త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jharkhand Rajya Sabha Elections | జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం: ఎన్డీయే అభ్యర్థి సంచలన విజయం!

జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం. తగినంత బలం లేకపోయినా బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి పరిమళ్ నత్వానీ సంచలన విజయం సాధించారు.

J

National | Published On Jun 18, 2026, 9.51 pm IST

Jharkhand Rajya Sabha Elections | జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం: ఎన్డీయే అభ్యర్థి సంచలన విజయం!

సంక్షిప్త సారాంశం

జార్ఖండ్‌లో జరిగిన రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్, బీజేపీ బలపరిచిన పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. ఎన్డీయేకు తగినంత సంఖ్యాబలం లేకపోయినా.. ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌తో నత్వానీ గెలుపొందారు. ఈ విజయంతో నత్వానీ రాజ్యసభకు ఎన్నికవడం ఇది చరిత్రాత్మక నాలుగోసారి. జార్ఖండ్‌ను ఆయన తన 'కర్మభూమి'గా అభివర్ణించారు. ఉభయ సభల్లో రాజ్యాంగ సవరణ బిల్లులు పాస్ చేసుకోవడానికి ఈ విజయాలు ఎన్డీయేకు కీలకంగా మారనున్నాయి.

Advertisement

Jharkhand Rajya Sabha Elections | త్రినేత్ర.న్యూస్ : జార్ఖండ్ (Jharkhand) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha elections) క్రాస్ ఓటింగ్ ఎన్డీయేకు భారీ లాభాన్ని చేకూర్చింది. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, బీజేపీ (BJP) మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ (Parimal Nathwani) సంచలన విజయం సాధించారు. మరో సీటును అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కైవసం చేసుకుంది.

ఎన్నికల సమీకరణాలు, ఫలితాలు

మొత్తం 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో రెండు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో అధికార జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్ 30 ఓట్లు సాధించి మొదటి సీటును కైవసం చేసుకున్నారు. బీజేపీ బలపరిచిన పరిమళ్ నత్వానీ 28 ఓట్లతో రెండో స్థానాన్ని గెలుచుకోగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా 20 ఓట్లతో ఓటమి పాలయ్యారు. మూడు ఓట్లు చెల్లనివిగా (Invalid) ప్రకటించారు. ఇందులో రెండు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

'క్రాస్ ఓటింగ్' వల్లే విజయం!

అసలు నత్వానీ ఎలా గెలిచారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభ సీటు గెలవాలంటే తొలి ప్రాధాన్యత కింద 28 ఓట్లు కావాలి. కానీ, జార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) బలం 24 మాత్రమే. కాగా అధికార 'ఇండియా' కూటమికి 56 మంది సభ్యుల బలం ఉంది. అయితే, ఈ ఎన్నికల్లో ఆర్జేడీకి చెందిన నలుగురు (RJD), సీపీఐ-ఎంఎల్‌కు (CPI-ML) చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి నత్వానీకి ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది.

నా 'కర్మభూమి' జార్ఖండ్: నత్వానీ

ఈ విజయంతో పరిమళ్ నత్వానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన రాజ్యసభకు ఎంపికవడం ఇది వరుసగా నాలుగోసారి. 2008 నుంచి 2020 వరకు జార్ఖండ్ నుంచి ఎంపీగా పనిచేసిన ఆయన, ఆ తర్వాత 2020లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మళ్లీ తన 'కర్మభూమి' అయిన జార్ఖండ్ నుంచి గెలవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు తనకు ఓటు వేసిన ఎమ్మెల్యేలందరికీ సోషల్ మీడియా (X) వేదికగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పెరుగుతున్న ఎన్డీయే బలం

రాజ్యసభలో ఎన్డీయే బలాన్ని ఈ తాజా విజయం మరింత పెంచనుంది. త్వరలో జరగనున్న వర్షాకాల సమావేశాల్లో (Monsoon session) మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. రాజ్యాంగ సవరణలు (Constitution amendment Bills) అవసరమైన ఈ బిల్లులు పాస్ కావాలంటే ఉభయ సభల్లో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ అవసరం.

ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులుండగా.. అందులో 150 మంది ఎంపీల బలం ఉన్న ఎన్డీయేకు, ఈ బిల్లులు పాస్ కావాలంటే మరో 14 మంది సభ్యుల మద్దతు (164 ఎంపీలు) అవసరం. అటు లోక్‌సభలోనూ ఎన్డీయేకు 298 మంది సభ్యులున్నారు. భవిష్యత్తులో మమతా బెనర్జీ (TMC), ఉద్ధవ్ థాకరే వర్గాల్లో చీలికల ద్వారా ఎన్డీయే బలాన్ని మరింత పెంచుకునే వ్యూహాల్లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement