త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jandhyala Foods | ప‌చ్చ‌ళ్ల వ్యాపారం.. రూ. 500 పెట్టుబ‌డితో రూ. 5 కోట్ల ట‌ర్నోవ‌ర్

Jandhyala Foods | జీవితంలో ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో ర‌కాల మార్గాలు ఉన్నాయి. ప్ర‌భుత్వ లేదా ప్ర‌యివేటు ఉద్యోగం చేస్తేనే ఆర్థికంగా నిల‌దొక్కుకుంటామ‌నేది కేవ‌లం అపోహా మాత్ర‌మే. ఓ ఇద్ద‌రు దంప‌తులు ఉన్న ఉద్యోగాల‌ను వ‌దిలేసుకుని.. ప‌చ్చ‌ళ్ల వ్యాపారం( Pickle Business ) చేప‌ట్టి కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నారు. కేవ‌లం రూ. 500 పెట్టుబ‌డితో త‌మ ప‌చ్చ‌ళ్ల వ్యాపారం( Jandhyala Foods ) ప్రారంభించి.. నేడు రూ. 5.2 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు ఎదిగారు. మ‌రి ఆ దంప‌తులు ఎవ‌రు..? ఎక్క‌డ బిజినెస్ ప్రారంభించారు..? అనే వివ‌రాల‌ను ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

S

Lifestyle | Published On Apr 8, 2026, 6.03 pm IST

Jandhyala Foods | ప‌చ్చ‌ళ్ల వ్యాపారం.. రూ. 500 పెట్టుబ‌డితో రూ. 5 కోట్ల ట‌ర్నోవ‌ర్
Advertisement

Jandhyala Foods | రామ‌కృష్ణ జంధ్యాల‌( Ramakrishna Jandhyala ), జ‌య‌ప్ర‌ద జంధ్యాల‌.. ఈ దంప‌తులిద్ద‌రూ ఉద్యోగ‌స్తులే. రామ‌కృష్ణ ఐడీపీఎల్‌(హైద‌రాబాద్‌)లో ఉద్యోగి కాగా, జ‌య‌ప్ర‌ద హిందీ పండిట్. అయితే 2003లోనే రామ‌కృష్ణ తన ఉద్యోగాన్ని వ‌దిలేశాడు. అప్ప‌టికే హైద‌రాబాద్ న‌గ‌రంలో స్థిర‌ప‌డ్డ ఈ దంప‌తులు.. కొత్త‌గా ఫుడ్ బిజినెస్( Food Business ) ప్రారంభించాల‌నుకున్నారు. అనుకున్న‌దే ఆల‌స్యం.. రూ. 500తో ప‌చ్చ‌ళ్ల వ్యాపారం( Pickle Business ) ప్రారంభించి అంచెలంచెలుగా ఆర్థిక వృద్ధి సాధించారు.. ప‌ది మందికి జీవ‌నోపాధి క‌ల్పిస్తున్నారు.

ఈ దంప‌తుల‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌( Andhra Pradesh )లోని గుడివాడ‌. సాంప్ర‌దాయ తెలుగు బ్రాహ్మ‌ణ కుటుంబం కూడా. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కుటుంబం. జ‌య‌ప్ర‌ద త‌ల్లి తెలుగు వంట‌కాల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చేవారు. మ‌రి ముఖ్యంగా ప‌చ్చ‌ళ్ల‌ను అద్భుతంగా త‌యారు చేసేవారు. ఆ విధంగా త‌ల్లి నుంచి ప‌చ్చ‌ళ్ల త‌యారీ నేర్చుకున్న జ‌య‌ప్ర‌ద‌.. ఇవాళ కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నారు.

మూడు పువ్వులు ఆరు కాయలుగా ప‌చ్చ‌ళ్ల వ్యాపారం 

రూ. 500 పెట్టుబ‌డితో.. ప‌చ్చ‌ళ్ల వ్యాపారం ప్రారంభించారు. మామిడి ఆవ‌కాయ ప‌చ్చ‌డిని త‌యారు చేసి.. స్కూట‌ర్‌పై తిరుగుతూ అమ్మ‌కాల‌ను ప్రారంభించాడు రామ‌కృష్ణ‌. ఇక వీరు ఎలాంటి ప్ర‌మోష‌న్ చేయ‌లేదు. కేవ‌లం నోటి మాట ద్వారానే వీరి ఆవ‌కాయ ప‌చ్చ‌డికి డిమాండ్ పెరిగింది. అలా వారి ప‌చ్చ‌ళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వ‌ర్ధిల్లింది. దీంతో స్వ‌త‌హాగా.. జంధ్యాల ఇండియా ఫుడ్స్ ఎల్ఎల్‌పీ అనే సంస్థ‌ను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారచేస్తూ ప‌ది దేశాల‌కు పైగా ఎగుమ‌తి చేస్తున్నారు.

ఆహార ప్రియుల నోరూరించేలా ప‌చ్చ‌ళ్లు

ఏపీలో బాగా ప్రాచుర్యం పొందిన మామిడి ఆవ‌కాయ ప‌చ్చ‌డితో త‌మ వ్యాపార ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆవ‌కాయ ప‌చ్చ‌డితో పాటు గోంగూర‌, ట‌మాటా, అల్లం, వెల్లుల్లి, ఎండు మిర‌ప‌, ప‌చ్చి చింత‌కాయ‌, ఉసిరి, నిమ్మ వంటి ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసి ఆహార ప్రియుల‌ను ఆక‌ర్షిస్తున్నారు. వీరి ప‌చ్చ‌ళ్లు నోరూరించేలా ఉంటాయ‌ని చెబుతున్నారు. ఈ ప‌చ్చ‌ళ్ల త‌యారీతో పాటు మ‌సాలా పౌడ‌ర్‌ను కూడా విక్ర‌యిస్తున్నారు.

నెల‌కు 50 ట‌న్నులు.. 10 దేశాల‌కు ఎగుమ‌తి

రోజురోజుకూ వీరి ప‌చ్చ‌ళ్ల‌కు డిమాండ్ పెరిగింది. దీంతో త‌మ వ్యాపారాన్ని విస్త‌రించారు. వ‌చ్చిన లాభాల‌ను మ‌ళ్లీ పెట్టుబ‌డిగా పెట్టారు. చివ‌ర‌కు హైద‌రాబాద్‌లో జంధ్యాల ఇండియా ఫుడ్స్ ఎల్ఎల్‌పీ కంపెనీని తెరిచారు. చ‌ర్ల‌ప‌ల్లిలో 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. నెల‌కు 50 ట‌న్నుల ప‌చ్చ‌ళ్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నారు. 40 మంది మ‌హిళల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నారు. జంధ్యాల ప‌చ్చ‌ళ్ల‌కు 20 వేల మందికి పైగా వినియోగ‌దారులు ఉన్నారు. 10 దేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నారు.

ఈ ఏడాది రూ. 5.2 కోట్ల ట‌ర్నోవ‌ర్‌

ఈ కంపెనీ 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 4 కోట్ల ఆదాయాన్ని న‌మోదు చేసింది. ఈ ఏడాది రూ. 5.2 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు చేరుకుంది. అంటే రెండు ద‌శాబ్దాల త‌ర్వాత రూ. 5.2 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు చేర‌డంతో జంధ్యాల దంప‌తులు సంతోషం వ్య‌క్తం చేశారు.

నూజివీడు మామిడి.. గుంటూరు కారం..

ఈ సంద‌ర్భంగా జ‌య‌ప్ర‌ద జంధ్యాల మాట్లాడుతూ.. కొన్ని వంట‌కాల‌ను అమ్మ నుంచి, మ‌రికొన్ని వంట‌కాల‌ను మా అత్త గారి నుంచి నేర్చుకున్నాను. కొన్ని ప‌చ్చ‌ళ్ల‌ను సొంతంగానే త‌యారు చేశాను. తెలుగు వారి స్టైల్‌లోనే ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ, ఆ రుచిని ఎక్క‌డా కోల్పోకుండా ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తున్నాను. ప‌చ్చ‌ళ్ల నిల్వ కోసం ఎలాంటి ర‌సాయ‌న పదార్థాల‌ను వినియోగించ‌డం లేదు. ర‌సాయ‌నాల‌కు బ‌దులుగా ఉప్పు, నూనె, మ‌సాలాలు ఉప‌యోగిస్తున్నాం. ఇక మామిడి కాయల విష‌యంలో రాజీప‌డ‌డం లేదు. ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉన్న నూజీవిడు పురపాల‌క సంఘం నుంచి మామిడి కాయ‌ల‌ను, గుంటూరు రేప‌ల్లె నుంచి మిర‌ప‌కాయ‌ల‌ను సేక‌రిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. 2029 నాటికి 15 ఔట్‌లెట్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చి క‌నీసం 3 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారుల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌ణాళిక‌లు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement