త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madras High Court | కూలాల‌క‌తీతంగా ఓటేయ‌గ‌ల‌మ‌ని త‌మిళ‌ ప్ర‌జ‌లు నిరూపించారు : మద్రాస్ హైకోర్టు

Madras High Court | అభ్యర్థుల కులం, వర్గాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రజలు ఓటు వేయగలరని ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.

P

National | Published On Jun 12, 2026, 4.26 pm IST

Madras High Court | కూలాల‌క‌తీతంగా ఓటేయ‌గ‌ల‌మ‌ని త‌మిళ‌ ప్ర‌జ‌లు నిరూపించారు : మద్రాస్ హైకోర్టు
Advertisement

Madras High Court | అభ్యర్థుల కులం, వర్గాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రజలు ఓటు వేయగలరని ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. తిరునెల్వేలిలో జ‌రిగిన పరువు హత్య (హానర్ కిల్లింగ్) కేసులో ప్రధాన నిందితుడి తండ్రి, సబ్‌ఇన్‌స్పెక్టర్ శరవణన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ మదురై బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ బీ పుగళేంది ఈ వ్యాఖ్యలు చేశారు. ద‌ళిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన క‌విన్ సెల్వ‌గ‌ణేశ్ అనే యువ‌కుడు హ‌త్య‌కు గుర‌య్యాడు. మ‌రో కులానికి చెందిన యువ‌తితో ప్రేమించాడంటూ క‌విన్‌ను సుర్జిత్ అనే వ్య‌క్తి దారుణంగా హ‌త్య చేశాడు. ఈ కేసులో సుర్జిత్ తండ్రి సబ్ ఇన్‌స్పెక్టర్ అయిన శరవణన్ సైతం ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో శ‌ర‌వ‌ణ‌న్ పాత్ర‌పై విచార‌ణ జ‌రుగుతోంది.

అయితే, కేసు విచార‌ణ సంద‌ర్భంగా జస్టిస్ పుగళేంది మాట్లాడుతూ కుల వివక్ష సమాజంలో లోతుగా పాతుకుపోయిందని, అది మొత్తం వ్యవస్థనే దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప‌రువు హ‌త్య‌లు అనేవి కులవివక్షకు అత్యంత దారుణ రూపమని పేర్కొన్నారు. గత పదేళ్లలో తమిళనాడులో 59 హానర్ కిల్లింగ్ ఘటనలు నమోదైనట్లు కోర్టు గుర్తుచేసింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కుల ప్రభావాన్ని గణనీయంగా అధిగమిస్తూ ప్రభుత్వం ఏర్పడిందని కోర్టు పేర్కొంది. అయితే, ప్రజల మనస్తత్వంలో మార్పు వచ్చినప్పుడే దాన్ని నిజమైన సామాజిక మార్పుగా భావించవచ్చని తెలిపింది. కుల భావజాలాన్ని ప్రజల మనసుల నుంచి తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది.

ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో కుల వివక్షను ఎదుర్కొంటున్నారని, న్యాయమూర్తులు కూడా అందుకు మినహాయింపు కాదని జస్టిస్ పుగళేంది వ్యాఖ్యానించారు. కేసులను పూర్తిగా చట్టపరమైన అంశాలు, ఆధారాల ఆధారంగా విచారించినప్పటికీ తీర్పులను కూడా కుల కోణంలోనే కొందరు చూస్తున్నారన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ నాయకులైన కామరాజ్, ముత్తురామలింగ థేవర్, వీవో చిదంబరం వంటి వారు చేసిన సేవ‌లు, కృషిని మ‌రిచి కులం కోణంలోనే చూస్తున్నార‌ని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, ఆ మార్పు తీసుకురావడంలో ప్రభుత్వమే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొంది.

కులాల ఆధారంగా ఓటు బ్యాంకును సమీకరించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయని, తద్వారా ఈ సామాజిక రుగ్మతను మరింత ప్రోత్సహిస్తున్నాయని కోర్టు విమర్శించింది. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో కుల భావజాలం మరింత బలంగా ఉందని కోర్టు పేర్కొంది. పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణల అనంతరం మాజీ న్యాయమూర్తి కే చంద్రు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సిఫార్సులు పూర్తిస్థాయిలో అమలుకాలేదని గుర్తుచేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం వంటి చట్టాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయని పేర్కొంది.

చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించేలా పాఠశాల స్థాయిలో సంస్కరణలు చేపట్టాలని సూచించింది. హానర్ కిల్లింగ్స్‌లో ఎలాంటి గౌరవం లేదని, అవి సమాజానికి మచ్చతెచ్చే చర్యలని కోర్టు స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి శ‌రవణన్ నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడ‌ని నిర్ధారించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలు సరిపోవడం లేదని కోర్టు పేర్కొంది. ఇప్ప‌టికే ప‌ది నెల‌లు జైలులో ఉన్నార‌ని.. దర్యాప్తు పూర్తయిందని, ఆయనపై ఉన్న కేసు రద్దు పిటిషన్ విచారణలో ఉండటంతో తదుపరి చర్యలు నిలిపివేసిన‌ట్లుగా పేర్కొంది. ఈ క్ర‌మంలో రూ.ల‌క్ష వ్య‌క్తిగ‌త పూచీక‌త్తు, ఇద్ద‌రు ష్యూరిటీల‌తో శ‌ర‌వ‌ణ‌న్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement
Advertisement