త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament Budget Session 2026 | ఎల్పీజీ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన.. కేంద్రమంత్రిపై రాహుల్ ‘ఎప్‌స్టీన్’ సెటైర్

దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ (LPG) గ్యాస్ సంక్షోభంపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 'ఎప్‌స్టీన్' (Epstein) వ్యాఖ్యలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. మరోవైపు బిహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

J

National | Published On Mar 12, 2026, 5.09 pm IST

Parliament Budget Session 2026 | ఎల్పీజీ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన.. కేంద్రమంత్రిపై రాహుల్ ‘ఎప్‌స్టీన్’ సెటైర్
Advertisement

Parliament Budget Session 2026 |  త్రినేత్ర.న్యూస్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో (2026) ఎల్పీజీ (LPG) గ్యాస్ సంక్షోభంపై వాడీవేడి చర్చ జరిగింది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిపై చేసిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్' వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

స్పీకర్ సీటులో మళ్లీ ఓం బిర్లా.. వీగిన అవిశ్వాసం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం వీగిపోయిన విషయం తెలిసిందే. వాయిస్ వోట్ ద్వారా ఈ తీర్మానాన్ని తిరస్కరించిన అనంతరం గురువారం ఓం బిర్లా తిరిగి సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. సభను తాను ఎప్పుడూ ఎలాంటి పక్షపాతం లేకుండా నడిపించానని స్పష్టం చేస్తూ.. ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

సభలో ఎల్పీజీ మంటలు.. కేంద్ర మంత్రికి ప్రతిపక్షాల సెగ

దేశంలో డీజిల్, పెట్రోల్ లేదా కిరోసిన్ కొరత ఏమీ లేదని కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి లోక్‌సభలో స్పష్టం చేశారు. సప్లై చైన్ అంతా సాఫీగా సాగుతోందని ఆయన తెలపగా.. ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఉందని రాహుల్ గాంధీ సభ దృష్టికి తీసుకువచ్చారు.

రాహుల్ 'ఎప్‌స్టీన్' సెటైర్.. ప్లేట్లతో టీఎంసీ ఎంపీల నిరసన

కేంద్ర మంత్రి హర్‌దీప్ పూరి మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు 'ఎప్‌స్టీన్, ఎప్‌స్టీన్' (Epstein) అంటూ నినాదాలు చేశారు. ఏకంగా రాహుల్ గాంధీ సైతం మంత్రిని ఉద్దేశించి 'ఎప్‌స్టీన్ ఫైల్స్' అని సెటైర్ వేయడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు మహువా మోయిత్రా, సాయనీ ఘోష్, ప్రతిమా మండల్ తదితరులు తమ వెంట తెచ్చిన వంటపాత్రలు, ప్లేట్లు, ఫ్రైయింగ్ ప్యాన్‌లు, గరిటెలు మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, దేశం ఐక్యంగా ఉండాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు.

ప్రధాని మాటలు క్షేత్రస్థాయిలో లేవు: ప్రియాంక గాంధీ

ఎల్పీజీ కొరతపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన భరోసా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. "ప్రధాని మాటలు నిజమే కావాలని నేను ఆశిస్తున్నాను.. కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎల్పీజీ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు" అని ఆమె విమర్శించారు.

ఫరూక్ అబ్దుల్లాను చంపేయాలని చూస్తున్నారా?: మల్లికార్జున ఖర్గే

జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై భగ్నమైన దాడి కుట్ర గురించి రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించిన ఆయన.. కశ్మీర్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. కేంద్రం భద్రత కల్పించలేకపోతే, వెంటనే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, శాంతిభద్రతల నిర్వహణను స్థానిక ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

రాజ్యసభకు నితీష్ కుమార్.. సీఎం పదవికి రాజీనామా?

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ భవితవ్యంపై కీలక వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 16న ఆయన లాంఛనంగా రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం బిహార్ పర్యటనలో ఉన్న ఆయన మార్చి 26 వరకు రాష్ట్రమంతా పర్యటించనున్నారు. ఏప్రిల్ 8 లేదా 9వ తేదీన సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్‌ను ఉప ముఖ్యమంత్రిని చేసే సూచనలు కనిపిస్తున్నాయి. జేడీయూ నుంచి మరొకరు డిప్యూటీ సీఎంగా ఉంటారని, హోం శాఖ మాత్రం బీజేపీ వద్దే ఉంటుందని తెలుస్తోంది.

ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్

మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలందరికీ త్రీ-లైన్ విప్ జారీ చేసింది. పోలింగ్ రోజున ఎమ్మెల్యేలంతా భువనేశ్వర్‌లోనే అందుబాటులో ఉండి తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆదేశించింది.

Advertisement
Advertisement