త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharmendra Pradhan | కాక్రోచ్‌ల‌కు తలొంచక తప్పలేదు.. రేప‌టితో తేల‌నున్న ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ భ‌విత‌వ్యం

సీజేపీ ప్ర‌తినిధిలుతో కేంద్రం చ‌ర్చ‌లు జ‌రిపింది. దాదాపు రెండు గంట‌ల‌పాటూ జ‌రిగిన ఈ స‌మావేశానికి కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్‌, జేపీ న‌డ్డా హాజ‌ర‌య్యారు. విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా, పేప‌ర్‌లీక్ కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం, ఆందోళ‌న చేస్తున్న విద్యార్థుల‌పై కేసులు ఎత్తివేయాల‌ని సీజేపీ డిమాండ్ చేసింది.

D

National | Published On Jul 24, 2026, 5.38 pm IST

Dharmendra Pradhan | కాక్రోచ్‌ల‌కు తలొంచక తప్పలేదు.. రేప‌టితో తేల‌నున్న ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ భ‌విత‌వ్యం
Advertisement
  • చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం
  • ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాకు స‌మ‌యం కోరిన మంత్రులు
  • విద్యామంత్రి రాజీనామా చేయాల్సిందేన‌న్న కాక్రోచ్ పార్టీ
  • ప్ర‌భుత్వం స‌మాధానం చెప్ప‌క‌పోతే దేశ‌వ్యాప్త ఉద్య‌మం
  • అర్ధరాత్రి వీడియో సందేశంతో మోదీ వేడుకోలు

Dharmendra Pradhan | త్రినేత్ర‌.న్యూస్ : నీట్ పేప‌ర్ లీక్‌కు నిర‌స‌న‌గా కాక్రోచ్ జ‌న‌తాపార్టీ చేప‌ట్టిన ఉద్య‌మం తీవ్ర‌రూపం దాల్చింది. ఈ నేప‌థ్యంలో దిగొచ్చిన కేంద్రం సీజేపీ ప్ర‌తినిధిలుతో చ‌ర్చ‌లు జ‌రిపింది. దాదాపు రెండు గంట‌ల‌పాటూ జ‌రిగిన ఈ స‌మావేశానికి కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్‌, జేపీ న‌డ్డా హాజ‌ర‌య్యారు. సీజేపీ త‌ర‌ఫున సౌర‌వ్ దాస్‌, అశుతోష్ రంకా వెళ్లారు. ఈ సంద‌ర్భంగా కేంద్రం ముందు సీజేపీ మూడు ప్ర‌ధాన డిమాండ్లు ఉంచింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు..

విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా, పేప‌ర్‌లీక్ కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం, ఆందోళ‌న చేస్తున్న విద్యార్థుల‌పై కేసులు ఎత్తివేయాల‌ని సీజేపీ డిమాండ్ చేసింది. ప్ర‌ధాన్ రాజీనామా త‌ప్ప మిగ‌తా రెండు డిమాండ్ల‌కు కేంద్రం సానుకూలంగా స్పందించిన‌ట్లు సీజేపీ ప్ర‌తినిధులు తెలిపారు. "కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్‌పై ప్ర‌భుత్వం స‌మ‌యం కోరింది. దీనిపై రేపు మ‌ధ్యాహ్నానికి త‌మ నిర్ణ‌యం వెల్ల‌డిస్తామ‌ని హామీ ఇచ్చింది. ఈ విష‌యంలో మేము వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టంగా చెప్పాం. రేపు మ‌ధ్యాహ్నం లోపు ఎలాంటి నిర్ణ‌యం రాక‌పోతే.. జులై 20న చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌కంటే తీవ్ర‌స్థాయిలో దేశ‌వ్యాప్త ఉద్య‌మానికి పిలుపునిస్తామ‌ని కేంద్ర మంత్రుల‌కు చెప్పాం" అని సీజేపీ ప్ర‌తినిధి అశుతోష్ రంకా స్ప‌ష్టం చేశారు.

రేపు మ‌రోద‌ఫా చ‌ర్చ‌లు : న‌డ్డా

సీజేపీ నేత‌ల‌తో దాదాపు రెండు గంట‌ల‌పాటూ చ‌ర్చ‌లు జరిగిన‌ట్లు కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా తెలిపారు. సీజేపీ త‌మ ముందు మూడు ముఖ్య‌మైన డిమాండ్లు ఉంచింద‌ని చెప్పారు. ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. కొన్ని డిమాండ్ల‌కు త్వ‌ర‌లోనే స‌మాధానం ఇస్తామ‌ని న‌డ్డా పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంపై శ‌నివారం మ‌రో ద‌ఫా చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని వెల్ల‌డించారు.

రేప‌టితో తేల‌నున్న ధ‌ర్మేంద్ర భ‌విత‌వ్యం

గ‌త నెల రోజుల‌కుపైగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. ఈ అంశం రేపు ఓ కొలిక్కి రానుంది. సీజేపీకి ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌భుత్వం రేప‌టిలోపు విద్యాశాఖ మంత్రి రాజీనామాపై ఓ నిర్ణ‌యం తీసుకోనుంది. ఈ నేప‌థ్యంలో ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ భ‌విత‌వ్యం ఏంట‌న్న‌ది రేపు తేల‌నుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో నిర‌స‌న‌కు కూడా ఫుల్‌స్టాప్ ప‌డే అవ‌కాశం ఉంది.

ఆ పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌డ‌తాం

సీజేపీ నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డార‌ని ఆరోపిస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. రెండు వేర్వేరు పిటిష‌న్ల‌ను జులై 27న విచారించేందుకు సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం అంగీక‌రించింది.

పేపర్ లీకేజీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

పేప‌ర్ లీక్‌ల‌కు పాల్ప‌డే వారికి క‌ఠిన శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాల కంటే మ‌రింత క‌ఠిన‌మైన శిక్ష‌ల‌ను విధించేలా రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోద‌ముద్ర వేసిన‌ట్లు అధికారిక వ‌ర్గాలు తెలిపాయి. ప‌శ్నాప‌త్రం లీక్ ఘ‌ట‌న‌లో దోషిగా తేలితే ప‌దేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష‌, రూ.కోటి జ‌రిమానా విధించేలా చ‌ట్టాన్ని స‌వ‌రించిన‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై కూడా కేబినెట్‌లో చ‌ర్చించారు.

అర్ధ‌రాత్రి మోదీ వేడుకోలు

నీట్ పేప‌ర్ లీక్‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు తీవ్ర‌మ‌వుతుండ‌టంతో ప్ర‌ధాని మోదీ ఊహించ‌నివిధంగా అర్థ‌రాత్రి వీడియో సందేశం విడుద‌ల చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌పై కఠిన చర్యలు ఉంటాయని స్ప‌ష్టం చేశారు. "నీట్ పేప‌ర్ లీక్ అనేది సాధార‌ణ అంశం కాదు. నిందితుల‌ను ఇప్ప‌టికే అరెస్టు చేసి జైలుకు పంపాం. అంత‌టితో మా ప‌ని అయిపోలేదు. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకూడ‌ద‌ని తిరిగి పరీక్ష నిర్వహించాం. రెండున్న‌ర నెల‌ల్లో ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నాం. మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోబోతున్నాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశించాం. పేప‌ర్ లీక్‌ల‌ను అరిక‌ట్టేలా పార్ల‌మెంటులో అతిత్వ‌ర‌లోనే బిల్లు ప్ర‌వేశ‌పెడ‌తాం" అని ప్ర‌ధాని సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు.

విద్యార్థులపై దాడులు ఆపండి

విద్యార్థుల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం దారుణంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను నేర‌పూరిత విద్యాశాఖ మంత్రిగా అభివ‌ర్ణించారు. ఆయ‌న దేశ విద్యావ్య‌వ‌స్థ ప‌త‌నానికి ప్ర‌తీక అని వ్యాఖ్యానించారు. ప్ర‌ధాన్‌ను వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. జులై 20న జరిగిన నిరసనల సమయంలో భద్రతా బలగాలు జరిపిన పెల్లెట్ తుపాకీ కాల్పుల్లో గాయపడ్డ విద్యార్థి నిరసనకారుడిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. పెల్లెట్ తగిలి ఆ విద్యార్థికి కన్ను తీవ్రంగా దెబ్బతిన్న‌ద‌ని తెలిపారు. విద్యార్థుల‌పై దాడులు ఆపాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement