త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Election Results | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు.. కొన‌సాగుతున్న కౌంటింగ్‌..

Assembly Election Results | దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Election Results) వెలువడే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌రో 3-4 గంట‌ల్లో ఫ‌లితాల‌పై పూర్తిస్థాయిలో స్ప‌ష్ట‌త రానుంది.

G

National | Published On May 4, 2026, 8.36 am IST

Assembly Election Results | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు.. కొన‌సాగుతున్న కౌంటింగ్‌..
Advertisement

Assembly Election Results | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Election Results) వెలువడే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌రో 3-4 గంట‌ల్లో ఫ‌లితాల‌పై పూర్తిస్థాయిలో స్ప‌ష్ట‌త రానుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎన్నికల అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచి తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. తర్వాత 8.30 గంట‌ల‌కు ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఈనేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు, అస్సాం, కేరళలో ఎన్నికల సంఘం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది.

త‌మిళ‌నాడులో..

త‌మిళ‌నాడులో 234 అసెంబ్లీ స్థానాల‌కు ఒకే విడ‌త‌లో ఏప్రిల్ 23న ఎన్నిక‌లు నిర్వ‌హించారు. మొత్తం 4 వేల మంది అభ్య‌ర్థులు పోటీచేశారు. 85.15 శాతం ఓటింగ్‌ రికార్డయ్యింది. కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈవీఎం కోసం ప్ర‌త్యేకంగా 234 కౌంటింగ్ హాళ్లను, పోస్టల్ బ్యాలెట్లు, ETPBS ఓట్లను లెక్కించేందుకు మరో 240 హాళ్లు కేటాయించారు. మొత్తం 3,324 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్లను లెక్కించ‌నున్నారు. కౌంటింగ్‌ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాల్గొంటున్నారు.

ప‌శ్చిమ బెంగాల్‌లో

ప‌శ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండా, ఒక చోట ఈ నెల 21న రీపోలింగ్ నిర్వ‌హించనున్నారు. మిగిలిన 293 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 432 మంది కౌంటింగ్ ప‌రిశీల‌కుల‌ను ఈసీ నియ‌మించింది. కాగా, రెండు ద‌శ‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌గా రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంతగా రికార్డు స్థాయిలో 92.47 శాతం ఓటింగ్ న‌మోద‌యింది. ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత ఒక్కొక్క‌టిగా ఫ‌లితాల‌పై స్ప‌ష్ట‌త రానుంది.

కేర‌ళలో..

కేర‌ళ‌లో అధికార ఎల్‌డీఎఫ్‌, విప‌క్ష యూడీఎఫ్ కూటముల మ‌ధ్య పోరు హోరాహోరీగా జ‌రిగింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 883 మంది అభ్య‌ర్థులు పోటీచేశారు. 43 ప్రాంతాల్లో 140కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. 15 వేల మందికిపైగా భ‌ద్ర‌తా సిబ్బంది, ఎన్నిక‌ల అధికారు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 9న జ‌రిగిన పోలింగ్‌లో 79.63 శాతం ఓటింగ్ న‌మోద‌యింది. అయితే అధిక‌ర ఎల్‌డీఎఫ్‌పై యూడీఎఫ్ స్వ‌ల్ప ఆధిక్యంతో గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి.

కాగా, ఓట్ల లెక్కింపు ముందు కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ త‌న సోష‌ల్ మీడియా బ‌యోను అప్‌డేట్ చేశారు. అందులో ఆయ‌న త‌న ముఖ్య‌మంత్రి హోదాను తొల‌గించి, త‌న‌ను భార‌త క‌మ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడిగా పేర్కొన్నారు.

అస్సాం..

126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నిక‌లు జ‌రిగాయి. మొత్తం 722 మంది అభ్యర్థులు పోటీచేశారు. 85.96 శాతం ఓటింగ్ న‌మోద‌యింది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేవారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 25 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పాటు 93 కంపెనీల రాష్ట్ర సాయుధ పోలీసులను లెక్కింపు కేంద్రాల వద్ద మోహరించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు తర్వాత EVMల్లో ఓట్లు లెక్కిస్తారు.

పుదుచ్చేరి..

కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గతనెల 9న జరిగిన ఎన్నికల్లో పుదుచ్చేరిలో 89.87 శాతం పోలింగ్ నమోదైంది. మెుత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో వివిధ పార్టీల నుంచి వెయ్యి 99 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆరు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. ఈవీఎంలు, వీవీప్యాట్ల లెక్కింపు కోసం 166 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేకంగా 35 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement