త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nishita Rajput | పెళ్లి ఖర్చుల కన్నా వారి చదువే ముఖ్యం: 34,000 మంది పేద ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన నిషితా రాజ్‌పుత్!

వడోదరకు చెందిన నిషితా రాజ్‌పుత్ 34,000 మంది పేద ఆడపిల్లల చదువుకు ఎలా అండగా నిలిచింది? తన పెళ్లి ఖర్చును సైతం వారి ఫీజులకే ఎందుకు ఇచ్చిందో తెలుసుకుందాం రండి.

J

National | Published On Jun 8, 2026, 11.00 pm IST

Nishita Rajput | పెళ్లి ఖర్చుల కన్నా వారి చదువే ముఖ్యం: 34,000 మంది పేద ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన నిషితా రాజ్‌పుత్!
Advertisement
  • గుజరాత్‌లోని వడోదరకు చెందిన 28 ఏళ్ల నిషితా రాజ్‌పుత్ స్ఫూర్తిదాయక ప్రయాణం
  • గత పదేళ్లలో దాతల నుంచి రూ.3.25 కోట్లు సేకరించి 34,000 మంది ఆడపిల్లల చదువుకు సాయం
  • పారదర్శకత కోసం నగదు తీసుకోకుండా, నేరుగా స్కూల్ పేరు మీదే చెక్కుల (Cheques) చెల్లింపు
  • కరోనా సమయంలో తన పెళ్లికి అయ్యే ఆర్భాటపు ఖర్చును కూడా 251 మంది విద్యార్థినుల ఫీజుల కోసం మళ్లించిన వైనం

Nishita Rajput | త్రినేత్ర.న్యూస్ : గుజరాత్‌ (Gujarat) లోని వడోదరకు చెందిన నిషితా రాజ్‌పుత్ (Nishita Rajput) పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. సమాజంలో పేదరికం కారణంగా ఏ ఒక్క ఆడపిల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆమె వేసిన ఒక చిన్న అడుగు, నేడు ఏకంగా 34,000 మందికి పైగా ఆడపిల్లల జీవితాల్లో అక్షర కాంతులు నింపుతోంది. గత పదేళ్లుగా దాతల సాయంతో ఏకంగా 3.25 కోట్ల రూపాయలను సేకరించి, ఆ నిధులను నేరుగా స్కూల్ ఫీజుల కోసమే చెల్లించిన ఈ కలియుగ సరస్వతి ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.

Nishita Rajput The Woman Who Funded Education for 34,000 Girls

చిన్నప్పటి నుంచే సేవా దృక్పథం

నిషితకు చిన్నప్పటి నుంచే సామాజిక సేవ (Social work) పట్ల ఆసక్తి ఉండేది. అనాథాశ్రమాలకు వెళ్లి తన పుట్టినరోజులు, సెలవులు జరుపుకోవడం ఆమెకు అలవాటు. ఒకసారి 14 ఏళ్లు వచ్చినా కనీసం గడియారంలో సమయం కూడా సరిగ్గా చూడలేని స్థితిలో ఉన్న ఒక పేద ఆడపిల్లను చూసి చలించిపోయింది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఈ రోజుల్లో.. కేవలం డబ్బుల్లేక ఆడపిల్లలు చదువులో వెనుకబడిపోకూడదని ఆమె నిర్ణయించుకుంది. తన తండ్రి గులాబ్ రాజ్‌పుత్ ప్రోత్సాహంతో 2011 నుండి ఇళ్లూ ఇళ్లూ తిరుగుతూ ఫండ్స్ (Funds) సేకరించడం ప్రారంభించింది.

Nishita Rajput The Woman Who Funded Education for 34,000 Girls

100% పారదర్శకత.. నగదుకు నో

నిషిత సక్సెస్ వెనుక ఉన్న అతిపెద్ద బలం ఆమె పాటించే పారదర్శకత (Transparency). ఆమె దాతల నుండి ఎన్నడూ నేరుగా నగదు (Cash) తీసుకోదు. కేవలం స్కూల్ పేరు మీద ఉండే 'అకౌంట్ పేయీ చెక్కులను' (Account Payee Cheques) మాత్రమే తీసుకుని నేరుగా ఆయా పాఠశాలల్లోనే ఫీజులు కడుతుంది. అంతేకాదు, ఆ పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టులను (Progress reports) కూడా దాతలకు పంపిస్తూ వారి నమ్మకాన్ని సంపాదించుకుంది. ఈ నిజాయితీ వల్లే ఇప్పుడు ఆమెకు యూకే, యూఎస్ లాంటి దేశాల నుంచి కూడా దాతలు స్వచ్ఛందంగా విరాళాలు పంపుతున్నారు.

Nishita Rajput The Woman Who Funded Education for 34,000 Girls

పెళ్లి ఖర్చులు కూడా వారి ఫీజులకే

కరోనా (Covid-19) సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల విరాళాలు బాగా తగ్గిపోయాయి. సరిగ్గా ఆ సమయంలోనే నిషితకు పెళ్లి కుదిరింది. అయితే, ఆర్భాటంగా పెళ్లి చేసుకుని లక్షలు ఖర్చు చేయడం ఇష్టం లేక.. తన వివాహాన్ని చాలా సింపుల్‌గా చేసుకుని, ఆ పెళ్లి ఖర్చును 251 మంది ఆడపిల్లల ఫీజుల కోసం వాడేసింది. అదనంగా మరో 21 మందికి రూ. 5,000 చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) చేసి తన పెద్ద మనసు చాటుకుంది.

Nishita Rajput The Woman Who Funded Education for 34,000 Girls

"ఏడు తరాల భవిష్యత్తు మారుతుంది"

"మనం నీళ్లు ఇస్తే కొన్ని గంటలు, అన్నం పెడితే కొన్ని రోజులు ఆకలి తీరుతుంది. అదే బట్టలు ఇస్తే రెండు మూడేళ్లు వాడతారు. కానీ చదువుని ఇస్తే.. రాబోయే ఏడు తరాల భవిష్యత్తు మారుతుంది" అని బలంగా నమ్ముతుంది నిషిత. విద్యాదానంతో పాటు వృద్ధులకు, అనాథలకు ఉచితంగా ప్యాక్డ్ ఫుడ్ కూడా అందిస్తూ ఎంతోమందికి ఆకలి తీరుస్తోంది.

ఆడపిల్లల సాధికారత (Women Empowerment) అంటే కేవలం మాటలు కాదని, చేతల్లో చేసి చూపించిన నిషితా రాజ్‌పుత్ నిజంగా దేశం గర్వించదగ్గ యువతి.

Advertisement
Advertisement