త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Elections 2026 | అసెంబ్లీ ఎన్నికలు 2026: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో భారీ పోలింగ్.. రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు

2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఉపఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పుదుచ్చేరిలో అత్యధికంగా 87% ఓటింగ్ నమోదు కాగా అస్సాంలో 85% ఓటింగ్ నమోదైంది.

J

National | Published On Apr 9, 2026, 7.14 pm IST

Assembly Elections 2026 | అసెంబ్లీ ఎన్నికలు 2026: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో భారీ పోలింగ్.. రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు
Advertisement
  • సాయంత్రం 5 వరకు అస్సాంలో 84.42 శాతం
  • కేరళలో 75.01 శాతం
  • పుదుచ్చేరిలో 86.92 శాతం

Assembly Elections 2026 | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైంది. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య త్రిముఖ పోరుతో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అస్సాంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, కేరళలో వామపక్ష కూటమి ఐదోసారి సత్తా చాటాలని భావిస్తోంది. ఇక పుదుచ్చేరిలో ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ నాలుగో విజయంపై కన్నేసింది.

ఈ విడతలో అస్సాంలో 126 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.

అస్సాంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

సాయంత్రం 5 గంటల వరకు అస్సాంలో 84.42 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2021 ఎన్నికల (82.04%) కంటే ఎక్కువ కావడం విశేషం. 2023 లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అస్సాంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. ముస్లిం ఓటర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మార్పులు జరగడం అప్పట్లో వివాదాస్పదమైంది. అస్సాం కాంగ్రెస్ ప్రెసిడెంట్, జోర్హాట్ కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ తన తండ్రి, మాజీ సీఎం తరుణ్ గొగోయ్‌కి నివాళులర్పించిన అనంతరం ఓటు వేశారు. గత ఏడాది ప్రాణాలు కోల్పోయిన అస్సాం ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ భార్య గరిమా గార్గ్ గౌహతిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండి, బాధ్యతాయుతంగా ఓటు వేయాలని జుబిన్ సోదరి కోరారు.

 

కేరళలో త్రిముఖ పోరు

కేరళలో గత ఎన్నికల తరహాలోనే సాయంత్రం 5 గంటల వరకు 75.01 శాతం పోలింగ్ నమోదైంది. అధికార వామపక్ష పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఇక్కడ తీవ్ర పోటీ నెలకొంది. సీఎం పినరయి విజయన్ కన్నూర్‌లోని పోలింగ్ బూత్‌లో, సీపీఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ తిరువనంతపురంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే అద్భుతమైన విజయం సాధిస్తుందని కేరళ మంత్రి జార్జ్ కురియన్ ధీమా వ్యక్తం చేయగా, క్షేత్రస్థాయిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు.

పెళ్లి పీటలెక్కే ముందు ఓటేసిన వధువు

వాయనాడ్ జిల్లాకు చెందిన అఖిల ఆంటోని అనే యువతి ఉదయం 9 గంటలకే పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసింది. పెళ్లికి ముందు ప్రజాస్వామ్యానికే ప్రాధాన్యతనిచ్చిన ఆమె అందరి ప్రశంసలు అందుకుంది.

పుదుచ్చేరిలో అదరగొట్టిన ఓటింగ్.. రోబో నీలా సందడి

మూడు రాష్ట్రాల్లో అత్యధికంగా పుదుచ్చేరిలోనే సాయంత్రం 5 గంటల వరకు 86.92 శాతం ఓటింగ్ నమోదైంది. ఏఐఎన్ఆర్‌సీ-బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి, కాంగ్రెస్-డీఎంకే కూటమికి మధ్య ఇక్కడ ప్రధాన పోటీ ఉంది. దళపతి విజయ్‌కు చెందిన 'తమిళగ వెట్రి కజగం' పార్టీ ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వైతిలింగం ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ.. మే 4న తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు వీఓసీ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన 'నీలా' అనే రోబో ఓటర్లకు సాదర స్వాగతం పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షించింది.

కర్ణాటక ఉపఎన్నికలు

కర్ణాటకలోని బాగల్‌కోట్, దావణగెరె సౌత్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం గురువారం ఉపఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు హెచ్‌వై మేటి, శామనూరు శివశంకరప్ప మరణంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉపఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.

Advertisement
Advertisement