త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Rising | రైజింగ్ తెలంగాణ కాదు… సింకింగ్‌ తెలంగాణ

Telangana Rising | గ‌ల్లంతైన గ్యారంటీలు - నెర‌వేర‌ని హామీలు, కాంగ్రెస్ వంచ‌న‌కు రెండేళ్ల పేరుతో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వ‌ర్యంలో ఇందిరాపార్క్ (Indira Park) వ‌ద్ద ఆదివారం మ‌హాధ‌ర్నా (Maha Dharna) నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ‌ల్లంతైన గ్యారంటీలు, నెర‌వేర‌ని హామీలు పేరుతో చార్జ్‌షీట్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నాయ‌కులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైజింగ్ తెలంగాణ (Rising Telangana) కాద‌ని సింకింగ్ తెలంగాణ (Sinking Telangana) న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు

A

News | Published On Dec 7, 2025, 6.15 pm IST

Telangana Rising | రైజింగ్ తెలంగాణ కాదు… సింకింగ్‌ తెలంగాణ
Advertisement

Telangana Rising | రాష్ట్రంలో రైజింగ్ తెలంగాణ (Rising Telangana) అంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఊద‌ర‌గొడుతున్న‌ప్ప‌టికీ సింకింగ్ తెలంగాణ (Sinking Telangana) అవుతోంద‌ని బీజేపీ (BJP) నాయ‌కులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల‌ను అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. హామీల అమ‌లుపై ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. గ‌ల్లంతైన గ్యారంటీలు - నెర‌వేర‌ని హామీలు, కాంగ్రెస్ (Congress) వంచ‌న‌కు రెండేళ్ల పేరుతో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వ‌ర్యంలో ఇందిరాపార్క్ (Indira Park) వ‌ద్ద ఆదివారం మ‌హాధ‌ర్నా (Maha Dharna) నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ‌ల్లంతైన గ్యారంటీలు, నెర‌వేర‌ని హామీలు పేరుతో చార్జ్‌షీట్ విడుద‌ల చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి (Kishan Reddy) హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌దేళ్ల బీఆర్ఎస్ (BRS) పాల‌న‌కు వ్య‌తిరేకంగా మార్పు, అనేక గ్యారంటీలు, హామీల‌తో అధికారంలోకి వ‌చ్చారని చెప్పారు. రెండేళ్ల విజ‌యోత్స‌వాల పేరుతో రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టిస్తున్నారని అన్న ఆయ‌న ఏ ముఖంతో ఉత్స‌వాలు చేస్తున్నార‌ని సీఎంను ప్ర‌శ్నించారు. స‌భ‌ల్లో హామీలు ఎన్ని అమ‌లు చేశారో ప్ర‌జ‌ల‌కు ఎందుకు చెప్ప‌డం లేదో స‌మాధానం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఎక్క‌డైనా ఫ్రీ బ‌స్సు, స‌న్న బియ్యం ప‌థ‌కాల గురించే మాట్లాడుతున్నార‌ని చెప్పారు. స‌న్న‌బియ్యం ఇవ్వ‌డంలో ప్ర‌తీ కేజీకి రూ.43 కేంద్ర ప్ర‌భుత్వం భ‌రిస్తుండ‌గా, కేవ‌లం కేజీకి రూ.13 రాష్ట్ర ప్ర‌భుత్వం ఇస్తోంద‌ని వివ‌రించారు. ఈ విష‌యాన్ని దాచి, కేవ‌లం త‌మ ఘ‌న‌త‌గా దానిని ఎందుకు చెప్పుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో రెండేళ్ల‌లో ఏ రంగంలోనూ మార్పు రాలేదని, పార్టీ ఫిరాయింపుల్లోనూ మార్పు రాలేదని పేర్కొన్నారు. కేవ‌లం రాష్ట్రంలో ఒకే ఒక మార్పు జ‌రిగింద‌ని, గులాబీ జెండా పోయి చెయ్యి గుర్తు జెండా వ‌చ్చింద‌న్నారు. రైతులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఉద్య‌మ‌కారులు, ఉద్యోగులు, ఇత‌ర ఏ వ‌ర్గాల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చారో చెప్పాలని సూచించారు. గ్యారంటీల అమ‌లుపై ఇందిరాపార్క్ వ‌ద్ద లేదంటే ప్ర‌జాభ‌వ‌న్‌, ప్రెస్ క్ల‌బ్‌లో నైనా చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని స‌వాల్ విసిరారు. వ‌రిపై త‌ప్ప మ‌రే ఇత‌ర పంట‌పై కూడా బోన‌స్ లేదని అన్నారు. కౌలురైతులు, రైతు కూలీల‌కు ఇచ్చిన హామీల అమ‌లేమైంద‌ని ప్ర‌శ్నించారు. మొద‌టి సంవ‌త్స‌రంలోనే రెండు ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీ, నిరుద్యోగ భృతి అని చెప్పార‌ని, అవేమ‌య్యాయో చెప్పాల‌ని హిత‌వు ప‌లికారు. అన్ని వ‌ర్గాల‌కు పెన్ష‌న్ల ఏదీ జ‌ర‌గ‌లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిపడ్డారు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌. రాంచంద‌ర్‌రావు (Ramchander Rao) మాట్లాడుతూ ఆరు గ్యారంటీల‌లో ఒక గ్యారంటీ కూడా అమ‌లు కాలేదని ఆరోపించారు. ఇచ్చిన వాగ్ధానాలు ఎందుకు పూర్తి కాలేద‌ని ప్ర‌శ్నించారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు, ఆరోగ్య శ్రీ బ‌కాయిలు ఏవీ విడుద‌ల చేయ‌కుండా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో అప్పుడు సీఎం అండ్ స‌న్ పాల‌న సాగ‌గా, అది పోయి ఇప్పుడు సీఎం అండ్ బ్ర‌ద‌ర్స్ పాల‌న వ‌చ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌మిష‌న్‌, కాంట్రాక్టుల ప్ర‌భుత్వంగా మారింద‌ని విమ‌ర్శించారు. హిందూ దేవ‌త‌ల‌ను అవ‌మానిస్తూ, కోట్లాది ప్ర‌జ‌ల విశ్వాసాల‌ను దెబ్బ‌తీశారని ధ్వ‌జ‌మెత్తారు. హిందూ ప్ర‌జ‌ల‌కు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నార‌ని, రేవంత్‌కు మాత్రం సోనియా, రాహుల్‌, ప్రియాంక ముగ్గురు దేవుళ్లు మాత్ర‌మే ఉన్నార‌ని చెప్పారు. దేవాల‌య భూముల‌ను ఆక్ర‌మిస్తున్నా, గోర‌క్ష‌కుల‌పై తుపాకీల‌తో కాల్చినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదని నిప్పులు చెరిగారు. కీల‌క‌మైన విద్య‌, హోం, దేవాదాయ శాఖ‌లు అన్నీ రేవంత్ త‌న వ‌ద్దే ఉంచుకున్నార‌ని, అన్ని శాఖ‌లు విఫ‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంద‌న్నారు. హైద‌రాబాద్‌లో బాబ్రీ మ‌సీదును క‌డ‌తామ‌ని త‌హ‌రీక్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా స్పందిస్తూ, ఆ ప్ర‌య‌త్నం చేస్తే భాగ్య‌న‌గ‌రంలో అత‌డి ఘోరీ క‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. కేంద్ర‌ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఎన్నో చేస్తోందని, కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం అవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ప్ర‌జావ్య‌తిరేక చ‌ర్య‌లకు పాల్ప‌డుతోంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌లో అర్బ‌న్ న‌క్స‌లైట్ల‌ను ప్రోత్స‌హిస్తోంది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆరోపించారు. ర‌జాకార్ల కంటే కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల అరాచ‌కాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బెదిరింపులు, దౌర్జ‌న్యాల‌కు దిగుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌శ్నిస్తే కేసులు, జైళ్లు, హౌజ్ అరెస్టులు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రేవంత్‌రెడ్డి ప‌ద‌వి ఊగిస‌లాట‌లో ఉంద‌న్నారు. మంత్రులే సీఎం కుర్చీ కాళ్లు ప‌ట్టుకుని లాగుతున్నారని, అది కూల‌డం ఖాయమ‌ని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌న వైఖ‌రి మార్చుకుని హామీలు, గ్యారంటీలు అమ‌లు చేయ‌క‌పోతే మ‌హాధ‌ర్నా త్వ‌ర‌లోనే ధ‌ర్మ‌యుద్ధంగా మారుతుందని హెచ్చ‌రించారు.

ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు కె. ల‌క్ష్మ‌ణ్ (Lakshman) మాట్లాడుతూ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టి ప్ర‌చారం చేసుకుంటున్నారని అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి, న‌ట్టేట ముంచారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ రైజింగ్ పేరిట ఉత్స‌వాలు చేస్తున్నార‌ని, కానీ తెలంగాణ‌లో రైజింగ్ క‌ర‌ప్ష‌న్ అమ‌ల‌వుతోందని విమ‌ర్శించారు. అవినీతిలో అగ్ర‌భాగంగా తెలంగాణ నిలుస్తోంద‌ని వాపోయారు. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం మ‌త్తుప‌దార్థాలు, మ‌ద్యం స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తున్నాయని, గ‌న్‌క‌ల్చ‌ర్, ల్యాండ్ మాఫియా కల్చ‌ర్‌, ఆన్‌లైన్ గేమింగ్ కల్చ‌ర్‌ పెరిగిందని ఆరోపించారు. భూ మాఫియా ఉగ్ర‌రూపం దాల్చింద‌ని చెప్పారు. వాటాల పంప‌కాల్లో మంత్రుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చి ప‌రిపాల‌న అస్త‌వ్య‌స్థంగా మారింద‌న్నారు. దేశంలో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు ఎక్క‌డ జ‌రిగినా మూలాలు హైద‌రాబాద్‌లోనే బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని గుర్తు చేశారు. రెండేళ్లుగా రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ కుప్ప‌కూలిందన్న ఆయ‌న ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ దిక్కుతోచ‌ని ప‌రిస్థ‌తిల్లో ఉన్నాయని చెప్పారు. ల‌క్ష‌ల కోట్ల విలువైన భూములు హిల్ట్ పేరుతో అప్ప‌నంగా దోచిపెట్టేందుకు ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ సంప‌ద‌ను దోచి, ఢిల్లీకి క‌ప్పం క‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించారన్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌ని పేర్కొన్నారు. వీట‌న్నింటి నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు హైడ్రా, మూసీ ప్ర‌క్షాళ‌న పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నాయ‌కుడు ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన అనంత‌రం లంకెబిందెల కోసం వెతుకుతున్నార‌ని, అవి ఆర్‌, డ‌బుల్ఆర్‌, బీ, యూ ట్యాక్స్‌ల రూపంలో దొరికాయ‌ని అన్నారు. రాష్ట్రంలో వేల, ల‌క్ష‌ల కోట్ల కుంభ‌కోణాలకు పాల్ప‌డుత‌న్నార‌ని ల్యాండ్ మాఫియాను ప్రోత్స‌హిస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ ద్వారా ఆరు ల‌క్ష‌ల ముప్పైవేల కోట్ల కుంభ‌కోణానికి తెర‌లేపారని మండిప‌డ్డారు. ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసి భూములు క‌బ్జా చేయాల‌ని చూస్తున్నార‌ని చెప్పారు. గ‌తంలో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల క‌బ్జాకు ప్ర‌య‌త్నం చేశార‌ని, కానీ కేంద్ర‌ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవ‌డంతో వెన‌క్కి త‌గ్గింద‌ని గుర్తు చేశారు. హిల్ట్ భూములు ముట్టుకోవాలంటే కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ అనుమ‌తి కావాలని చెప్పారు. త్వ‌ర‌లోనే కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రిని క‌లిసి దీనిపై ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే ఈ కుంభ‌కోణాన్ని అన్ని రుజువుల‌తో నిరూపిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. లేనిప‌క్షంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయ స‌న్యాసం స్వీక‌రిస్తాన‌ని స‌వాల్ చేశారు. హిల్ట్‌కు వ్య‌తిరేకంగా ఆమ‌ర‌ణ దీక్ష చేసేందుకు కూడా సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. రేవంత్‌రెడ్డి ప్ర‌స్తుతం రాబందు రెడ్డిగా మారార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి పి. ముర‌ళీధ‌ర్‌రావు, ఎంపీ డీకే అరుణ‌, ఎమ్మెల్సీలు మ‌ల్క కొమ‌ర‌య్య‌, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు పాయ‌ల్ శంక‌ర్‌, వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాం నాయ‌క్‌, బీబీ పాటిల్‌, మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్‌, యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, గువ్వ‌ల బాల‌రాజు, జాతీయ నాయ‌కులు పొంగులేటి సుధాక‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement