త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Elections | అసెంబ్లీ ఎన్నిక‌లు.. త‌మిళ‌నాడులో 234 సీట్లు, బెంగాల్‌లో 154 స్థానాల్లో పోలింగ్‌..

Assembly Elections | త‌మిళ‌నాడు (Tamil Nadu) , ప‌శ్చిమ‌బెంగాల్‌లో (West Bengal) అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ (Assembly Elections) ప్రారంభ‌మైంది. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌నుంది. త‌మిళ‌నాడులోని మొత్తం 234 సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా, బెంగాల్‌లో మొద‌టి ద‌శలో (First Phase) భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ జ‌రుగుతున్న‌ది.

G

National | Published On Apr 23, 2026, 7.10 am IST

Assembly Elections | అసెంబ్లీ ఎన్నిక‌లు.. త‌మిళ‌నాడులో 234 సీట్లు, బెంగాల్‌లో 154 స్థానాల్లో పోలింగ్‌..
Advertisement

Assembly Elections | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ‌నాడు (Tamil Nadu) , ప‌శ్చిమ‌బెంగాల్‌లో (West Bengal) అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ (Assembly Elections) ప్రారంభ‌మైంది. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌నుంది. త‌మిళ‌నాడులోని మొత్తం 234 సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా, బెంగాల్‌లో మొద‌టి ద‌శలో (First Phase) భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ జ‌రుగుతున్న‌ది. వీటి ఫ‌లితాలు మే 4న వెలువ‌డుతాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని విప‌క్షాల‌తో గ‌ట్టిగా పోరాడుతున్నాయి.

త‌మిళ‌నాడులో..

సీఎం స్టాలిన్ (MK Stalin) వరుసగా రెండోసారి విజయం దక్కించుకోవాలని చూస్తుండ‌గా, దూరమైన అధికారాన్ని బీజేపీ (BJP) అండ‌తో తిరిగి హస్తగతం చేసుకోవాల‌ని అన్నాడీఎంకే పోరాడుతున్న‌ది. మ‌రోవైపు పోటీచేస్తున్న మొద‌టిసారే సత్తా చాటాలని సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్‌ తహతహలాడుతున్నాడు. అయితే ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే పోటీ ఉన్న‌ది. ప్ర‌ధాన పార్టీల గెలుపు ఓట‌ముల‌పై విజ‌య్ ప్ర‌భావం చూపుతాడ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో ఒకే విడతలో పోలింగ్ జ‌రుగుతున్న‌ది. 4,023 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌గా, మొత్తం 5.73 కోట్ల మంది త‌మ ఓటు హ‌క్కు వినియోగిచుకోనున్నారు. వీరిలో 2.93 కోట్ల మంది మ‌హిళా ఓట‌ర్లు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 14.59 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు. మొత్తం 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 3,60,068 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. అద‌నంగా 300 పారామిలిట‌రీ ద‌ళాలు, 83,800కు పైగా పోలీసు సిబ్బంది ఎన్నిక‌ల విధుల్లో పాల్గొంటున్నారు.

కాగా, డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి 40.1 శాతం ఓట్లతో 181 నుంచి 189 స్థానాలు గెల్చుకోనున్నట్లు సర్వేల్లో తేలింది. అన్నాడీఎంకే–బీజేపీ కూటమి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లు, విజయ్‌ పార్టీ 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశాయి.

దీదీని మోదీ అడ్డుకుంటారా..

గ‌త ఎన్నిక‌ల్లో అనూహ్యంగా బ‌లం పెంచుకున్న బీజేపీ.. ఈసారి ఎలాగైనా దీదీని (Mamata Banerjee) అధికారానికి దూరం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ది. మోదీపై (PM Modi) విజ‌యం సాధించి వ‌రుస‌గా మూడోసారి అధికారం చేప‌ట్టాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ త‌న స‌ర్వ‌శ‌క్తుల‌ను ఒడ్డుతున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం తొలి దశ పోలింగ్‌ జరగనుంది. మొత్తం 294 స్థానాలకు గాను 152 సీట్లకు ప్ర‌స్తుతం ఎన్నిక జ‌రుగుతున్న‌ది. 16 జిల్లాల్లో మొత్తం 3,60,77,171 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,84,99,496 మంది పురుషులు, 1,75,77,210 మంది మ‌హిళ‌లు, 465 మంది ట్రాన్స్ జెండ‌ర్లు ఉన్నారు. ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న 1,478 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని వీరు తేల్చనున్నారు.

ఎన్నిక‌లు జ‌రిగే జిల్లాలు..

డార్జిలింగ్‌, జ‌ల్పాయిగురి, కూచ్ బేహార్‌, జంగ‌ల్ మ‌హ‌ల్‌, పురులియా, బాంకురా, ప‌శ్చిమ మేదినిపూర్‌, బీర్బూమ్‌, ముర్షిదాబాద్‌

స‌ర్ ప్ర‌భావం..

బెంగాల్ ఎన్నిక‌ల్లో అత్యంత ప్ర‌భావం చూపే అంశం ఏదైనా ఉందంటే అది స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR). దీనికారణంగా 91 లక్షలకు పైగా పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ఇవి సుమారు 12 శాతం. ఒక్క ముర్షిదాబాద్‌ జిల్లాలోనే 7.48 లక్షల ఓట్ల‌ను తొల‌గించారు. నడియాలో 4.85 లక్షలు, మాల్దా 4.59 లక్షలు, ఉత్తర్‌ దినాజ్‌పూర్ 3.63 లక్షలు, కూచ్‌ బెహార్ 2.42లక్షలకు పైగా ఓట్లను తొల‌గించారు. ప్ర‌స్తుతం ఇదే అంశం ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాన అస్త్రంగా మారింది.

Advertisement
Advertisement