త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను స్వాగతిస్తూ ఓయూలో ఉద్యోగ, అధ్యాపకుల ర్యాలీ

OU | సీఎం (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప‌ర్య‌ట‌న‌ను స్వాగ‌తిస్తూ, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటూ ఓయూ (OU)లో ర్యాలీ

A

News | Published On Dec 5, 2025, 2.14 pm IST

OU | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను స్వాగతిస్తూ ఓయూలో ఉద్యోగ, అధ్యాపకుల ర్యాలీ
Advertisement

OU | హామీలు నెరవేర్చి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి..
ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తూ, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు యూనివర్సిటీ రెగ్యులర్, కాంట్రాక్ట్ భోదన, భోదనేతర, అవుట్సోర్సింగ్, టైం స్కేల్ ఉద్యోగులు, పార్ట్ టైం టీచర్లు ఆహ్వానిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు యూనివర్సిటీ ఉద్యోగుల జేఏసీ లోని 10 సంఘాల ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యూనివర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి 2004 సెప్టెంబర్ కంటే ముందు నియమితులైన వారికి పాత పెన్ష‌న్ విధానం, త‌రువాత నియ‌మితులైన వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ( సిపీఎస్ ) అమలు చేయాలన్నారు.

ప్ర‌మోష‌న్ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను స‌రిదిద్దండి

యూజీసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కేవలం ఇంటర్వ్యూల ఆధారంగా 47 మంది అర్హతగల అధ్యాప‌కుల‌కు సీఏఎస్ ప్రమోషన్లను తిర‌స్కరించార‌ని, వాటిని స‌మీక్షించి, తిరిగి ప్రమోషన్లను ఇచ్చి, దీనికి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అకడమిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో గణనీయమైన కృషి చేస్తూ కాంట్రాక్టు అధ్యాపకులుగా చాలా కాలంగా పనిచేస్తున్న వారిని తక్షణమే క్రమబద్ధీకరించాలని కోరారు. క్రమబద్ధీకరణ చేసే వరకు గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ యూజీసీ పే స్కేలు అమలు చేయాల‌న్నారు. పార్ట్-టైమ్ ఉపాధ్యాయులను అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్)గా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. కాంట్రాక్ట్, టైమ్-స్కేల్ నాన్ టీచింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. క్రమబద్ధీకరణ చేసే వరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. టైమ్-స్కేల్కు అండ్ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బందికి 60% ఈపిఎఫ్ ని వెంటనే చెల్లించాలన్నారు. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు కూడా ఇవ్వండం లేదని, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన వేతనాన్ని అమలు చేయాలన్నారు.

హెల్త్ కార్డులు జారీ చేయండి

యూనివర్శిటీ ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులను అందించి, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సంరక్షణ సకాలంలో అందేలా చూడాలని కోరారు. అధ్యాపక, ఉద్యోగులందరికీ న్యాయమైన ప్రయోజనాలను కాపాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో ప్రొఫెసర్ బి.మనోహర్, ప్రొఫెసర్ సురేందర్ రెడ్డి, డాక్టర్ ఏ.పరుశురాం, డాక్టర్ ఎస్. విజేందర్ రెడ్డి, డాక్టర్ కుమార్, ఖాదీర్ ఖాన్, నాగరాజు, పవన్ కుమార్, డాక్టర్ సోమేష్, విఠ‌ల్ గౌడ్, రాజేష్, ఎస్ ఎల్ పద్మ, ప్రదీప్, డాక్టర్ ధర్మ తేజ, మల్లేష్, డాక్టర్ రామకృష్ణ, వి.వెంకటేష్, జానకి రెడ్డి, వెంకటయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement