త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | త‌డిసిన ధాన్యం ప్ర‌భుత్వమే కొంటుంది: పొన్నం

Ponnam Prabhakar | ఇటీవల కురిసిన వ‌ర్షానికి త‌డిసిన ధాన్య‌మంతి ప్ర‌భుత్వం కొంటుంద‌ని, కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగాలని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అధికారుల‌కు సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

S

News | Published On May 11, 2026, 3.54 pm IST

Ponnam Prabhakar | త‌డిసిన ధాన్యం ప్ర‌భుత్వమే కొంటుంది: పొన్నం
Advertisement
  • కొనుగోలు ప్ర‌క్రియ వేగంగా జ‌ర‌గాలి
  • గన్ని బ్యాగ్స్ కొరత రాకుండా చూసుకోండి
  • సభ్యుల కమిటీ అధికారులతో సమన్వయం చేస్తూ పర్యవేక్షించాలి
  • ఏ సమస్య వచ్చినా మా కార్యాలయ దృష్టికి తీసుకురండి
  • అక్కన్నపేట, హుస్నాబాద్ టౌన్, శనిగరం, కోహెడ, బస్వాపూర్ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి
  • ఇక నుంచి రోజు త‌ప్పిచ్చి రోజు కాన్ఫ‌రెన్స్ ఉంటుంది
  • ధాన్యం కొనుగోళ్ల‌పై టెలికాన్ఫ‌రెన్స్ లో అధికారుల‌కు మంత్రి పొన్నం ఆదేశం

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్: ఇటీవల కురిసిన వ‌ర్షానికి త‌డిసిన ధాన్య‌మంతి ప్ర‌భుత్వం కొంటుంద‌ని, కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగాలని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అధికారుల‌కు సూచించారు. అక్కన్నపేట, హుస్నాబాద్ టౌన్, శనిగరం, కోహెడ, బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండడంతో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమ‌వారం ఆయ‌న హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అధికారుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు సూచ‌న‌లు చేశారు.

నిర్ల‌క్ష్యం చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగాలి. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడేలా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగ్స్ కొరత రాకుండా చూసుకోవాలి. వర్షాల వ‌ల్ల‌ ధాన్యం తడవకుండా రైతులకు టార్ఫాలిన్ లు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం ఇటీవల వర్షానికి త‌డిసిన‌ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది.

మిల్లుల వ‌ద్ద స‌మ‌స్య రావొద్దు..

ఐదుగురు సభ్యులతో ప్రతి గ్రామానికి వేసిన కమిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలి. కొనుగోలు కేంద్రాల్లో ఏ సమస్య వచ్చినా మా కార్యాలయ దృష్టికి తీసుకురండి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కొనుగోలు విషయంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిల్లుల వద్ద సమస్య రావద్దు. ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలుపై కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేయాలి అని పొన్నం సూచించారు.

అడుగు పెట్టేంత స్థ‌లం లేకుండా ధాన్యం వ‌స్తోంది..

ధాన్యం తరలింపులో వాహనాల సమస్య రావద్దు. ప్రతి జిల్లాకు ఒక ఏంవీఐ అధికారిని ప్రత్యేకంగా వాహనాలు తరలించడానికి కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పాటు చేయాలని డీటీసీలకు ఆదేశాలు ఇచ్చాను. హ‌మాలీల కొరత లేకుండా చూసుకోవాలి. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో అడుగు పెట్టేంత స్థలం లేకుండా ధాన్యం వస్తున్నది. ఇప్పటికే ఐదు బృందాలు కాంటా వేస్తున్న‌ప్ప‌టికీ అదనంగా ఏర్పాటు చేయాలి.

కార్య‌ద‌ర్శులు, ఏఈవో, గ్రామ క‌మిటీ స‌భ్యులు స‌మ‌న్వ‌యం చేసుకోవాలి..

ఏ గ్రామం నుండి సమస్య వచ్చినా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఏఈవో, గ్రామ కమిటీ కో ఆర్డినేట్ చేసుకోవాలి.
ప్రధానంగా ధాన్యం అధికంగా వచ్చే అక్కన్నపేట, హుస్నాబాద్ టౌన్, శనిగరం, కోహెడ, బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. శనిగరంలో రోజుకు 3-4 లారీలు వస్తున్నాయి. అదనంగా లారీలు లేదా ట్రాక్టర్ లను ఉపయోగించాలి. ఇక నుండి రోజు త‌ప్పిచ్చి రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తాను అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ అడిషన‌ల్‌ కలెక్టర్ లు, ఆర్డీవోలు, డీఎస్ వోలు, డీఎం సివిల్ సప్లయ్ అధికారులు, ఎమ్మార్వో లు, వ్యవసాయ అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ ఇంచార్జీలు, గ్రామాల వారీగా ధాన్యం కొనుగోలు కమిటీల స‌భ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement