త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suvendu Adhikari | బెంగాల్‌లో బీజేపీ నేత సువేందు అధికారి పీఏ దారుణ హ‌త్య‌.. అభిషేక్ బెన‌ర్జీ ప‌నేనా?

Suvendu Adhikari | ప‌శ్చిమ బెంగాల్‌లో (West Bengal) హ‌త్యా రాజ‌కీయాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. ఉత్త‌ర 24 ప‌ర‌గ‌ణాల జిల్లా మ‌ధ్యంగ్రామ్ ప్రాంతంలో బీజేపీ అగ్ర‌నేత సువేందు అధికారి (Suvendu Adhikari) వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు (పీఏ) చంద్ర‌నాథ్ ర‌థ్ (Chandranath Rath) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు.

G

National | Published On May 7, 2026, 7.33 am IST

Suvendu Adhikari | బెంగాల్‌లో బీజేపీ నేత సువేందు అధికారి పీఏ దారుణ హ‌త్య‌.. అభిషేక్ బెన‌ర్జీ ప‌నేనా?
Advertisement

Suvendu Adhikari | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో (West Bengal) హ‌త్యా రాజ‌కీయాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. ఉత్త‌ర 24 ప‌ర‌గ‌ణాల జిల్లా మ‌ధ్యంగ్రామ్ ప్రాంతంలో బీజేపీ అగ్ర‌నేత సువేందు అధికారి (Suvendu Adhikari) వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు (పీఏ) చంద్ర‌నాథ్ ర‌థ్ (Chandranath Rath) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. దోహారియా ప్రాంతంలో రాత్రి చంద్ర‌నాథ్ కారులో ఉండ‌గా.. బైక్‌పై వ‌చ్చిన ముగ్గురు దుండ‌గులు.. డోర్ గ్లాస్ పైనుంచే మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డిన చంద్ర‌నాథ్‌ని స్థానికులు ఓ ప్రైవేటు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ర‌థ్ మ‌ర‌ణించిన‌ట్లు ధృవీక‌రించారు. ప్ర‌స్తుతం కారు డ్రైవ‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు వెళ్ల‌డించారు. దీంతో బెంగాల్‌లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించిన త‌ర్వాత టీఎంసీ, క‌మ‌లం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై వ‌రుగా దాడులు జ‌రుగుతున్నాయి. మంగ‌ళ‌వారం రాత్రి కోల్‌క‌తాలో ఏకంగా జేసీబీల‌తో టీఎంసీ కార్యాల‌యాన్ని బీజేపీ జెండాలు ఉన్న వ్య‌క్తులు కూల్చివేశారు. తాజాగా రాష్ట్ర త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా ముందు వ‌రుస‌లో సువేందు అధికారి పీఏ హ‌త్య‌కు గుర‌వ‌డం విశేషం. కాగా, విషయం తెలుసుకున్న పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రథ్ హత్య ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన సువేందు అధికారి.. మ‌మ‌తా బెన‌ర్జీ అల్లుడు, ఎంపీ అభిషేక్ బెన‌ర్జీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. హ‌త్య వెనుక అత‌ని ప్ర‌మేయం ఉంద‌న్నారు. ప‌క్కా ప్లాన్‌తోనే త‌న పీఏను హ‌త్య చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

టీఎంసీ కూడా ర‌థ్ హ‌త్య‌ను ఖండించింది. ప్ర‌జాస్వామ్యంలో హింస‌కు తావులేద‌ని స్ప‌ష్టం చేసింది. ఆ హ‌త్య‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని తెలిపింది. దోషులెవ‌రైనా క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేసింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా హింస జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌ని తెలిపింది. చంద్ర‌నాథ్ హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ జర‌పాల‌ని డిమాండ్ చేసింది.

మ‌రోవైపు బెంగాల్‌లో హింస చెల‌రేగ‌డంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా వ‌రుస‌గా దాడులు, హ‌త్య‌లు జ‌ర‌గ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించింది. బెంగాల్ పోలీసు శాఖ‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. శాంతి భ‌ద్ర‌త‌లు అతుపు త‌ప్ప‌కుండా చూడాల‌ని ఆదేశించింది. ఘ‌ట‌న‌ల‌పై నివేదిక ఇవ్వాల‌ని బెంగాల్ డీజీపీకి ఆదేశాలు జారీచేసింది.

Advertisement
Advertisement