Telangana Gulf Workers Ex-Gratia | గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి సీఎం రేవంత్ అండ: ప్రత్యేక కేసుగా 5 లక్షల ఆర్థిక సాయం
దుబాయ్లో అనారోగ్యానికి గురై తిరిగివచ్చి స్వస్థలంలో మరణించిన జగిత్యాల జిల్లా గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించింది. నిబంధనలు అడ్డువచ్చినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో దీనిని స్పెషల్ కేసుగా పరిగణించి ఆదుకున్నారు.
Karimnagar | Published On Apr 21, 2026, 6.12 pm IST
Telangana Gulf Workers Ex-Gratia | త్రినేత్ర.న్యూస్ : బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి అనారోగ్యం పాలై.. ప్రాణాలు కోల్పోయిన ఓ గల్ఫ్ కార్మికుడి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దయార్ద్ర హృదయంతో ఆదుకుంది. ప్రభుత్వ నిబంధనలు సాంకేతికంగా అడ్డువచ్చినా, మానవతా దృక్పథంతో వ్యవహరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ ‘స్పెషల్ కేసు’ కింద రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు.
అసలేం జరిగిందంటే?
జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగారాజం (61) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన, 2025 నవంబర్ 12న దుబాయ్లోని ఆస్టర్ హాస్పిటల్లో కోమాలోకి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 14న హైదరాబాద్కు తరలించి నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం జగిత్యాల రీహాబిలిటేషన్ సెంటర్కు మార్చగా.. అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 24న జగిత్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కన్నుమూశారు.
అడ్డువచ్చిన నిబంధనలు.. సీఎం స్పెషల్ ఇనిషియేటివ్
తెలంగాణ ప్రభుత్వ జీవో నెం.216 ప్రకారం.. గల్ఫ్ దేశాల్లో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తుంది. అయితే, గంగారాజం మరణం దుబాయ్లో కాకుండా ఇండియాలో జరగడంతో 'మరణ స్థలం గల్ఫ్ దేశం అయి ఉండాలి' అనే సాంకేతిక నిబంధన ఈ కుటుంబానికి సాయం అందకుండా అడ్డుపడింది.
దీనిపై మృతుడి భార్య రాజవ్వ, కుమారుడు జలంధర్ మార్చి 31న మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో జరిగిన సీఎం ప్రవాసీ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన సీఎం ప్రజావాణి ఇంచార్జి డా.జీ చిన్నారెడ్డి సానుకూలంగా స్పందించారు. స్టేట్ నోడల్ అధికారి దివ్యా దేవరాజన్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులుతో చర్చించి ప్రభుత్వానికి డీఓ లెటర్ రాశారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు.
బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
మంజూరైన రూ.5 లక్షల చెక్కును సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా.జీ చిన్నారెడ్డి మంగళవారం ప్రజాభవన్లో మృతుడి భార్య ఆరెల్లి రాజవ్వకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ డా.బి.ఎం.వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ కార్మికుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధను, బాధిత కుటుంబాన్ని ప్రత్యేక కేసుగా ఆదుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, ఇందుకు సహకరించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.మాకునూరి సంజయ్ కుమార్, అధికార యంత్రాంగానికి పొలాస సర్పంచ్ మిల్కూరి శంకరయ్య, డిసిసి అధ్యక్షులు గాజెంగి నందయ్యలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం

Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?






