త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Metabolic Health | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఈ 5 ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి.. డాక్ట‌ర్ సూచ‌న‌..

Metabolic Health | దేశంలో ఇటీవల టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, హైపర్‌టెన్షన్, పీసీఓఎస్ (PCOS) వంటి మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధుల చికిత్సలో లక్షణాలను నియంత్రించడం ఒక అంశం మాత్రమే అయినప్పటికీ, దీర్ఘకాలికంగా వ్యాధులను నివారించడంలో ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి.

S

Health | Published On Mar 7, 2026, 3.42 pm IST

Metabolic Health | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఈ 5 ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి.. డాక్ట‌ర్ సూచ‌న‌..
Advertisement

Metabolic Health | దేశంలో ఇటీవల టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, హైపర్‌టెన్షన్, పీసీఓఎస్ (PCOS) వంటి మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధుల చికిత్సలో లక్షణాలను నియంత్రించడం ఒక అంశం మాత్రమే అయినప్పటికీ, దీర్ఘకాలికంగా వ్యాధులను నివారించడంలో ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి చెందిన న్యూరాలజిస్టు డాక్టర్ సుధీర్ కుమార్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన తాజా పోస్టులో మెటబాలిక్ వ్యాధులకు ఒక ప్రధాన కారణాన్ని తెలిపారు. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాల‌ను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆయన తెలిపారు. మెటబాలిక్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే 5 ర‌కాల‌ ఆహార పదార్థాలను తిన‌డం వెంటనే తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి.. అని ఆయన పేర్కొన్నారు.

https://twitter.com/hyderabaddoctor/status/2029164247935242411

చ‌క్కెర ప‌దార్థాలు, బిస్కెట్లు..

మొదటిగా ఆయన సూచించినది ద్రవ రూపంలో ఉండే చక్కెర పదార్థాలు, అంటే సోడాలు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు. సోడాలు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లలో అదనంగా చక్కెరలు ఉంటాయ‌న్న విష‌యం తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా హానికరం. ఫ్ర‌క్టోజ్ ను అధికంగా తీసుకోవడం లివ‌ర్‌పై ఒత్తిడిని పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. ఫైబర్ లేకుండా తీసుకునే జ్యూస్ అనేది అసలు చక్కెర కలిగిన నీళ్లే.. అని ఆయన హెచ్చరించారు. ప్యాకేజ్డ్ పానీయాల స్థానంలో మజ్జిగ లేదా సాధారణ నీరు తీసుకోవాలని సూచించారు. రెండవది చాయ్ సమయంలో తినే బిస్కెట్లు. చాలా మంది టీ తాగేటప్పుడు చక్కెర వేయకపోయినా, దానికి తోడుగా తినే బిస్కెట్లు ఆరోగ్యానికి మరింత హానికరమని గుర్తించడం లేదు. మార్కెట్‌లో ఇవి ఆరోగ్యకరమైనవి లేదా డైజెస్టివ్ బిస్కెట్లు అని ప్రచారం చేస్తునప్పటికీ, వాటిలో రిఫైన్డ్ మైదా, చక్కెర, వాపుల‌ను కలిగించే పామ్ ఆయిల్ ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. బిస్కెట్లకు బదులుగా వేయించిన మఖానా లేదా వాల్ న‌ట్స్‌ తినాలని ఆయన సూచించారు.

న‌మ్‌కీన్స్‌, నూనె ఆహారాలు..

మూడవది ప్యాకేజ్డ్ నమ్‌కీన్స్‌. ముఖ్యంగా భుజియా వంటి పదార్థాలు. చాలా మంది ఇళ్లలో ఇవి సాయంత్రం టీతో పాటు తినే సాధారణ స్నాక్‌గా మారాయి. అయితే వీటిలో సోడియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిని పలుమార్లు వేడి చేసిన చ‌వ‌కైన ప్రాసెస్ చేసిన వంట నూనెల్లో వేయిస్తారు. దీని వల్ల ఇవి శరీరంలో వాపుల‌ను పెంచి రక్తపోటుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటి స్థానంలో వేయించిన శనగలు తినడం ఆరోగ్యానికి మంచిదని ఆయన సూచించారు. నాలుగవది సంప్రదాయంగా చేసే డీప్ ఫ్రైడ్ స్నాక్స్. సమోసా, పకోడీ, వడ వంటి పదార్థాలు రుచికరంగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మంచివి కావని పేర్కొన్నారు. ముఖ్యంగా హోటళ్లలో ఇవి పలుమార్లు ఉపయోగించిన ఆక్సిడైజ్ అయిన నూనెల్లో వేయిస్తారు. మైదా, కొవ్వుల‌ కలయిక రక్తనాళాల ఆరోగ్యానికి, ఇన్సులిన్ రెస్పాన్స్‌కు తీవ్ర హానికరం. తప్పనిసరిగా తినాలనిపిస్తే ఇంట్లో తయారు చేసిన, ఎయిర్ ఫ్రైడ్ లేదా బేక్ చేసిన పదార్థాలను ఎంచుకోవాలని సూచించారు.

తెల్ల బియ్యం..

ఐదవది తెల్ల బియ్యం అధికంగా తీసుకోవడం. చాలా కుటుంబాల్లో తెల్ల బియ్యం ప్రధాన ఆహారంగా ఉంది. అయితే చాలామంది దీన్ని ఎక్కువ పరిమాణంలో తింటూ, గ్లూకోజ్ పెరుగుదలను తగ్గించే ఫైబర్ లేదా ప్రోటీన్‌తో కలిపి తినడం మరిచిపోతారని డాక్ట‌ర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. తెల్ల బియ్యం స్థానంలో బ్రౌన్ రైస్ లేదా ఎర్ర బియ్యం ఉపయోగించడం లేదా పరిమాణాన్ని నియంత్రించడం మంచిదని సూచించారు. అలాగే భోజ‌న‌ తృప్తి ఎక్కువసేపు ఉండేందుకు పప్పు, కూరగాయల పరిమాణాన్ని రెండింతలు పెంచాలని సలహా ఇచ్చారు. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రాసెస్ చేసిన కార్బొహైడ్రేట్లు, సీడ్ ఆయిల్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement