త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BC Reservations | బీసీ రిజర్వేషన్ల పెంపుకు తెలంగాణ ఉద్యమం తరహాలోనే ముందుకు: ఎంపీ వద్దిరాజు ర‌విచంద్ర‌

BC Reservations | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బీసీ రిజ‌ర్వేష‌న్ల (BC Reservations) పెంపున‌కు బీసీలంతా సంఘ‌టితంగా తెలంగాణ ఉద్య‌మం త‌ర‌హాలోనే ముందుకు సాగాల‌ని బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్ల‌మెంట్‌ (Parliament)లో ప్రైవేట్ మెంబర్ బిల్లు (Private Member Bill) కూడా ప్రవేశపెట్టామ‌ని తెలిపారు.

A

News | Published On Dec 15, 2025, 7.22 pm IST

BC Reservations | బీసీ రిజర్వేషన్ల పెంపుకు తెలంగాణ ఉద్యమం తరహాలోనే ముందుకు: ఎంపీ వద్దిరాజు ర‌విచంద్ర‌
Advertisement

BC Reservations | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బీసీ రిజ‌ర్వేష‌న్ల (BC Reservations) పెంపున‌కు బీసీలంతా సంఘ‌టితంగా తెలంగాణ ఉద్య‌మం త‌ర‌హాలోనే ముందుకు సాగాల‌ని బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని తమ పార్టీ గట్టిగా పోరాడుతున్నదని, ఇందుకోసం పార్ల‌మెంట్‌ (Parliament)లో ప్రైవేట్ మెంబర్ బిల్లు (Private Member Bill) కూడా ప్రవేశపెట్టామ‌ని తెలిపారు. అన్ని రంగాలలో వెనుకబడిన బీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) తన పదేళ్ల పాలనలో చిత్తశుద్ధితో కృషి చేశారని చెప్పారు. త‌మ పార్టీ బీసీ రిజర్వేషన్ల‌ పెంపుదలకు కట్టుబడి ఉంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే 2014 జూన్ 14వ తేదీన చట్టసభల్లో మహిళలు, ఓబీసీలకు 33 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేశార‌ని గుర్తు చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ జేఏసీల ఆధ్వర్యంలో ఢిల్లీ (Delhi) లోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని సోమ‌వారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తదితరులు హాజ‌రై సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ నాయకత్వాన జరిగిన మహోద్యమం మాదిరిగానే బీసీల న్యాయమైన హక్కులు, రాజ్యాధికారంలో సముచితమైన వాటా కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. కులగణనలో బీసీల జనాభాను తక్కువ చేసి చూప‌డాన్ని వ్య‌తిరేకిస్తూ, కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన 42 శాతం రిజ‌ర్వేష‌న్లు, ఇతర 56 అంశాలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ తమ పార్టీ ఉద్యమించిందని వివ‌రించారు. దీనిని మరింత ఉధృతం చేయడంలో భాగంగానే కేసీఆర్ మార్గనిర్దేశనంలో పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టామ‌ని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన 432 హామీలను నెరవేర్చకుండా "డైవర్షన్ పాలిటిక్స్"కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తమ పార్టీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అటు కేంద్రంలోని బీజేపీ పాలకులు మద్దతు ప్రకటించడం అనివార్యమని అన్నారు. లేనిపక్షంలో వారు ద్రోహులుగా మిగిలిపోక తప్పదని హెచ్చ‌రించారు. కాంగ్రెస్ అధినేత రాహూల్ గాంధీకి "ఓట్ చోర్"అంశంపై ఉన్న ఆసక్తి బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో ఇసుమంత కూడా చూపకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తల్చుకుంటే బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో సునాయ‌సంగా ఆమోదం పొందుతుంద‌న్నారు. ఆ పార్టీలకు బీసీలంటే చులకన భావం ఉన్నందునే తాము అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వారి అధిష్టానాల‌పై ఒత్తిడి పెంచి, బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరారు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు రాజ్యాధికారంలో తమకు న్యాయమైన వాటా దక్కడం లేదన్న కడుపు మంటతో ఉన్నారని, కోపంతో రగిలిపోతున్నారని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో 42%, చట్టసభల్లో మహిళలతో పాటు 33 శాతం చొప్పున రిజర్వేషన్ల‌ అమలుకు కాంగ్రెస్, బీజేపీలు ముందుకు రానట్ల‌యితే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని, మాడిమసైపోవడం ఖాయమని హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement