త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SAS Group Pre pole survey | పీఠం నిలుపుకోనున్న స్టాలిన్‌, మ‌మ‌త‌, హిమంత‌

SAS Group Pre pole survey | త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నాలుగు రాష్ట్రాల్లో ఎస్ఏఎస్ గ్రూప్ (SAS Group) నిర్వ‌హించిన ప్రీ పోల్ స‌ర్వే(Pre pole survey) లో ఈ విష‌యం వెల్ల‌డైంది. త‌మిళ‌నాడు(Tamil Nadu), ప‌శ్చిమ‌బెంగాల్‌(West Bengal), అసోం(Assam)ల‌లో అధికారంలో ఉన్న పార్టీలు త‌మ ప‌ట్టును నిలుపుకోగా, కేర‌ళం(Keralam)లో మాత్రం అధికార ఎల్‌డీఎఫ్ (LDF) కూట‌మికి ఎదురుగాలి వీస్తోంది.

S

News | Published On Apr 7, 2026, 9.30 pm IST

SAS Group Pre pole survey | పీఠం నిలుపుకోనున్న స్టాలిన్‌, మ‌మ‌త‌, హిమంత‌
Advertisement
  • ఎస్ఏఎస్ గ్రూప్ నిర్వ‌హించిన ప్రీ పోల్ స‌ర్వేలో వెల్ల‌డి
  • త‌మిళ‌నాడులో 135 - 147 సీట్లు సాధించ‌నున్న డీఎంకే కూట‌మి
  • ప‌శ్చిమ బెంగాల్‌లో 171-188 సీట్ల‌తో ప‌ట్టు నిలుపుకున్న తృణ‌మూల్ కూట‌మి
  • అసోంలో 80-86 సీట్లు బీజేపీవే
  • 77 సీట్ల‌తో కేర‌ళంలో పాగా వేయ‌నున్న యూడీఎఫ్‌
  • ద‌క్షిణాదిలో బీజేపీకి చుక్కెదురు

త్రినేత్ర‌.న్యూస్‌: ద‌క్షిణాదిలో పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీకి మ‌రికొంత‌కాలం వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఎదురయ్యేలా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నాలుగు రాష్ట్రాల్లో ఎస్ఏఎస్ గ్రూప్ (SAS Group) నిర్వ‌హించిన ప్రీ పోల్ స‌ర్వే(Pre pole survey) లో ఈ విష‌యం వెల్ల‌డైంది. గ‌త నెల 28వ తేదీ నుంచి సోమ‌వారం వ‌ర‌కు ఆయా రాష్ట్రాల్లో స‌ర్వే నిర్వ‌హించి, ఎన్నిక‌ల్లో కీల‌కంగా నిలిచిన అంశాల‌ను సైతం విశ్లేషించింది. స‌ర్వే వివ‌రాల‌ను ఎస్ఏఎస్ గ్రూప్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. త‌మిళ‌నాడు(Tamil Nadu), ప‌శ్చిమ‌బెంగాల్‌(West Bengal), అసోం(Assam)ల‌లో అధికారంలో ఉన్న పార్టీలు త‌మ ప‌ట్టును నిలుపుకోగా, కేర‌ళం(Keralam)లో మాత్రం అధికార ఎల్‌డీఎఫ్ (LDF) కూట‌మికి ఎదురుగాలి వీస్తోంది.

త‌మిళ‌నాట మొత్తం 234 స్థానాల‌కు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే కూట‌మి 41 శాతం ఓట్ల‌తో 135-147 సీట్లు సాధించ‌నుంది. ప్ర‌తిప‌క్ష ఏఐఏడీఎంకే కూటమి 37 శాతం ఓట్లతో 92-111 సీట్లు పొంద‌నుంది. తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన సినీ హీరో విజ‌య్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 16 శాతం ఓట్ల‌తో 6-10 సీట్లకు ప‌రిమితం కానుంది.

ప‌శ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాల‌కు గాను అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ కూట‌మి 46.5 శాతం ఓట్ల‌తో 171-188 స్థానాల‌ను సాధించనుంది. దీంతో మ‌మ‌తా బెన‌ర్జీ బెంగాల్‌పై త‌న ప‌ట్టును మ‌రోమారు చాటుకున్నారు. ప్ర‌తిప‌క్ష బీజేపీ కూట‌మి 41.5 శాతం ఓట్ల‌తో 118-126 సీట్ల‌తో అధికార పీఠానికి దూరంగానే నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ 3.75 శాతం ఓట్ల‌తో 2-6 సీట్లు, సీపీఎం మూడు శాతం ఓట్ల‌తో 1-3 సీట్లు సాధించి తామున్నామ‌ని ప్ర‌జ‌ల‌కు గుర్తు చేస్తున్నాయి.

కేర‌ళంలో కేవ‌లం రెండు శాతం ఓట్ల తేడాతో ఎల్‌డీఎఫ్ కూటమి త‌న అధికారాన్ని కోల్పోనుంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల‌కు గాను ప్ర‌తిప‌క్ష యూడీఎఫ్ కూట‌మి 41.5 శాతం ఓట్ల‌తో 77 సీట్ల‌ను సాధించ‌నుండ‌గా, అధికార ఎల్‌డీఎఫ్ కూట‌మి 39.5 శాతం ఓట్ల‌తో 58 సీట్ల‌కే ప‌రిమితం కానుంది. బీజేపీ 15 శాతం ఓట్ల‌తో కేర‌ళం అసెంబ్లీలో తొలిసారిగా నాలుగు స్థానాలు సాధించ‌నుంది.

ఈశాన్య రాష్ట్ర‌మైన అసోంలో 126 అసెంబ్లీ స్థానాల‌కుగాను అధికార ఎన్డీఏ కూట‌మి 46.5 శాతం ఓట్ల‌తో 80-86 సీట్లు సాధించ‌నుంది. 43 శాతం ఓట్ల‌తో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ కూట‌మి 40-46 సీట్ల‌కు ప‌రిమితం కానుంది.

మ్యాట్రిజ్ స‌ర్వే సంస్థ ప్ర‌కారం ప‌శ్చిమ బెంగాల్‌, అసోంల‌లో అధికార టీఎంసీ, బీజేపీ త‌మ పీఠాన్ని నిలుపుకోగా, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో హోరాహోరీ ఉండ‌గా, ప్ర‌తిప‌క్ష ఎన్‌డీఏ, యూడీఎఫ్ కూట‌ముల వైపే స్వ‌ల్ప మొగ్గు క‌నిపిస్తోంది.

Advertisement
Advertisement