త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maharashtra Cliff Death | మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!

మహారాష్ట్రలో కొండపైనుంచి పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటనలో పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు కారణం ఇదే..

J

National | Published On Aug 26, 2026, 2.01 pm IST

Maharashtra Cliff Death | మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!
Advertisement
  • మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కొండపైనుంచి పడి బాలుడు, తల్లిదండ్రుల మృతి
  • ఐఫోన్ కొనివ్వలేదనే కోపంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడనేది వట్టి పుకారు మాత్రమేనని పోలీసుల స్పష్టీకరణ
  • కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడి
  • కొడుకుని కాపాడే క్రమంలో తండ్రి.. ఆ కళ్లెదుటే భర్త, కొడుకు పడిపోవడం చూసి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

Maharashtra Cliff Death | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని శంభాజీనగర్ (Sambhajinagar) సమీపంలోని ఖవ్డా కొండల (Khavda hills) మీద నుంచి పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 18 ఏళ్ల కునాల్ చంద్వాడే, అతని తల్లిదండ్రులు మురళీధర్, సంగీత మృతి చెందిన తీరుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయ్యాయి. అయితే, ఈ విషాదం వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు బయటపడింది.

ఐఫోన్ పుకారు.. పోలీసుల దర్యాప్తులో నిజాలు

తల్లిదండ్రులు ఐఫోన్ (iPhone) కొనివ్వలేదన్న కోపంతోనే కునాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సోషల్ మీడియాలో ముందుగా తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ, పోలీసుల విచారణలో ఇదంతా అబద్ధమని తేలింది. గత మూడు నెలలుగా ఇంట్లో జరుగుతున్న కుటుంబ కలహాలే ఈ ఘోరానికి దారితీశాయని దర్యాప్తు చేస్తున్న ఒక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

ఆ రోజు ఏం జరిగింది?

శుక్రవారం మధ్యాహ్నం కునాల్ ఖవ్డా కొండల పైకి చేరుకుని తన తల్లికి ఫోన్ చేశాడు. తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. వెంటనే కంగారు పడిన తల్లిదండ్రులు ఉదయం 10 గంటల ప్రాంతంలో కొండల వద్దకు చేరుకుని అతడిని వెతకడం మొదలుపెట్టారు.

మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కొండ అంచున ఉన్న కునాల్‌ను వెనక్కి లాగేందుకు తండ్రి మురళీధర్ ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి లోయలోకి పడిపోయారు. "కళ్లెదుటే భర్త, కొడుకు ప్రాణాలు కోల్పోవడం చూసి తట్టుకోలేకపోయిన తల్లి సంగీత కూడా సెకన్ల వ్యవధిలోనే గుండె పగిలి కొండపైనుంచి దూకేసింది" అని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించారు.

కలహాలకు కారణం ఏంటి?

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. మురళీధర్, సంగీత ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ మురళీధర్ కుటుంబానికి ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో అతడు జాల్నా జిల్లాలోని తన స్వగ్రామాన్ని వదిలి, కుటుంబానికి దూరంగా శంభాజీనగర్‌లో భార్యతో కలిసి జీవిస్తున్నాడు.

అయితే, గత మూడు నెలలుగా మురళీధర్ మళ్లీ తన కుటుంబ సభ్యులతో మాట్లాడటం.. వారిని కలవడం మొదలుపెట్టాడు. ఇది దంపతుల మధ్య తీవ్ర వివాదాలకు దారితీసింది. డ్రైవర్‌గా పనిచేసే మురళీధర్.. ఈ గొడవల కారణంగా పని తర్వాత ఇంటికి రావడం మానేశాడని పోలీసులు తెలిపారు. ముగ్గురూ మరణించడానికి ముందు రోజే అతడు ఇంటికి తిరిగి వచ్చినట్లు సమాచారం.

వీడియోలు షేర్ చేయొద్దు: సంగీత సోదరి ఆవేదన

తమ కుటుంబం ఎంతటి విషాదంలో ఉందో అర్థం చేసుకోవాలని, ఇలాంటి తప్పుడు వార్తలు, వీడియోలు షేర్ చేయొద్దని సంగీత సోదరి ఒక వీడియో ద్వారా ప్రజలను వేడుకున్నారు. "ఒకే రోజు మా కుటుంబంలోని ముగ్గురిని కోల్పోయాం. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి" అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రస్తుతం పోలీసులు.. ప్రత్యక్ష సాక్షులు, ఇరుగుపొరుగు వారు, బంధువులు సహా 10 మందిని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement