త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

2047 నాటికి తెలంగాణ‌ 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌: సీఎం రేవంత్‌రెడ్డి

Rising Telangana | తెలంగాణ‌ను 2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తీర్చిదిద్దుతామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2034 నాటికి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార్చేందుకు సంక‌ల్పించామ‌ని తెలిపారు. రాష్ట్రంలో అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని, దానికి మంచి సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని చెప్పారు.

A

News | Published On Dec 8, 2025, 5.45 pm IST

2047 నాటికి తెలంగాణ‌ 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌: సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

ప‌దేళ్ల‌లో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌యత్నిస్తున్నాం
2047 నాటికి మ‌నం ఏం సాధించ‌గ‌ల‌మో వివ‌రించేందుకే ఈ స‌మ్మిట్‌
దేశ జీడీపీలో మ‌న వాటా 5 శాతం నుంచి ప‌ది శాతం పెంచేందుకు కృషి
రాష్ట్రం క్యూర్‌, ప్యూర్‌, రేర్ మూడు భాగాలుగా విభ‌జ‌న‌
20 ఏళ్ల‌లో అత్య‌ధిక పెట్ట‌బడులు, అభివృద్ధి సాధించిన చైనాలోని గ్వాంగ్‌-డాంగ్ ప్రావిన్స్ న‌మూనా అనుస‌రిస్తాం
అంద‌రి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించేందుకు సిద్ధం
ఘ‌నంగా ప్రారంభ‌మైన తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌
హాజ‌రైన గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌, కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి, సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం, మంత్రులు

Rising Telangana | తెలంగాణ‌ను 2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తీర్చిదిద్దుతామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2034 నాటికి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార్చేందుకు సంక‌ల్పించామ‌ని తెలిపారు. రాష్ట్రంలో అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని, దానికి మంచి సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని చెప్పారు.

రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ సోమ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తు పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచ‌ర్ సిటీలో 100 ఎక‌రాలలో ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. రెండు రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ స‌ద‌స్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఈ స‌ద‌స్సును రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ప్రారంభించారు. దీనికి కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్, మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు, నోబెల్ బ‌హుమతి గ్ర‌హీత కైలాశ్ స‌త్యార్థి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అంత‌కుముందు స‌ద‌స్సు ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల‌ను ముఖ్య‌మంత్రి ప‌రిశీలించారు. అక్క‌డే ఏర్పాటు చేసిన తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భ‌విష్య‌త్తు కోసం ఒక స‌మ‌గ్ర రోడ్ మ్యాప్ రూపొందించాల‌నుకున్నామ‌ని చెప్పారు. వ‌చ్చే ప‌దేళ్ల‌లో తెలంగాణ‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరామ‌ని, ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్ - 2047 దార్శనికతకు బీజం పడిందని వివ‌రించారు. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, అంచ‌నాలు, అధికారులు, ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల స‌హాయం తీసుకుని విజ‌న్ రూపొందించుకున్నామ‌న్నారు. స‌ద‌స్సుకు అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌తినిధులు ఇక్క‌డ‌కు రావ‌డం మ‌న అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. అంద‌రి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు.

2047 నాటికి దేశ జీడీపీలో మ‌న వాటా ప‌ది శాతం ఉండాల‌న్న‌దే లక్ష్యం

దేశంలో తెలంగాణ జ‌నాభా దాదాపు 2.9 శాతం ఉంద‌ని, దేశ జీడీపీలో మ‌న వాటా అయిదు శాతంగా ఉంద‌ని పేర్కొన్నారు. 2047 నాటికి జీడీపీలో మ‌న వాటాను ప‌ది శాతానికి పెంచాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. తెలంగాణ‌ను సేవారంగం, త‌యారీరంగం, వ్య‌వ‌సాయ‌రంగంలుగా స్ప‌ష్ట‌మైన మూడు భాగాలుగా విభ‌జించామ‌ని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రాన్ని కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌), పెరి అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (ప్యూర్‌), రూర‌ల్ అగ్రికల్చ‌ర్ రీజియ‌న్ ఎకాన‌మీ (రేర్‌)గా విభ‌జించామ‌ని వివ‌రించారు.

గ్వాంగ్‌-డాంగ్ ప్రావిన్స్ న‌మూనాను అనుస‌రిస్తాం

చైనాలోని గ్వాంగ్‌-డాంగ్ ప్రావిన్స్ అభివృద్ధి న‌మూనాను అనుస‌రించాల‌ని భావిస్తున్నామ‌న్నారు. ఆ ప్రావిన్స్ 20 ఏళ్ల‌లో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక పెట్టుబ‌డులు, వృద్ధి రేటును సాధించింద‌ని గుర్తు చేశారు. ఈ ప్ర‌యాణంలో స‌హ‌క‌రించేందుకు, పెట్టుబ‌డి పెట్టేందుకు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ విజ‌న్ క‌ష్టంగా అనిపించిన‌ప్ప‌టికీ, సాధించ‌గ‌ల‌మ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అంద‌రి మ‌ద్ద‌తుతో తెలంగాణ రైజింగ్ ల‌క్ష్యాల‌ను సాధించ‌గ‌ల‌మ‌ని బ‌లంగా న‌మ్ముతున్నామ‌న్నారు. తెలంగాణ రైజింగ్ అనేది నిరంత‌ర ప్ర‌క్రియ అని స్ప‌ష్టం చేశారు.

విక‌సిత్ భార‌త్ 2047లో తెలంగాణ రైజింగ్ ఓ భాగం: గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌

తెలంగాణ రాష్ట్రం 2047 వ‌ర‌కు మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చేరుకుంటుంద‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ అన్నారు. ఆ దిశ‌గా రేవంత్ ప్ర‌భుత్వం విజ‌న్‌తో ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. విక‌సిత్ భార‌త్ 2047లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమ‌ని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్ర‌గ‌తి దేశానికే ఆద‌ర్శ‌మ‌న్నారు. ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ‌లో ఎన్నో మార్పులు తీసుకువ‌చ్చింద‌ని చెప్పారు.

హైద‌రాబాద్ భార‌త దేశ ఆర్థిక మూల‌స్తంభం: కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి

హైద‌రాబాద్ న‌గ‌రం కేవ‌లం రాష్ట్ర రాజ‌ధాని కాద‌ని, భార‌త దేశ ఆర్థిక మూల‌స్తంభంమ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. కేంద్రం ల‌క్ష్యం విక‌సిత్ భార‌త్ అన్న ఆయ‌న అందులో అన్ని రాష్ట్రాల పాత్రతోనే అది సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు. అందులో భాగంగానే జాతీర ర‌హ‌దారుల‌ను 65 శాతం పెంచామ‌ని, విమానాశ్ర‌యాల‌ను రెట్టింపు చేశామ‌ని, వెయ్యి కిలోమీట‌ర్ల మెట్రో నిర్మించామ‌ని, గ్రీన్ ఫీల్డ్ హైవేల‌ను అప్ గ్రేడ్ చేస్తున్నామ‌ని వివ‌రించారు.

విజ‌న్ వివ‌రించేందుకే స‌మ్మిట్‌: డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ను కేవ‌లం పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు నిర్వ‌హించ‌డం లేద‌ని, విజ‌న్ వివ‌రించేందుకు నిర్వ‌హిస్తున్నామ‌ని రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అనేక ల‌క్ష్యాల‌తో త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకురాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. విజ‌న్‌కు ప్ర‌తిప‌క్షాల‌తో స‌హా అంద‌రూ స‌హ‌కరించాల‌ని కోరారు.

భ‌విష్య‌త్తును నిర్మించాల‌న్న‌దే మా సంక‌ల్పం: మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

భ‌విష్య‌త్తు కోసం ఎదురు చూడ‌కుండా దానిని మ‌నం నిర్మించాల‌న్న‌దే త‌మ సంక‌ల్ప‌మ‌ని రాష్ట్ర మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు స్ప‌ష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మూడు ట్రిలియ‌న్ డాల‌ర్లుగా చేర్చేందుకు తొలి అడుగుగా ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. చాలా రంగాల్లో జాతీయ స‌గ‌టు కంటే రాష్ట్ర స‌గ‌టు ఎక్కువ‌గా ఉంద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన విప్ల‌వాత్మ‌క అడుగులు ప్ర‌పంచప‌టంలో తెలంగాణ‌ను ప్ర‌త్యేకంగా నిలుపుతాయ‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement