త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suresh Kalmadi | కేంద్ర మాజీ మంత్రి సురేశ్ క‌ల్మాడీ క‌న్నుమూత‌

Suresh Kalmadi | కేంద్ర రైల్వే శాఖ మాజీ స‌హాయ మంత్రి (Ex Union Minister) సురేశ్ క‌ల్మాడీ (82) (Suresh Kalmadi) మ‌ర‌ణించారు. వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న ఆయ‌న పుణె (Pune)లోని దీననాథ్ మంగేష్క‌ర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు.

A

National | Published On Jan 6, 2026, 4.30 pm IST

Suresh Kalmadi | కేంద్ర మాజీ మంత్రి సురేశ్ క‌ల్మాడీ క‌న్నుమూత‌
Advertisement

Suresh Kalmadi | కేంద్ర రైల్వే శాఖ మాజీ స‌హాయ మంత్రి (Ex Union Minister) సురేశ్ క‌ల్మాడీ (82) (Suresh Kalmadi) మ‌ర‌ణించారు. వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న ఆయ‌న పుణె (Pune)లోని దీననాథ్ మంగేష్క‌ర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా ప‌నిచేసిన ఆయ‌న త‌ర్వాత రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించి, రాజ్య‌స‌భ స‌భ్యుడిగా, లోక్‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధానిగా ఉన్న మంత్రివ‌ర్గంలో స‌హాయ మంత్రిగా ప‌నిచేశారు. అనంత‌రం ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌కు సుదీర్ఘ‌కాలం అధ్య‌క్షుడిగా సేవ‌లందించారు. రాజ‌కీయ‌, క్రీడా రంగాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. సుదీర్ఘ‌కాలం రాజ‌కీయాల్లో కొన‌సాగిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ‌గా ఉన్నారు. వివిధ ఆరోప‌ణ‌ల రీత్యా ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ప్ప‌టికీ మ‌రే ఇత‌ర పార్టీలో చేర‌లేదు.

1944లో త‌మిళ‌నాడులో జ‌న్మించిన ఆయ‌న మ‌హారాష్ట్ర‌లోని పుణెలో సెయింట్ విన్సెంట్‌లో పాఠ‌శాల విద్య‌, ఫెర్గూస‌న్ క‌ళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అనంత‌రం ఖ‌డ‌క్‌వాస్లాలోని నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలో చేరి సైనిక శిక్ష‌ణ తీసుకున్నారు. జోధ్‌పూర్‌, అల‌హాబాద్‌ల‌లో ఎయిర్‌ఫోర్స్ ఫ్ల‌యింగ్ కాలేజ్‌లో పైల‌ట్‌గా శిక్ష‌ణ పొందారు. 1964 నుంచి 1972 వ‌ర‌కు ఎయిర్‌ఫోర్స్‌లో పైల‌ట్‌గా ప‌నిచేశారు. 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్నారు.

అనంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌ల్మాడీ 1980లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రాజ్య‌స‌భ సభ్య‌డిగా ఎన్నిక‌య్యారు. 1986, 1992ల‌లో రాజ్య‌స‌భ‌కే తిరిగి ఎన్నిక‌య్యారు. 1996లో లోక్‌స‌భ‌కు మొద‌టి సారిగా ఎన్నికై, 2004, 2009 ఎన్నిక‌ల్లో సైతం విజ‌యం సాధించారు. 1998 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం అప‌జ‌యం చ‌విచూశారు. 1996 నుంచి 2011 వ‌ర‌కు ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ చైర్మెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. 2000 నుంచి 2013 వ‌ర‌కు ఆసియా అథ్లెటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా సైతం ప‌నిచేశారు. 2015లో దాని జీవిత‌కాల అధ్య‌క్షునిగా నియ‌మితుల‌య్యారు. 2010లో భార‌త‌దేశంలో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మెన్‌గా ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

2010 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌లో అవినీతి, ఇత‌ర అంశాల‌పై ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. 2011లో ఆయ‌న‌ను కాంగ్రెస్ పార్టీ బ‌హిష్క‌రించింది. ఆ కేసుల్లో చాలా కేసుల‌ను న్యాయ‌స్థానాలు కొట్టివేశాయి.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement