త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kakinada | కాకినాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 20 మంది స‌జీవ‌ద‌హ‌నం..!

Kakinada | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ జిల్లాలో కార్మికుల బ‌తుకులు బుగ్గిపాల‌య్యాయి. పటాకుల ఫ్యాక్ట‌రీలో చెల‌రేగిన మంట‌ల‌కు 20 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. భారీ పేలుడు ధాటికి కొంద‌రి మృత‌దేహాలు పంట పొలాల్లో ఎగిరిప‌డ్డాయి.

S

National | Published On Feb 28, 2026, 5.16 pm IST

Kakinada | కాకినాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 20 మంది స‌జీవ‌ద‌హ‌నం..!
Advertisement

ప‌టాకుల ఫ్యాక్ట‌రీలో చెల‌రేగిన అగ్నికీల‌లు
పంట పొలాల్లో ఎగిరిప‌డ్డ మృత‌దేహాలు
5 కిలోమీట‌ర్ల మేర భారీ శ‌బ్దాలు..
ప్ర‌యివేటు పాఠ‌శాల శ్లాబ్‌కు ప‌గుళ్లు
ఐదు గ్రామాల‌ను క‌మ్మేసిన పొగ‌
ఆందోళ‌న‌లో స్థానికులు..

Kakinada | త్రినేత్ర‌.న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ జిల్లాలో కార్మికుల బ‌తుకులు బుగ్గిపాల‌య్యాయి. పటాకుల ఫ్యాక్ట‌రీలో చెల‌రేగిన మంట‌ల‌కు 20 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. భారీ పేలుడు ధాటికి కొంద‌రి మృత‌దేహాలు పంట పొలాల్లో ఎగిరిప‌డ్డాయి. కాలియ‌న గాయాల‌తో కొంద‌రు వ‌రి పొలాల్లోకి ప‌రుగెత్తి.. ప్రాణాల‌ను కాపాడుకునేందుకు య‌త్నించారు. మృతుల కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి. మొత్తంగా వేట్ల‌పాలెంలో హృద‌య విదార‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

సామ‌ర్ల‌కోట మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. కొన్ని మృత‌దేహాలు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా కాలి బూడిద‌య్యాయి. మ‌రో 8 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అధికార యంత్రాంగం, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. అగ్నిమాప‌క సిబ్బంది తీవ్రంగా శ్ర‌మించి మంట‌ల‌ను అదుపు చేసింది. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను 108 అంబులెన్స్‌ల్లో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

5 కిలోమీట‌ర్ల మేర భారీ శ‌బ్దాలు

వేట్ల‌పాలెంలో చోటు చేసుకున్న పేలుడు ధాటికి 5 కిలోమీట‌ర్ల మేర శ‌బ్దాలు వినిపించాయి. పేలుడు ధాటికి ఓ గ్రామంలో ఉన్న ప్ర‌యివేటు పాఠ‌శాల శ్లాబ్‌కు ప‌గుళ్లు వ‌చ్చాయి. స్థానిక గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై త‌మ నివాసాల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఐదు గ్రామాల ప‌రిధిలో ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకోవ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పేలుడు ఘటనపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను అధికారులు ఆయనకు వివరించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలికి వెళ్లాలని హోం మంత్రి అనితకు సూచించారు. ఈ మేరకు హోం మంత్రి అనిత వేట్ల‌పాలెం ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

మృతులు వీళ్లే..

మృతుల్లో ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులను అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్‌, గొడతా రాము, గొడతా నానిగా పోలీసులు పేర్కొన్నారు. ఇంకా కొద్ది మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.

Advertisement
Advertisement