Malaria | ఇక దోమకాటుతో మలేరియాకు అడ్డుకట్ట.. సైంటిస్టుల వినూత్న ప్రయోగం..
Malaria | దోమలు మలేరియా, డెంగీ, చికున్గున్యా వంటి అనేక వ్యాధులకు కారణమవుతాయి. అయితే తాజాగా వెలువడిన పరిశోధన ఒక ఆసక్తికరమైన అవకాశాన్ని తెరపైకి తెచ్చింది. భవిష్యత్తులో మలేరియాను వ్యాప్తి చేసే దోమ కాటు మలేరియా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ బూస్టర్గా పనిచేస్తుందా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
Malaria | దోమలు మలేరియా, డెంగీ, చికున్గున్యా వంటి అనేక వ్యాధులకు కారణమవుతాయి. అయితే తాజాగా వెలువడిన పరిశోధన ఒక ఆసక్తికరమైన అవకాశాన్ని తెరపైకి తెచ్చింది. భవిష్యత్తులో మలేరియాను వ్యాప్తి చేసే దోమ కాటు మలేరియా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ బూస్టర్గా పనిచేస్తుందా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాత్మక టీకా విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో మలేరియా పరాన్నజీవులను మోసుకొచ్చే దోమ కాటును సహజ వ్యాక్సిన్ బూస్టర్లా ఉపయోగించే విధానాన్ని పరిశీలించారు. సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో ఎలుకలకు ఈ విధానం ద్వారా మలేరియా నుంచి ఎక్కువ కాలం రక్షణ లభించినట్లు వెల్లడైంది.
పరాన్న జీవి అభివృద్ధి దశకు ముందే అడ్డుకుని..
అయితే దీనర్థం ప్రజలు ఉద్దేశపూర్వకంగా మలేరియా సోకిన దోమల చేత కుట్టించుకోవాలని కాదు. పరిశోధకులు ప్రత్యేకంగా యాంటీ మలేరియా ఔషధాన్ని ఉపయోగించి కాలేయంలో పరాన్నజీవి అభివృద్ధి చెందే ఒక నిర్దిష్ట దశను అడ్డుకున్నారు. దీంతో పరాన్నజీవి వ్యాధికి కారణమయ్యే దశకు చేరుకోకుండా, రోగనిరోధక వ్యవస్థకు దానిని మరింత విస్తృతంగా గుర్తించే అవకాశం లభించింది. ఆ తర్వాత జరిగే దోమ కాట్లు రోగనిరోధక ప్రతిస్పందనను మరింత బలోపేతం చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం ఈ పరిశోధన జంతువులపై నిర్వహించిన ప్రీ-క్లినికల్ దశలోనే ఉంది. అయినప్పటికీ మలేరియాపై ఎక్కువకాలం రక్షణ అందించే కొత్త మార్గాలను అభివృద్ధి చేయడానికి ఈ ఫలితాలు ఉపయోగపడే అవకాశం ఉంది. కొత్త పరిశోధన మలేరియా పరాన్నజీవి జీవచక్రంలోని ఒక ప్రత్యేక దశపై దృష్టి సారించింది. మలేరియా సోకిన దోమ మనిషిని కుట్టినప్పుడు పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. సాధారణంగా అవి కాలేయానికి చేరుకుని అక్కడ సంఖ్యను పెంచుకుంటాయి. అనంతరం రక్తప్రవాహంలోకి ప్రవేశించి మలేరియాకు కారణమవుతాయి.
ఔషధాలతో కలిపి పరాన్నజీవుల ప్రయోగం..
పరిశోధకులు దోమల ద్వారా శరీరంలోకి చేరే తక్కువ మోతాదు మలేరియా పరాన్నజీవులను ప్రయోగాత్మక యాంటీ మలేరియా ఔషధాలతో కలిపి ఉపయోగించారు. ఈ అధ్యయనంలో డబ్ల్యూఎం382, ఎంకే-7602 అనే ఔషధాలను ఉపయోగించారు. ఇవి ప్లాస్మెప్సిన్ ఐఎక్స్, ప్లాస్మెప్సిన్ ఎక్స్ అనే రెండు ప్రోటీన్లను అడ్డుకునేలా పనిచేస్తాయి. మలేరియా పరాన్నజీవి మనుగడ, అభివృద్ధికి ఈ ప్రోటీన్లు కీలకమైనవి. ఈ ఔషధాలు కాలేయంలో పరాన్నజీవి అభివృద్ధి చివరి దశకు చేరుకునే సమయంలో దాని ఎదుగుదలను అడ్డుకున్నాయి. దీని వల్ల పరాన్నజీవి రక్తప్రవాహంలోకి చేరి మలేరియాకు కారణం కాలేదు. అదే సమయంలో రోగనిరోధక వ్యవస్థకు పరాన్నజీవిని మరింత పూర్తిగా గుర్తించే అవకాశం లభించింది. సులభంగా చెప్పాలంటే.. పరాన్నజీవి వ్యాధిని కలిగించే స్థాయికి వెళ్లకుండా నియంత్రిస్తూ, రోగనిరోధక వ్యవస్థకు దానిని ముందుగానే గుర్తించి నేర్చుకునే అవకాశం కల్పించారు.

దోమ కాటునే టీకా మార్చి..
డబ్ల్యూఈహెచ్ఐ అసోసియేట్ ప్రొఫెసర్ జస్టిన్ బాడే మాట్లాడుతూ.. కొత్త ఔషధ సమ్మేళనం ద్వారా మలేరియాను వ్యాప్తి చేసే దోమ కాటునే ఎలుకల్లో టీకా ప్రక్రియగా మార్చే మార్గాన్ని కనుగొన్నామని తెలిపారు. మలేరియాను నివారించడంలో ఔషధాలను ఉపయోగించే విధానంలో ఇది కొత్త మార్పును సూచిస్తుందని చెప్పారు. పరాన్నజీవి వ్యాధిని కలిగించే ముందు దశలోనే దాని అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థకు ముప్పును ముందుగానే గుర్తించే అవకాశం లభించిందని ఆయన వివరించారు. చాలా తక్కువ మోతాదులో పరాన్నజీవులను ఉపయోగించినప్పటికీ, ప్రస్తుత అనేక టీకా విధానాలతో పోలిస్తే మరింత విస్తృతమైన, ఎక్కువకాలం కొనసాగే రోగనిరోధక ప్రతిస్పందన ఏర్పడిందని తెలిపారు.
భవిష్యత్తులో మళ్లీ దోమ కుడితే..
ఈ విధానంలో పరాన్నజీవులు కొంతకాలం పెరగడానికి అవకాశం లభించిన తర్వాత రోగనిరోధక వ్యవస్థలో యాంటీబాడీలు, సీడీ8 ప్లస్ టీ కణాలు రెండూ చురుకుగా మారాయని పరిశోధకులు తెలిపారు. ఇవి తిరిగి పరాన్నజీవి సోకినప్పుడు రక్షణ కల్పించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా కాలేయంలోనే ఉండిపోయే మెమరీ టీ కణాలు ఏర్పడటం కీలకమైన అంశంగా పరిశోధకులు గుర్తించారు. భవిష్యత్తులో మళ్లీ మలేరియా పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ కణాలు వేగంగా స్పందించి, వ్యాధి అభివృద్ధి చెందకముందే పరాన్నజీవిని తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు.

కాలేయంలోనే ముఖ్యమైన దశ..
మలేరియా పరాన్నజీవి తన జీవచక్రంలో ఒక ముఖ్యమైన దశను కాలేయంలో గడుపుతుంది. ఆ తర్వాతే అది రక్తప్రవాహంలోకి వెళ్తుంది. వ్యాధి రక్తంలోకి ప్రవేశించే ముందు పరాన్నజీవిని అడ్డుకోవచ్చనే కారణంతో శాస్త్రవేత్తలు చాలాకాలంగా కాలేయ దశపై ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త విధానం ఈ మధ్యంతర దశను ఉపయోగించుకున్నట్లు కనిపిస్తోంది. పరాన్నజీవి కాలేయంలో మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఇచ్చి, వ్యాధిని కలిగించే దశకు చేరుకునే ముందు దానిని ఔషధంతో అడ్డుకోవడం ద్వారా బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించగలిగారు.
ఉద్దేశ్వపూర్వకంగా కుట్టించుకోవద్దు..
ప్రారంభ టీకా ప్రక్రియ తర్వాత జరిగిన పరిణామం ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి. మలేరియా పరాన్నజీవులను కలిగి ఉన్న తదుపరి దోమ కాట్లు ఇప్పటికే ఏర్పడిన రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేయగలిగాయి. పరిశోధకులు దీనిని సాధ్యమైన వ్యాక్సిన్ ఇచ్చి, సహజంగానే బూస్టర్ ఇవ్వడం అనే విధానంగా అభివర్ణించారు. మలేరియా ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రాంతాల్లో, పరాన్నజీవుల అభివృద్ధిని ఔషధంతో నియంత్రించగలిగితే, సోకిన దోమల నుంచి వచ్చే పునరావృత కాట్లు అదనపు రోగనిరోధక ఉద్దీపనగా పనిచేసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం ఎలుకలపై మాత్రమే పరీక్షించిన ప్రయోగాత్మక విధానం. మనుషుల్లో దీని భద్రత, ప్రభావం, దీర్ఘకాలిక ప్రయోజనాలు నిర్ధారించాల్సి ఉంది. కాబట్టి మలేరియా సోకిన దోమలతో ఉద్దేశపూర్వకంగా కుట్టించుకోవడం ఏమాత్రం సురక్షితం కాదు.
తాజావార్తలు
- ●Jannaram | ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
- ●Supreme Court | యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ●Revanth Reddy | తరుణ్ గొగోయ్.. కేజ్రీవాల్.. అర్జున్ ముండా.. రేవంత్ రెడ్డి
- ●Ramchandar Rao | అమెరికా టూర్కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచందర్రావు ఏమన్నారంటే..
- ●Trisha | పొలిటికల్ లీడర్గా త్రిష - రియల్ లైఫ్లో కాదు రీల్ లైఫ్లో...
- ●Balu Naik | క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే : కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్

Jannaram | ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Supreme Court | యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Revanth Reddy | తరుణ్ గొగోయ్.. కేజ్రీవాల్.. అర్జున్ ముండా.. రేవంత్ రెడ్డి

Ramchandar Rao | అమెరికా టూర్కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచందర్రావు ఏమన్నారంటే..



