త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meningitis | యూకేలో ప్ర‌బ‌లిన మెనింజైటిస్.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యుల హెచ్చరిక‌..

Meningitis | యూకేలోని కెంట్ కౌంటీకి చెందిన కాంటర్‌బరీ నగరంలో మెనింజైటిస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇద్దరు మరణించగా, మరో 11 మంది హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) విడుదల చేసిన ప్రకటన ప్రకారం కాంటర్‌బరీలోని విద్యార్థులకు ఎక్కువ‌గా ఈ వ్యాధి వ్యాపిస్తుంద‌ని తేల్చారు.

S

Lifestyle | Published On Mar 18, 2026, 1.10 pm IST

Meningitis | యూకేలో ప్ర‌బ‌లిన మెనింజైటిస్.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యుల హెచ్చరిక‌..
Advertisement

Meningitis | యూకేలోని కెంట్ కౌంటీకి చెందిన కాంటర్‌బరీ నగరంలో మెనింజైటిస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇద్దరు మరణించగా, మరో 11 మంది హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) విడుదల చేసిన ప్రకటన ప్రకారం కాంటర్‌బరీలోని విద్యార్థులకు ఎక్కువ‌గా ఈ వ్యాధి వ్యాపిస్తుంద‌ని తేల్చారు. బీబీసీ నివేదిక ప్రకారం న‌గ‌రంలోని ఓ నైట్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం అనంత‌రం ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్న‌ట్లు గుర్తించారు. మార్చి 5, 6, 7 తేదీల్లో క్లబ్‌ను సంద‌ర్శించిన వారు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా యాంటీ బ‌యోటిక్స్‌తో చికిత్స పొందాల‌ని UKHSA సూచ‌న‌లు చేసింది. బాధితుల్లో చాలా మంది 18 నుంచి 21 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన వారేన‌ని, వారిలో చాలా మంది విద్యార్థులేన‌ని వెల్లడించింది. మృతి చెందిన ఇద్ద‌రిలో ఒక‌రు యూనివ‌ర్సిటీ ఆఫ్ కెంట్ విద్యార్థి అని వ‌ర్సిటీ అధికారులు తెలిపారు.

యూనివ‌ర్సిటీ ఆఫ్ కెంట్ ప్ర‌క‌ట‌న‌..

త‌మ విద్యార్థులు, సిబ్బంది భ‌ద్ర‌తకు అత్యంత ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నామ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ కెంట్ ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌జారోగ్య బృందాల‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్నామ‌ని, అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, స‌హాయం అందించేందుకు తాము విద్యార్థులు, సిబ్బందితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపింది. కాగా మెనింజైటిస్ వ్యాప్తి నేప‌థ్యంలో UKHSA ఇప్ప‌టికే 30వేల మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించింది. అవ‌స‌రమైన విద్యార్థుల‌కు యాంటీ బ‌యోటిక్స్ ఇస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

చాలా వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి..

ఈ సంద‌ర్భంగా వైద్య నిపుణులు స్పందిస్తూ మెనింజైటిస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి అని తెలిపారు. విద్యార్థులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. జ్వ‌రం, త‌ల‌నొప్పి, వేగంగా శ్వాస తీసుకోవ‌డం, నిద్ర మ‌త్తుగా ఉండ‌డం, వ‌ణుకు, వాంతులు అవ‌డం, చేతులు, కాళ్లు చ‌ల్ల‌గా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని తెలిపారు. కొంద‌రిలో చ‌ర్మంపై దద్దుర్లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని, మెనింజైటిస్ ప్రారంభ ద‌శ‌లో జ‌లుబు, ఫ్లూ లేదా హ్యాంగోవ‌ర్ ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని తెలిపారు. మెనింజైటిస్ అనేది మెద‌డు, వెన్నెముక చుట్టూ ఉన్న క‌ణ‌జాలం వాపుల‌కు గుర‌య్యే వ్యాధి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిన ప్ర‌కారం ఇది బ్యాక్టీరియా, వైర‌స్‌, ఫంగ‌స్ లేదా ఇత‌ర పరాన్న జీవుల వ‌ల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది అంటువ్యాధిగా కూడా మారే అవ‌కాశం ఉంటుంది. ఎక్కువ‌గా ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్లే ఈ వ్యాధి వ‌స్తుంది. బ్యాక్టీరియా ద్వారా సోకే మెనింజైటిస్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైంది. ఇది కొన్ని సార్లు ప్రాణాంత‌కం అయ్యే అవ‌కాశాలు కూడా ఉంటాయి. ప్రారంభ ద‌శ‌లో చికిత్స ల‌భించ‌క‌పోతే రోగి ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంది.

ల‌క్ష‌ణాలు ఇవే..

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ తెలిపిన ప్ర‌కారం మెనింజైటిస్ వ్యాధి ల‌క్ష‌ణాలు అంద‌రిలో ఒకేలా ఉండ‌వు. కానీ కొన్ని ల‌క్ష‌ణాలు అంద‌రిలోనూ కామ‌న్‌గా క‌నిపిస్తాయి. వెలుతురు చూడ‌లేక‌పోవ‌డం, డ‌యేరియా, జ్వ‌రం, త‌ల‌నొప్పి, వాంతులు, వికారం, చ‌ర్మంపై న‌ల్ల‌ని ద‌ద్దుర్లు, మెడ గ‌ట్టిగా మార‌డం, గంద‌ర‌గోళంగా ఉండ‌డం, నిద్ర మ‌త్తు అధికంగా ఉండ‌డం, న‌డ‌వ‌డంలో లేదా నిల‌బ‌డ‌డంలో ఇబ్బందిగా అనిపించ‌డం, మూలుగులు చేయ‌డం, కీళ్లు, కండ‌రాల నొప్పులు, ఆహారంపై ఆస‌క్తి త‌గ్గ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. మెనింజైటిస్ కు ఆరంభంలోనే చికిత్స అందించాలి. లేదంటే కిడ్నీలు, మెదడు, ఇత‌ర అవ‌యవాలు డ్యామేజ్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. ఇక మెనింజైటిస్ కు 11-12 ఏళ్ల వ‌య‌స్సులోనే టీకాల‌ను ఇస్తారు. 16 ఏళ్ల వ‌య‌స్స‌ప్పుడు బూస్ట‌ర్ డోసు ఇస్తారు. ఈ టీకాలు తీసుకోని వారు వ్యాధి ల‌క్ష‌ణాల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. దీంతో ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుని ప్రాణాల‌ను ర‌క్షించుకునేందుకు వీలు క‌లుగుతుంది.

ఈ జాగ్ర‌త్త‌లు పాటించాలి..

మెనింజైటిస్ ఉన్న‌వారు డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు చికిత్స తీసుకోవ‌డంతోపాటు ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను కూడా పాటించాల్సి ఉంటుంది. చేతుల‌ను త‌ర‌చూ శుభ్రం చేసుకోవ‌డం, టాయిలెట్ ఉప‌యోగించిన త‌రువాత క‌చ్చితంగా కాళ్లు, చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవ‌డం, క‌ళ్ల‌ను, ముక్కును, నోరును చేతుల‌తో తాక‌కుండా ఉండ‌డం, ఇత‌రులు ఉప‌యోగించే ఆహారం, పాత్ర‌లు, లిప్‌స్టిక్‌లు లేదా ఇత‌ర వ‌స్తువుల‌ను తాక‌క‌పోవ‌డం, ద‌గ్గు లేదా తుమ్ము వ‌చ్చిన‌ప్పుడు ముక్కు, నోరుకు అడ్డుగా శుభ్ర‌మైన వ‌స్త్రం లేదా మాస్క్ పెట్టుకోవ‌డం వంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేదంటే ఇంట్లో ఉండే ఇత‌రుల‌కు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. మెనింజైటిస్ వ‌చ్చిన వారితో స‌న్నిహితంగా ఉన్న‌వారు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ముందుగా యాంటీ బ‌యోటిక్స్‌తో మొద‌టి 24 గంట‌ల్లో చికిత్స ప్రారంభించాలి. దీని వ‌ల్ల వ్యాధి తీవ్ర‌త అధికం కాకుండా ఉంటుంది. మెనింజైటిస్ ఉన్న‌వారు ఇంట్లో విడిగా రూమ్‌లో ఉండాలి. బ‌య‌ట తిర‌గ‌కూడ‌దు. త‌గిన విశ్రాంతి అవ‌సరం. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి వ్యాధి ప్రాణాంత‌కం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కనుక మెనింజైటిస్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement