త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రైతుల భవిష్య‌త్ కావాల్నా.. ద‌ళారుల క‌మీష‌న్ కావాల్నా?: హ‌రీశ్‌రావు

Harish Rao | కోహెడ‌(Koheda)లో అంత‌ర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్‌(Froot market) ను నిర్మించాల్సిందేన‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతులు, కూలీల గురించి ఆలోచిస్త‌వా? న‌లుగురు ద‌ళారులకు మార్కెట్ భూములు అప్ప‌గిస్త‌వా అని ఫైర‌య్యారు. మీష‌న్ల కోసం రైతుల‌ను కూడా వ‌దిలిపెట్ట‌వా అని ప్ర‌శ్నించారు.

S

News | Published On Apr 6, 2026, 1.04 pm IST

Harish Rao | రైతుల భవిష్య‌త్ కావాల్నా.. ద‌ళారుల క‌మీష‌న్ కావాల్నా?: హ‌రీశ్‌రావు
Advertisement
  • కోహెడ ఫ్రూట్ మార్కెట్ స్థ‌లాన్ని అమ్మాల‌ని చూస్తున్న‌రు
  • ఈ భూముల విలువ‌ 3 వేల కోట్లు ఉంట‌ది
  • మేమేమో పూలు, చేప‌ల మార్కెట్ కోసమూ ఆలోచించాం
  • రేవంత్ క‌ళ్లు ఎప్పుడూ భూముల‌పైనే
  • గ‌తంలోనే మార్కెట్ యార్డును నోటిఫై కూడా ఇచ్చాం
  • రేవంత్‌, తుమ్మ‌ల క‌లిసి మార్కెట్‌ను నిర్మించాల్సిందే
  • మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్

త్రినేత్ర‌.న్యూస్‌: కోహెడ‌(Koheda)లో 200 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్‌(Froot market) ను నిర్మించాల్సిందేన‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతులు, కూలీల గురించి ఆలోచిస్త‌వా? న‌లుగురు ద‌ళారులకు మార్కెట్ భూములు అప్ప‌గిస్త‌వా అని ఫైర‌య్యారు. సోమ‌వారం కోహెడ‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో హ‌రీశ్‌రావు మాట్లాడారు. క‌మీష‌న్ల కోసం రైతుల‌ను కూడా వ‌దిలిపెట్ట‌వా అని ప్ర‌శ్నించారు. మార్కెట్ భూముల్లో థ‌ర్డ్ పార్టీ ప్ర‌మేయం ఉండొద్ద‌ని హైకోర్టు ఆర్డ‌ర్ ఉందన్నారు.

రూ.350 కోట్ల బ్యాంక్ అకౌంట్ లో వేశాం...

పార్టీల స‌మ‌స్య కాదు. ఇది రైతుల స‌మ‌స్య‌. 2020లో జీవో 11 ప్ర‌కారం మార్కెట్ యార్డును నోటిఫై కూడా చేశారు. ఆనాడు నేను మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు రైతుల‌కు 10 కోట్ల రూపాయ‌లు ప‌రిహారం ఇచ్చాం. చివ‌రికి మార్కెట్ యార్డు భూముల మీద కూడా సీఎం రేవంత్‌ దృష్టి ప‌డ్డ‌ది. మార్కెటింగ్ శాఖ మార్కెట్ యార్డు కోసం ఈ భూములు అప్ప‌గించింది. శంకుస్థాప‌న కూడా చేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వ‌ర్యంలో రూ. 350 కోట్లు నిధులు స‌మీక‌రించి బ్యాంక్ అకౌంట్ లో వేశాం. రూ.1000 కోట్ల‌తో మార్కెట్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. దాన్ని ముందుకు తీసుకుపోండి. రైతుల‌ను బాగు చేయండి. పంట మార్ప‌డి అని నువ్వే అంటున్న‌వ్ క‌దా రేవంత్‌.. కూర‌గాయ‌లు, పండ్లు పండించే రైతుల కోసం ఇంకా మంచి మార్కెట్ క‌ట్టాల్సింది పోయి, ఉన్న మార్కెట్ ను ఆగం చేస్త‌వా. అంత‌ర్జాతీయ ఎగుమ‌తులు చేసేలా రైతుల‌ను, అధికారుల‌ను ప్రోత్స‌హించాలే కానీ ఇదేం ప‌ద్ధ‌తి. హైకోర్టు కేసుల‌ల్ల ఇరికిచ్చి మార్కెట్ ముందుకు వోకుండా జేసే కుట్ర జ‌రుగుతుంది.

దిల్ భూముల్లోకి వెళ్లొద్ద‌ని హైకోర్టు ఆదేశాలున్న‌య్‌..

భ‌విష్య‌త్‌లో ఇక్కడే పూల‌ మార్కెట్, చేప‌ల‌ మార్కెట్ రావాలని తీర్చిదిద్దాం. 100 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ కు రూపకల్పన చేశాం. డబ్బులున్న‌య్‌, భూములున్న‌య్‌, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సాగ‌నిస్త‌లేదు. భూమిని అమ్మాలని చూస్తున్నది. ఈ భూమి దాదాపు 3 వేల కోట్ల విలువ ఉంది. ఈ భూమిని TGIIC కి ఇచ్చి తమ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నది. ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దిల్ భూముల్లో మార్కెట్ కట్టిస్తాం అంటున్నారు. ఆ దిల్ భూముల జోలికి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వాల్వ్ ఉంది. ఎస్సీ రైతులు పంట పండిస్తున్నారు. అలాంటి భూమి ప్రత్యామ్నాయంగా ఇస్తామంటే ఎలా నమ్మాలి? అని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించారు.

ల‌క్ష‌ల మంది రైతుల‌ భవిష్య‌త్‌..

గ‌డ్డి అన్నారం, మ‌హేశ్వ‌రంలో కొన్ని వేల మంది జీవిస్తున్నారు. హ‌మాలీలు, రిటైల‌ర్స్, ప్యాకింగ్ వాళ్లు ఇలా ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా వేల మందికి జీవ‌నాధారం ఉంట‌ది. ల‌క్ష‌ల మంది రైతుల భ‌విష్య‌త్తు దీనిపై ఆధార‌ప‌డి ఉంట‌ది. స‌బిత‌క్క‌, మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి చాలా రోజుల నుంచి అంటున్న‌రు. ఈ భూములు ద‌ళారుల పాల‌వుతున్న‌ది. కాపాడాలే అని. ఇక్క‌డే అంత‌ర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ వ‌చ్చే దాకా రైతుల ప‌క్షాన బీఆర్ఎస్ నిల‌బ‌డ‌త‌ది. ఇందులో వ్య‌క్తిగ‌తంగా, రాజ‌కీయ విభేదాల్లేవు. ఆనాడు కేసీఆర్ దూర‌దృష్టితో ఆలోచించి మార్కెట్ ఆలోచ‌న చేశారు. దాని కోస‌మే ముందుకు వెళ్తాం. నిజంగా మార్కెట్ వ‌స్తే చుట్టు ప‌క్క‌ల ఎంతో అభివృద్ధి జ‌రుగుత‌ది అని హ‌రీశ్‌రావు అన్నారు.

రాందాస్‌ప‌ల్లి స‌ర్వే నం. 41లో 1200 ఎక‌రాలు ప్రాహిబిషన్ కింద పెట్టిండ్రు. త‌ర్వాత సెటిల్‌మెంట్ చేసుడు. బీఆర్ఎస్ ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో అనేక భూముల‌ను ప్రాహిబిష‌న్‌లో పెట్టిందని అన్న‌రు. కాంగ్రెస్ వ‌స్తే అవ‌న్ని తీసేస్త‌మ‌న్న‌రు. కానీ ఇవాళ కోటి ఎక‌రాలు ప్రాహిబిష‌న్ లో పెట్టారు. త‌క్ష‌ణ‌మే ఆ లిస్టులోంచి భూముల‌న్నీ తీసేయాలే. ప‌క్క‌నే వెంక‌టేశ్వ‌ర అభిషేక ఆనంద నిల‌యం కోసం 12 ఎక‌రాల క‌బ్జా పెట్టార‌ని నా దృష్టికి వ‌చ్చింది. దేవుని పేరు చెప్పి కూడా వ‌సూళ్లు చేస్తే దేవుడు ఊకుంట‌డా? త‌గిన శాస్తి చేసి తీరుతడు. రాజ‌కీయాలు, బేష‌జాలు వద్దు. వ్య‌వ‌సాయ మంత్రి తుమ్మ‌ల రైతు ప‌క్ష‌పాతి. రైతుల కోసం ఆలోచించాలి అని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

భూముల చుట్టూ రేవంత్ ప్ర‌ద‌క్షిణ‌: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఈ ప్రాంతంలో పెద్ద మార్కెట్ వస్తుందని రెండు మూడు రకాలుగా కేసీఆర్ ఆలోచన చేశారు. ఫ్రూట్ మార్కెట్ కు కేటాయించిన భూములను రేవంత్ రెడ్డి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న‌డు. ఇక్కడున్న మార్కెట్ ను ఎక్కడో గుట్టల్లో పెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైంది. నాదర్ గుల్, కోహెడ భూముల పై ప్రభుత్వం కన్నేసి మొత్తం 10 వేల కోట్ల రూపాయలను దండుకోవాలని చూస్తున్నారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్న‌డు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రెండేళ్లు పాటు ఈ కోహెడ మార్కెట్ స్థలాన్ని కాపాడుకుందాం. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మార్కెట్ ను అభివృద్ధి చేసుకుందాం.

 

Advertisement
Advertisement