త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | అక్ర‌మ కేసులు బంజెయ్‌.. ఆరు గ్యారంటీలు అమ‌లు చెయ్‌: రేవంత్‌పై హ‌రీశ్‌రావు ఫైర్‌

Harish Rao | అక్ర‌మ కేసులు (Illegal cases) బంజేసి, ఆరు గ్యారంటీల మీద సోయి పెట్టాల‌ని, రైతుల‌ను ప‌ట్టించుకోవాల‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. కంది జైలులో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ (Manne Krishank) ను మంగ‌ళ‌వారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్ త‌దిత‌రుల‌తో క‌లిసి ఆయ‌న‌ పరామర్శించి ధైర్యం చెప్పారు.

S

News | Published On Apr 28, 2026, 1.26 pm IST

Harish Rao | అక్ర‌మ కేసులు బంజెయ్‌.. ఆరు గ్యారంటీలు అమ‌లు చెయ్‌: రేవంత్‌పై హ‌రీశ్‌రావు ఫైర్‌
Advertisement
  • ఏడో గ్యారంటీ ప్ర‌శ్నించే హ‌క్కు అన్న‌వ్‌.. ఏమైంది
  • ప్ర‌శ్నించే గొంతుల‌ను అణ‌చివేసుడే నీ ప‌నా
  • క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో బెంగ‌ళూరు హ్యాక‌ర్ల‌ను పెట్టిన‌వ్‌
  • మా ద‌గ్గ‌ర ఆధారాలున్న‌య్‌, ఎవ‌ర్నీ వ‌ద‌లం
  • మ‌క్క‌లు, శ‌న‌గ‌లు కొనే తెలివి లేదా?
  • ఇదేం పాల‌న? ఇది ప్ర‌జాస్వామ్య‌మేనా?
  • క్రిశాంక్ ప‌రామ‌ర్శ‌లో సీఎం రేవంత్ రెడ్డిపై హ‌రీశ్‌రావు ధ్వ‌జం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: అక్ర‌మ కేసులు (Illegal cases) బంజేసి, ఆరు గ్యారంటీల మీద సోయి పెట్టాల‌ని, రైతుల‌ను ప‌ట్టించుకోవాల‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి(Sangareddy) కంది జైలులో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ (Manne Krishank) ను మంగ‌ళ‌వారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్ త‌దిత‌రుల‌తో క‌లిసి ఆయ‌న‌ పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

క్రిశాంక్‌తో పాటు మ‌రో ఏడుగురు బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లపై అక్ర‌మ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ప్ర‌శ్నించే గొంతులను అణ‌చివేస్తున్న‌రు. అభివృద్ధి ప‌ట్ల‌, ప్ర‌జ‌ల ప‌ట్ల కాంగ్రెస్ కు ప‌ట్టింపు లేదు. అహంకార‌పూరిత‌, రాచ‌రిక ధోర‌ణిని అవ‌లంబిస్తున్న‌రు. ఆనాడు ఆరు గ్యారంటీల‌తో పాటు ఏడో గ్యారంటీ ప్ర‌శ్నించే హక్కును క‌ల్పిస్త‌మ‌న్న‌రు. ఈరోజు ఎవ‌రు మాట్లాడినా విజిలెన్స్ విచార‌ణ‌, సీఐడీ విచార‌ణ పేరుతో వేధిస్తున్న‌రు. క‌మీష‌న్లు, అక్ర‌మ కేసులు, అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్న‌రు అని హ‌రీశ్‌రావు మండిపడ్డారు.

ఫేక్ వార్త‌లు పెట్టినోళ్ల‌ను ఇళ్ల‌కు పంపిండ్రు..

క్రిశాంక్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు ఇచ్చిండు. కేసీఆర్‌, కేటీఆర్ మీద ఫేక్ పోస్టులు పెడుతున్న‌రు, త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేస్తున్న‌రని, మొబైల్‌లో ఆధారాలున్నాయ‌ని పోలీసుల‌కు ఒక మొబైల్‌ క్రిశాంక్ అందించిండు. త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేస్తున్నవారి మీద కేసులు పెట్టాల్సింది పోయి, ఫిర్యాదు ఇచ్చిన క్రిశాంక్‌, బీఆర్ఎస్ నాయ‌కుల మీద కేసులు పెట్టుడు ఎంత వ‌ర‌కు న్యాయం? ఫేక్ వార్త‌లు పెట్టినోళ్ల‌కు నోటీసులిచ్చి ఇంటికి పంపిండ్రు. ఇదెక్క‌డి పాల‌న‌, ఇది ప్ర‌జాస్వామ్య‌మా.. అని అడుగుతున్నా. 308 నాన్‌బెయిల‌బుల్ కేసు పెట్టిండ్రు. ఫోన్ తీసుకుంటే ఎవ‌ర‌న్న నాన్‌బెయిల‌బుల్ కేసు పెడ‌త‌రా? మేజిస్ట్రేట్ ఈ కేసును కొట్టేసిండు. ఇంకా త‌ప్పుడు కేసులు ఉన్న‌య‌ని చెప్పి జైల్లో పెట్టారు. క్రిశాంక్ హ‌త్య చేసిండా, రేప్ చేసిండా, త‌ప్పు చేసిండా? ఎట్ల పెడుత‌రు కేసులు అని ఆయ‌న ఫైర‌య్యారు.

ప్ర‌శ్నించే హ‌క్కును రాజ్యాంగం ఇవ్వ‌లేదా?

అంగ‌న్‌వాడీ మొబైల్ స్కాం మీద ప్ర‌శ్నిస్తే కేసు, ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్న ప‌త్రం లీక్ అయిందంటే క్రిశాంక్ మీద కేసు, కంచె గ‌చ్చిబౌలి భూముల మీద అడిగితే అక్క‌డా కేసు, మీస్ వ‌రల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లండ్ ప‌ట్ల కాంగ్రెస్ వ్య‌వ‌హరించిన తీరుపై ప్ర‌శ్నిస్తే క్రిశాంక్ మీద కేసు. ఇలా ఎన్ని కేసులు పెడుత‌రు? అనుముల మ‌హానంద‌రెడ్డి ఒక కేసులో ఇన్‌వాల్వ్ అయ్యాడు. అందులో అంద‌రిని అరెస్టు చేసి ఆయ‌న్నే ఎందుకు అరెస్టు చేయ‌లేదు? అడ‌గ‌డ‌మే నేర‌మా? ప్ర‌శ్నించే హ‌క్కు భార‌త రాజ్యాంగం పౌరుల‌కు ఇవ్వ‌లేదా?

మా ఫోన్లు, సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తున్న‌వ్‌..

జూబ్లీహిల్స్ ప్యాలెస్ ల కూసోని నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటున్న‌వ్‌. కానీ నీకు బుద్ధి చెప్ప‌డానికి రాష్ట్ర ప్ర‌జ‌లు ఇయాళ సిద్ధంగా ఉన్న‌రు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నావు. కొంత మంది ఐపీఎస్ అధికారులు మా ఫోన్లు, మా ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్న‌రు. బెంగ‌ళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్ల‌ను తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూంలో పెట్టి హ్యాక్ చేస్తున్న‌రు. ఐపీఎస్ అధికారుల‌ను హెచ్చ‌రిస్తున్న. మా ద‌గ్గ‌ర అన్ని ఆధారాలున్న‌యి. రేపు రిటైర్డ్ అయినా మిమ్మ‌ల్ని వ‌దిలి పెట్టం. మీరు చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు.

వ‌చ్చి కొనుగోలు కేంద్రాలు చూడు..

స‌గం కాలం ఐపోయింది. ఇంకా ఉన్న స‌గం కాలంల రైతుల‌కు మంచి చెయ్‌. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా? ఇవ్వవా? స్పష్టం చెయ్. మిల్లుల ముందు లారీలు నాలుగైదు రోజులుగా ఆగిపోతున్నాయి. శ‌న‌గ‌లు, పొద్దుతిరుగుడు రైతులు 20 రోజుల నుంచి ప‌డిగాపులు గాస్తున్న‌రు. మీ మంత్రులు, నీవు నిద్ర పోతున్న‌రా? మ‌క్క‌లు కొనే దిక్కే లేదు. ఎక‌రాకు 26 క్వింటాళ్లే కొంట‌మ‌ని కొత్త ష‌ర‌తు పెట్టిన‌వ్. 13 ల‌క్ష‌ల ఎక‌రాల్లో మక్క‌లు పండిన‌యి. స‌గం కూడా ప్ర‌భుత్వం కొన‌లే. ఇక వడ్ల కొనుగోలు కేంద్రాలు మొద‌లే కాలే. తాలు పేరు మీద క‌టింగులు పెడుతున్న‌రు. రా ఒక్క‌సారి రా.. రేవంత్ రెడ్డి ఒక్క‌సారి వ‌చ్చి కొనుగోలు కేంద్రాలు చూడు అని హిత‌వుప‌లికారు.

కేసులు ఎత్తేయాలి..

అక్ర‌మ కేసులు బంజెయ్‌.. ఆరు గ్యారంటీలు అమ‌లు చెయ్‌. నువ్ మ‌ళ్ల గెలిచేది లేదు. ఉన్న‌న్ని రోజుల‌న్నా స‌క్క‌గా ప‌ని చెయ్‌. క్రిశాంక్ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి. మ‌ళ్లీ పీటీ వారెంట్ల‌తో మ‌ళ్లా జైలుకు పంపడం వంటి వికృత చ‌ర్య‌లకు దిగొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నా. జైళ్ల వెట్టి ఏం సాధిస్త‌వ్ రేవంత్‌? క్రిశాంక్ బ‌య‌ట‌కొస్తే మ‌ళ్లీ ప్రశ్నిస్త‌డ‌ని భ‌య‌ప‌డుతున్న‌వా? తెలంగాణ బీఆర్ఎస్ కార్య‌కర్త‌లు నిన్ను ప్ర‌శ్నిస్తూనే ఉంట‌రు. నువ్ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత‌మందిని జైల్లో పెట్టినా మా పోరాటం ఆగ‌దు. విద్యార్థుల ప‌క్షాన‌, నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన‌, అన్యాయానికి గుర‌వుతున్న పీడితుల ప‌క్షాన మా పోరాటం కొన‌సాగుతూనే ఉంట‌ది. ప్ర‌జ‌ల కోసం పుట్టిన పార్టీ మాది. మీలాగ క‌మీష‌న్ల కోస‌మో.. దాందాల కోసమో అధికారంలోకి వ‌చ్చిన పార్టీ కాదు మాది. రైతు చ‌ట్టాల మీద‌, నీ హామీల మీద అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటం అని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement