త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat Sleeper | వందే భారత్‌ స్లీపర్‌ అప్‌గ్రేడ్‌.. ఇక 24 బోగీలతో పరుగులు..!

Vande Bharat Sleeper | దూరప్రాంత రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా భారతీయ రైల్వే మరో కీలక అడుగు వేస్తోంది. రాత్రివేళ, సుదూర మార్గాల్లో ప్రయాణించే వారి కోసం అదనపు వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) 24 బోగీలతో కూడిన 50 కొత్త వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను తయారు చేయనుంది.

P

National | Published On Aug 23, 2026, 9.01 am IST

Vande Bharat Sleeper | వందే భారత్‌ స్లీపర్‌ అప్‌గ్రేడ్‌.. ఇక 24 బోగీలతో పరుగులు..!
Advertisement

Vande Bharat Sleeper | దూరప్రాంత రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా భారతీయ రైల్వే మరో కీలక అడుగు వేస్తోంది. రాత్రివేళ, సుదూర మార్గాల్లో ప్రయాణించే వారి కోసం అదనపు వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) 24 బోగీలతో కూడిన 50 కొత్త వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను తయారు చేయనుంది. ప్రస్తుతం నడుస్తున్న 16 బోగీల వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లతో పోలిస్తే.. కొత్త రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానంగా పగటి ప్రయాణాలకు అనువైన చైర్‌కార్‌ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా సుదూర ప్రయాణాల కోసం వందే భారత్‌లో స్లీపర్‌ సౌకర్యం కల్పించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

ఒకటిన్నర రెట్లు ఎక్కువ మంది ప్రయాణించే ఛాన్స్‌..

ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణించే వారు స్లీపర్‌ బెర్తుల సౌకర్యంతో కూడిన హైస్పీడ్‌ రైళ్లు అందుబాటులోకి మరిన్ని అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 24 బోగీలతో కొత్త స్లీపర్‌ రైళ్లను తయారు చేయాలని రైల్వే నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 16 బోగీల రైళ్లతో పోలిస్తే ఒక్కో కొత్త రైలులో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీంతో ఒకే రైలు ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుంది. రైల్వే అధికారుల ప్రకారం.. 24 బోగీల కొత్త రైళ్లకు సంబంధించిన ఉత్పత్తి డిజైన్లను ఇప్పటికే ఖరారయ్యాయి. బోగీల నిర్మాణం, ఒక బోగీని మరో బోగీతో అనుసంధానించే వ్యవస్థ, బోగీల కింద ఏర్పాటు చేసే పరికరాలకు సంబంధించిన వివరాలు ఈ డిజైన్లలో పొందుపరిచారు.

ఎలా ఉండొచ్చు..?

కొత్త 24 బోగీల వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల తుది కూర్పును రైల్వే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒక్కో రైలులో 17 ఏసీ 3-టైర్‌ బోగీలు, 5 ఏసీ 2-టైర్‌ బోగీలు, ఒక ఏసీ ఫస్ట్‌క్లాస్‌ బోగీ, ఒక ప్యాంట్రీ కార్‌ ఉండే అవకాశం ఉంది. తుది కూర్పులో మార్పులు ఉండొచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా ఖరారయ్యే కూర్పు ఆధారంగానే ఒక్కో రైలులో అందుబాటులో ఉండే బెర్తుల సంఖ్య విషయంలో క్లారిటీ రానుంది. ప్రస్తుతం వందే భారత్‌ స్లీపర్‌ సేవలు పరిమితంగానే ఉన్నాయి. హౌరా–కామాఖ్య మార్గంలో 16 బోగీలతో స్లీపర్‌ వందే భారత్‌ నడుస్తోంది. ఈ రైలులో 11 ఏసీ 3-టైర్‌, 4 ఏసీ 2-టైర్‌, ఒక ఏసీ ఫస్ట్‌క్లాస్‌ బోగీ ఉన్నాయి. హౌరా నుంచి పశ్చిమ బెంగాల్‌, అసోం ప్రాంతాలను కలుపుతూ సాగే ఈ మార్గం తూర్పు భారతదేశంలో కీలకమైన రైలు మార్గాల్లో ఒకటి. సుదూర ప్రయాణికులకు రాత్రి వేళల్లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో వందే భారత్‌ స్లీపర్‌ వెర్షన్‌ను ప్రవేశపెట్టారు. ఇక 24 బోగీల కొత్త రైళ్ల తయారీ పూర్తయి అందుబాటులోకి వస్తే.. మరిన్ని సుదూర మార్గాల్లో వందే భారత్‌ స్లీపర్‌ సేవలను ప్రవేశపెట్టేందుకు రైల్వేకు అవకాశం లభిస్తుంది. ప్రధాన నగరాల మధ్య రాత్రి ప్రయాణాలకు వీటిని కేటాయించే అవకాశాలున్నాయి.

సుదూర ప్రయాణాలపై దృష్టి

వందే భారత్‌ రైళ్లకు ఇప్పటివరకు ప్రధానంగా పగటి ప్రయాణాలు, మధ్యస్థ దూర మార్గాలే కీలకంగా ఉన్నాయి. స్లీపర్‌ రైళ్లతో ఈ సేవల పరిధి మరింత విస్తరించే అవకాశం ఉంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల మధ్య సుదూర రైలు ప్రయాణాలకు స్లీపర్‌ వందే భారత్‌ ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే, ఏయే మార్గాల్లో కొత్త రైళ్లను ప్రవేశపెడతారన్నది రైల్వే అధికారిక నిర్ణయం తర్వాతే స్పష్టమవుతుంది. రాత్రి బయలుదేరి ఉదయానికి గమ్యస్థానానికి చేరుకునే మార్గాల్లో వీటిని నడిపితే.. ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు వేగవంతమైన రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుంది.

అమృత్‌ భారత్‌ 3.0పైనా కసరత్తు

వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లతో పాటు తర్వాతి తరం అమృత్‌ భారత్‌ 3.0 రైళ్లపైనా ఐసీఎఫ్‌ ఉత్పత్తి ప్రణాళికలు కొనసాగిస్తోంది. వీటిలో ఏసీ, జనరల్‌, స్లీపర్‌ క్లాస్‌ బోగీలు ఉండే అవకాశం ఉంది. వివిధ ఆదాయ వర్గాలకు చెందిన ప్రయాణికులకు అందుబాటు ధరల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ రైళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు ప్రధానంగా ప్రీమియం సుదూర ప్రయాణ సేవలపై దృష్టి పెడితే.. అమృత్‌ భారత్‌ 3.0 విస్తృత ప్రయాణికుల వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించనున్నట్లు సమాచారం. దేశంలో రైలు ప్రయాణానికి డిమాండ్‌ నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో.. వేగం, సౌకర్యం, ప్రయాణికుల సామర్థ్యాన్ని సమన్వయం చేసే కొత్త తరం రైళ్లపై రైల్వే దృష్టి సారిస్తోంది.

Advertisement
Advertisement