త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Noida 15-year-old Girl Case | మోదీపై కామెంట్స్.. క్షమాపణ చెప్పినా ఆగని వేధింపులు: రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసిన తల్లీకూతుళ్లు

జంతర్ మంతర్ వద్ద ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలిక కుటుంబం నోయిడాలోని ఇల్లు ఖాళీ చేసింది. క్షమాపణలు చెప్పినా వేధింపులు ఆగట్లేదని ఆవేదన.

J

National | Published On Aug 4, 2026, 1.00 am IST

Noida 15-year-old Girl Case | మోదీపై కామెంట్స్.. క్షమాపణ చెప్పినా ఆగని వేధింపులు: రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసిన తల్లీకూతుళ్లు
Advertisement
  • ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల పదో తరగతి విద్యార్థిని
  • తప్పును గ్రహించి ఆగస్టు 1న ఒక వీడియో ద్వారా జాతికి క్షమాపణలు చెప్పిన బాలిక
  • అయినా సరే గుర్తుతెలియని వ్యక్తులు, పోలీసుల రాకతో భయాందోళనలకు గురై నోయిడాలోని అద్దె ఇంటిని ఖాళీ చేసిన తల్లీకూతుళ్లు
  • ఈ వివాదంపై నోయిడా పోలీసులు నమోదు చేసిన 'జీరో ఎఫ్‌ఐఆర్' (Zero FIR) లో బాలిక వయసు తప్పుగా నమోదైందన్న తల్లి

Noida 15-year-old Girl Case | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలో ప్రధాని నరేంద్ర మోదీపై (PM Narendra Modi) అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలిక కుటుంబం తీవ్ర భయాందోళనల్లో చిక్కుకుంది. తమను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు, పోలీసులు పదేపదే ప్రశ్నిస్తుండటంతో నోయిడాలోని అద్దె ఇంటిని ఆ తల్లీకూతుళ్లు హుటాహుటిన ఖాళీ చేసి వెళ్లిపోయారు.

"ఒంటరి మహిళను.. మమ్మల్ని బతకనివ్వండి"

ఈ వివాదంపై బాలిక తల్లి మాట్లాడుతూ.. "నా కూతురు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పింది. నా భర్త 2019లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటినుంచి నేను ఒంటరిగానే నా కూతురిని పెంచుకుంటున్నాను. నా చిన్న బాబు అత్తమామల వద్ద ఉంటున్నాడు. నా కూతురు పదో తరగతి చదువుతోంది. నేను పిల్లలకు ట్యూషన్లు (Tuitions) చెప్పుకుని బతుకుతున్నాను. ఇలా ప్రతిరోజూ పోలీసులు, తెలియని వ్యక్తులు ఇంటికి వస్తుంటే అక్కడే ఎలా ఉండగలం?" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో పాటు సాధారణ ప్రజలు కూడా తమను వెంబడించడం ఆపేయాలని ఆమె వేడుకున్నారు.

తప్పు తెలుసుకుని క్షమాపణలు

కొద్ది రోజుల క్రితం జరిగిన నిరసనలో ఆ బాలిక ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆగస్టు 1న విడుదలైన ఒక వీడియోలో ఆ బాలిక బహిరంగంగా క్షమాపణలు (Apology) కోరింది. "అక్కడున్న కొందరు నన్ను రెచ్చగొట్టారు. నేను చేసిన వ్యాఖ్యలకు చాలా సిగ్గుపడుతున్నాను. దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఇది నా తొలి, చివరి తప్పు" అని ఆ వీడియోలో బాలిక కన్నీరు పెట్టుకుంది.

బ్లాక్ కార్లలో వస్తున్న ఆగంతకులు

బాలిక క్షమాపణలు చెప్పినా.. వేధింపులు మాత్రం ఆగలేదని తల్లి వాపోతోంది. "ఇప్పటికీ యూపీ పోలీసులు (UP Police), బ్లాక్ వెహికల్స్‌లో కొందరు వ్యక్తులు మా ఇంటికి వస్తున్నారని పక్కింటివాళ్లు చెబుతున్నారు. భయంతో మేం ఇల్లు మారిపోయాం. మా భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉంది. ప్రధాని సైతం నా కూతురిని క్షమించినప్పుడు ఈ కేసును నోయిడా నుంచి ఢిల్లీకి ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు? రేపు ఢిల్లీ పోలీసులు కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మా పరిస్థితి ఏంటి?" అని ఆ తల్లి ప్రశ్నించారు.

ఎఫ్‌ఐఆర్‌లో వయసు తప్పు.. ఢిల్లీ పోలీసుల రియాక్షన్ ఏంటి?

నోయిడా పోలీసులు నమోదు చేసిన జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) లో బాలిక వయసు తప్పుగా నమోదైందని తల్లి చెబుతోంది. ఆమె 1994లో పుట్టినట్లు ఎఫ్‌ఐఆర్‌లో రాశారని, కానీ వాస్తవానికి తన కూతురు 2011లో పుట్టిందని, ఆమెకింకా 15 ఏళ్లు మాత్రమేనని స్పష్టం చేసింది.

మరోవైపు, ఈ కేసుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ను తాము ఇంకా రెగ్యులర్ ఎఫ్‌ఐఆర్‌గా (Regular FIR) మార్చలేదని క్లారిటీ ఇచ్చారు. బాలిక ఇప్పటికే క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో.. దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నామని, బహుశా కేసును ఇక్కడితో ముగించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై సోషల్ మీడియాలో (Social Media) అసభ్యకర పోస్టులు పెడుతున్న ఇతర వ్యక్తులపై మాత్రం సైబర్ సెల్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ఈ నిరసనలకు సంబంధించి.. అల్లర్లు సృష్టించడం, పోలీసులపై దాడులకు పాల్పడటం వంటి అభియోగాలపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే సుమారు 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే, ఎవరైతే శాంతియుతంగా ఆందోళన చేశారో ఆ విద్యార్థులపై ఎలాంటి కేసులు ఉండవని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేర చరిత్ర ఉండి, ఉద్దేశపూర్వకంగా లా అండ్ ఆర్డర్ (Law and Order) సమస్యలు సృష్టించే వారిపై మాత్రమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement