త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India EV Policy | ముడి చమురు కష్టాలకు చెక్.. ఈవీలు, ఇథనాల్ ఈ100 దిశగా కేంద్రం భారీ ప్రణాళికలు

ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. కమర్షియల్ ఈవీలకు వేల కోట్ల భారీ రాయితీలతో పాటు, దేశవ్యాప్తంగా E100 ఇథనాల్ స్టేషన్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

J

National | Published On May 20, 2026, 11.30 pm IST

India EV Policy | ముడి చమురు కష్టాలకు చెక్.. ఈవీలు, ఇథనాల్ ఈ100 దిశగా కేంద్రం భారీ ప్రణాళికలు
Advertisement

India EV Policy | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతుండటం, భారత్ తన చమురు అవసరాల కోసం 90 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ భారం పడుతోంది. కేవలం చమురు దిగుమతుల కోసమే భారత్ ప్రతి ఏడాది దాదాపు రూ.10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ముప్పును తిప్పికొట్టి, విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఆదా చేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకంతో పాటు 100 శాతం ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో అత్యధికంగా డీజిల్ వినియోగిస్తున్న ప్రైవేట్ కమర్షియల్ బస్సులు, భారీ ట్రక్కులను ఎలక్ట్రిక్ వైపు మళ్లించేందుకు సుమారు బిలియన్ డాలర్ల (రూ.8,300 కోట్లు) భారీ ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. దీని ద్వారా బస్సుల కొనుగోలుకు ఒక్కో వాహనంపై రూ.15 లక్షల వరకు వడ్డీ రాయితీ లభించే అవకాశం ఉంది. మరోవైపు, రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5 వేలకు పైగా ఈ100 ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేయాలని పెట్రోలియం శాఖ లక్ష్యంగా పెట్టుకోగా.. ముందుగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు.

అయితే, ఈ భారీ ప్రక్షాళన పూర్తి స్థాయిలో అమలు కావడానికి పలు సవాళ్లు కూడా ఉన్నాయి. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌ మైలేజ్ తక్కువగా ఉండటం, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కొరత ప్రధాన అడ్డంకులుగా మారాయి. మారుతి సుజుకి, టాటా, మహీంద్రా వంటి ఆటోమొబైల్ సంస్థలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ప్రోటోటైప్‌లను సిద్ధం చేసినా, ఇంధన లభ్యతపై స్పష్టత లేక వాణిజ్యపరంగా మార్కెట్లోకి తీసుకురావడానికి వెనుకడుగు వేస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించి వినియోగదారులను ఆకర్షించాలంటే ఈ100 ధరను సాధారణ పెట్రోల్ కంటే కనీసం 30 శాతం తక్కువగా విక్రయించాలని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సూచిస్తోంది. ఇటు ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా స్థానికంగా 8 కోట్ల మంది రైతులకు, అనుబంధ రంగాలకు లబ్ధి చేకూరుతుందని, అలాగే జీఎస్టీ తగ్గింపు వంటి పన్ను రాయితీలు అందిస్తే కమర్షియల్ వెహికిల్ ఆపరేటర్లు సులభంగా ఈవీల వైపు మళ్లుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య వాహనాల విద్యుదీకరణ, 100% ఇథనాల్ విధానం సక్సెస్ అయితే విదేశీ ముడిచమురుపై ఆధారపడటం పూర్తిగా తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి సాధిస్తుంది.

Advertisement
Advertisement