త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green Rice | గ్రీన్ రైస్ అనే బియ్యం ర‌కంలో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు.. గుర్తించిన శాస్త్ర‌వేత్త‌లు..

Green Rice | ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల ప్ర‌జ‌ల‌కు బియ్యం ప్ర‌ధాన ఆహారంగా ఉంది. బియ్యాన్ని మ‌న దేశంతోపాటు ఆసియా దేశాల వాసులు ఎక్కువగా తింటారు. అయితే బియ్యంలో పిండి ప‌దార్థాలు అధికంగా ఉంటాయి క‌నుక డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు, అధికంగా బ‌రువు ఉన్న‌వారు అన్నాన్ని ఎక్కువగా తిన‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతుంటారు.

S

Lifestyle | Published On Apr 8, 2026, 3.30 pm IST

Green Rice | గ్రీన్ రైస్ అనే బియ్యం ర‌కంలో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు.. గుర్తించిన శాస్త్ర‌వేత్త‌లు..
Advertisement

Green Rice | ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల ప్ర‌జ‌ల‌కు బియ్యం ప్ర‌ధాన ఆహారంగా ఉంది. బియ్యాన్ని మ‌న దేశంతోపాటు ఆసియా దేశాల వాసులు ఎక్కువగా తింటారు. అయితే బియ్యంలో పిండి ప‌దార్థాలు అధికంగా ఉంటాయి క‌నుక డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు, అధికంగా బ‌రువు ఉన్న‌వారు అన్నాన్ని ఎక్కువగా తిన‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతుంటారు. బ‌దులుగా బ్రౌన్ రైస్ వంటివి తినాల‌ని సూచిస్తుంటారు. అయితే ఇదే కాకుండా జ‌పాన్ శాస్త్ర వేత్త‌లు మ‌రో ఆరోగ్య‌క‌ర‌మైన బియ్యాన్ని గుర్తించారు. గ్రీన్‌, బ్లాక్ జ‌పోనికా అనే రెండు ర‌కాల బియ్యంలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు ప‌దార్థాలు స‌మృద్ధిగా ఉన్నాయ‌ని తేల్చారు. బియ్యం చాలా మందికి ప్ర‌ధాన ఆహారంగా ఉన్న‌ప్ప‌టికీ డ‌యాబెటిస్ ఉన్న‌వారు, బ‌రువు అధికంగా ఉన్న‌వారు అన్నాన్ని తిన‌లేక‌పోతుంటారు. అయితే అలాంటి వారికి పైన తెలిపిన ఆ రెండు రకాల బియ్యం ఎంతో మేలు చేస్తుంద‌ని శాస్త్ర వేత్త‌లు చెబుతున్నారు.

గ్రీన్‌, జ‌పోనికా ర‌కాల్లో పోష‌కాలు అధికం..

ప్ర‌పంచ జ‌నాభాలో దాదాపు స‌గానికి పైగా మంది బియ్యంపై ఆధార‌ప‌డ్డారు. అయితే అందులో పోష‌కాలు మాత్రం స‌రిగ్గా ఉండడం లేదు. కేవ‌లం పిండి ప‌దార్థాలే అధికంగా ఉండ‌డంతో అది జీవ‌న‌శైలి వ్యాధుల‌కు దారి తీస్తోంది. టైప్ 2 డ‌యాబెటిస్ రావ‌డంతోపాటు చాలా మంది అధికంగా బ‌రువు పెరుగుతున్నారు. అయితే తాజాగా ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన బియ్యం ర‌కాల్లో అనేక పోష‌కాలు ఉంటాయ‌ని గుర్తించారు. హొక్కైడో యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు స‌ద‌రు బియ్యం రకాల‌పై అధ్య‌య‌నాలు నిర్వ‌హించ‌గా వాటిల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వుల‌తోపాటు ప‌లు ఇత‌ర పోష‌కాలు కూడా స‌మృద్ధిగా ఉన్నాయ‌ని గుర్తించారు. జ‌పాన్‌లో ఆయా బియ్యం ర‌కాల‌తోపాటు బ్రౌన్‌, రెడ్‌, బ్లాక్ వంటి 56 ర‌కాల బియ్యాన్ని కూడా ఉప‌యోగిస్తారు. అయితే గ్రీన్‌, జ‌పోనికా ర‌కాలకు చెందిన బియ్యంలో పోష‌కాలు అధికంగా ఉన్నాయ‌ని తేల్చారు.

ప్ర‌త్యేక‌మైన లిపిడ్ నిర్మాణం..

గ్రీన్‌, బ్లాక్ జ‌పోనికా ర‌కాల‌కు చెందిన బియ్యంలో ప్ర‌త్యేక‌మైన లిపిడ్ నిర్మాణం ఉంద‌ని సైంటిస్టులు తెలిపారు. ఇందులో FAHMFAs (ఫ్యాటీ యాసిడ్ ఎస్టర్స్ ఆఫ్ హైడ్రాక్సీ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్), LNAPEs (N-acyl-lysophosphatidylethanolamines) వంటి సమ్మేళనాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. అంటే ఈ బియ్యాన్ని తింటే శ‌రీరంలో బాహ్యంగా, అంత‌ర్గ‌తంగా ఉండే వాపులు త‌గ్గిపోతాయ‌న్న‌మాట‌. అలాగే ఈ బియ్యాన్ని తింటే మెట‌బాలిక్ ఆరోగ్యం సైతం మెరుగు ప‌డుతుంది. ముఖ్యంగా FAHMFAs స‌మ్మేళ‌నాలు వాపుల‌ను త‌గ్గించ‌డంలో చురుగ్గా ప‌నిచేస్తాయ‌ని గుర్తించారు. అలాగే క‌ణాల మ‌ధ్య స‌మాచార మార్పిడిని ఇవి మెరుగు ప‌రుస్తాయ‌ని తెలిపారు. వీటిని ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులుగా సైంటిస్టులు చెబుతున్నారు.

షుగ‌ర్ లెవ‌ల్స్ గ‌ణ‌నీయంగా నియంత్ర‌ణ‌..

ఈ ప‌రిశోధ‌న‌ల్లో పాల్గొన్న ప్రొఫెస‌ర్ సిద్ధ‌బ‌స‌వే గౌడ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ లిపిడ్లు బియ్యంలో త‌క్కువ శాతంలో ఉన్న‌ప్ప‌టికీ పోష‌క విలువ‌ల్లో కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని తెలిపారు. క‌ణ గోడ‌ల‌ను ర‌క్షించ‌డం, శ‌క్తిని నిల్వ చేయ‌డం, శ‌రీర సంకేత ప్ర‌క్రియ‌ల‌కు స‌పోర్ట్ ఇవ్వ‌డం వంటి ప‌నులు చేస్తాయ‌ని పేర్కొన్నారు. కాగా ఈ బియ్యం ర‌కాల‌పై షుగ‌ర్ లెవ‌ల్స్ ప‌రంగా ప‌లు టెస్టులు కూడా చేశారు. ఈ బియ్యంతో వండిన అన్నాన్ని తిన్న త‌రువాత అది గ్లూకోజ్ మార‌డం చాలా నెమ్మ‌దిగా జ‌రుగుతుంద‌ని, రక్తంలో చ‌క్కెర స్థాయిలు చాలా ఆల‌స్యంగా పెరుగుతున్నాయ‌ని గుర్తించారు. అందువ‌ల్ల ఈ బియ్యం ర‌కాలు షుగర్ లెవ‌ల్స్‌ను కూడా అదుపులో ఉంచుతాయ‌ని తేల్చారు. డ‌యాబెటిస్‌కు ప్ర‌పంచ రాజ‌ధానిగా మారిన భార‌త్‌లో ఎంతో మంది డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఈ బియ్యం ఉప‌యోగంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

స‌రైన ర‌కాన్ని ఎంచుకోవాలి..

భార‌త్‌లోనూ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచే ప‌లు బియ్యం ర‌కాల‌ను సైంటిస్టులు అభివృద్ధి చేశారు. కానీ వాటికి ఎక్కువ గుర్తింపు రాలేదు. క‌వుని అనే బ్లాక్ రైస్‌కు మ‌న దేశంలో సుమారుగా 2000 ఏళ్ల చ‌రిత్ర ఉంది. ఈ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ డ‌యాబెటిక్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు చెబుతుంటారు. త‌మిళ‌నాడులో పండుగ‌ల నుంచి ఔష‌ధాల వ‌ర‌కు దీనిని ఉప‌యోగించే సంప్ర‌దాయం ఉంది. ఆయుర్వేదంలో ఈ రైస్‌ను ర‌క్త‌శాలిగా పిలుస్తారు. అంటే దీన్ని తింటే ర‌క్తాన్ని పెంచుతుంద‌న్న‌మాట‌. అలాగే శ‌రీరంలోని వాత‌, పిత్త‌, క‌ఫ అనే మూడు దోషాల‌ను స‌మ‌తుల్యం చేయ‌డంలోనూ ఈ రైస్ స‌హాయం చేస్తుంది. కేర‌ళ‌లో ఇప్ప‌టికీ మ‌ట్ట రైస్‌ను కొంద‌రు ప్ర‌ధాన ఆహారంగా తీసుకుంటుంటారు. అయితే ఈ రైస్ ర‌కంపై శాస్త్రీయంగా పెద్ద‌గా ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గ‌లేదు. కానీ చాలా వ‌ర‌కు బియ్యం ర‌కాలు గ్లూకోజ్ నియంత్ర‌ణ‌కు స‌హాయ ప‌డ‌తాయ‌ని, స‌రైన బియ్యం ర‌కాన్ని ఎంచుకుని తినాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఇక గ్రీన్ రైస్‌, బ్లాక్ జ‌పోనికా రైస్‌ల గురించి ఆయా విష‌యాలు తెలిసినా ఇవి ప్ర‌జంల‌ద‌రకీ అందుబాటులో లేవ‌ని, వీటిపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం ఉంద‌ని సైంటిస్టులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement
Advertisement