస్తున్నా అని సీఎం రేవంత్ అన్న‌డు. కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఉన్న‌ప్పుడే 150 మీట‌ర్ల‌కు ఒప్పందం జ‌రిగింద‌ని మంత్రి వివేక్ అంట‌డు. మ‌రి అప్పుడే ఒప్పందం అయితే కిష‌న్‌రెడ్డికి రేవంత్‌ ఎందుకు లేఖ రాసిన‌ట్టు? కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఉన్న‌ప్పుడే ఒప్పందం అయ్యుంటే త‌ల ద‌గ్గ‌ర కాకుండా తోక ద‌గ్గ‌ర ప‌నులు ఎందుకు ప్రారంభించారు? తుమ్మిడిహెట్టి ద‌గ్గ‌ర కాకుండా చేవెళ్ల ద‌గ్గ‌ర పనులు ఎట్లా చేసిర్రు? అని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించారు.

రేవంత్‌రెడ్డిది పొలిటిక‌ల్ స్కోరింగ్ త‌ప్పా.. స్టేట్ స్కోరింగ్ లేదు. రేవంత్‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు పట్ట‌వు. విజ్ఞ‌త‌తో ప‌క్క రాష్ట్రానికి వెళ్లి ఒప్పంచాలి, మెప్పించాలి. మ‌ర్యాద‌పూర్వ‌కంగా పోయి క‌ల‌వాలి. కానీ రేవంత్‌ది రెచ్చ‌గొట్టే తీరు ఉంది. నిజంగా కిష‌న్‌రెడ్డికి లేఖ రాస్తే మ‌హారాష్ట్రల అగ్రిమెంట్ అయిత‌దా? బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ నెల రోజుల్లోనే నేను మ‌హారాష్ట్ర‌కు వెళ్లిన‌. అక్క‌డ సీఎం, మంత్రుల‌ను క‌లిసి మాట్లాడినం. మీరు రెండున్న‌రేండ్లు అయినా అటుదిక్కు పోలే. మ‌హారాష్ట్ర‌తో ఒప్పందం లేకుండా చేసిన ప‌నుల‌న్నీ నీళ్ల‌పాలైత‌య్ అని ఆనాడే ఆ రాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ చెప్పిండు అని మాజీ మంత్రి గుర్తు చేశారు.

82 కోట్ల‌తో పూర్త‌వుతుందా..

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 2024-25 బడ్జెట్లో పెట్టింది 2 కోట్లు, 2025లో 30 కోట్లు, ఈ ఏడాది 50 కోట్లు. మొత్తం 82 కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతుందా? మీరు మాటల కోసమే తప్ప చేతల కోసం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో ఎందుకు సరైన నిధులు కేటాయించలేదు? నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మాట ఇచ్చి ఏడున్నరేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా, కనీస సర్వే లేకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ. 2300 కోట్లు బిల్లులు లేపారు. కరప్షన్ అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల పనులకు, ల్యాండ్ అక్విజిషన్ కు ఖర్చు చేసింది రూ. 3780 కోట్లు. కానీ నిన్న రేవంత్ రెడ్డి 11 వేల కోట్లు పూర్తయ్యాయి అని పచ్చి అబద్ధం చెబుతున్నారు.

మండుటెండ‌లో కూడా 6,400 క్యూసెక్కుల నీరు..

ఢిల్లీలో, మ‌హారాష్ట్ర‌లో, తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడే తుమ్మిడిహ‌ట్టికి మీరు మహారాష్ట్ర‌ను ఒప్పించ‌లేక‌పోయారు. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ఆనాడు మంత్రిగా ఉన్నారు. మీకు చిత్త‌శుద్ధి లేక‌పోవ‌డం వ‌ల్లే మూడు చోట్ల అధికారం ఉన్నా ఒప్పించ‌లేక‌పోయారు. ఈ మండుటెండల్లో ఈ నిమిషానికి మేడిగడ్డ వద్ద 6400 క్యూసెక్కుల నీళ్లు కిందకి వెళ్లిపోతున్నాయి. కానీ తమ్మిడిహట్టి వద్ద కేవలం 2000 క్యూసెక్కులు మాత్రమే పోతున్నాయి. 2 వేలు ఎక్కడ? 6400 క్యూసెక్కులు ఎక్కడ? మేడిగడ్డ వద్ద 500 బోర్లు వేయాల్సి ఉంటే మీరు కనీసం 5 బోర్లు కూడా వేయలేదు. ఆ రెండు పిల్లర్లకు మరమ్మతులు చేస్తే కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందో అన్న అక్కసుతోనే పనులు ఆపుతున్నారు. వచ్చే సంవత్సరం ఎల్ నినో వల్ల దేశమంతా కరువు వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. కటిక చీకట్లో కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత కరువొచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే స్థలం మేడిగడ్డ. కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ తాగు, సాగునీటి అవసరాల కోసం ఇంజినీర్లతో చర్చించి ఈ ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరాన్ని తక్కువ చేసి మాట్లాడితే, అది కేసీఆర్ ను తక్కువ చేసినట్లు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ జాతికి మీరు చేస్తున్న ద్రోహం అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేయకండి. కాళేశ్వరాన్ని కించపరిస్తే, అందులో కొలువైన ముక్తేశ్వరుడు మీకు కచ్చితంగా శిక్ష వేస్తాడు, తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తమ్మిడిహట్టి జలహారతుల డ్రామాలు కట్టిపెట్టి, వెంటనే మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

నువ్వు సీపీగా ఉండి ఎందుకు?

హైదరాబాద్ నడిబొడ్డున సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను మర్డర్ చేస్తే ఇప్పటి వరకి వాళ్ల‌ని పట్టుకునే పరిస్థితి లేదు. మళ్లీ జాగ్రత్తగా ఉండండని సీపీ స్టేట్మెంట్ ఇస్తున్నడు. ఇంక నువ్వు సీపీగా ఉండి ఎందుకు? సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ భార్యని హత్య చేస్తే దిక్కు లేదు, పట్టపగలు కరీంనగర్ నడిబొడ్డున బంగారం దోపిడీ చేస్తే దిక్కు లేదు, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేస్తే ఆపే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ వేధింపులకు కొదవ లేదు. క్రిశాంక్ చేసిన తప్పు ఏంటి? మా మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధిస్తారు. దొంగని దొరకబట్టి పోలీసులకు అప్పజెప్పినందుకు క్రిశాంక్ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి 20 రోజులు జైలులో వేశారు. దేశంలో అత్యధిక క్రైమ్ రేట్ ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో అని నిన్ననే కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement