త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | ఇరాన్ గుండెకాయపై భీకర దాడి.. ఖార్గ్ ఐలాండ్‌పై అమెరికా బాంబుల వర్షం

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం 15వ రోజుకు చేరుకుంది. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులకు గుండెకాయ లాంటి 'ఖార్గ్ ఐలాండ్'పై అమెరికా భీకర దాడులు చేసింది. మరోవైపు తమ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతికి, ఐఆర్ఐఎస్ దేనా నౌక మునకకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ శపథం చేసింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

J

International | Published On Mar 14, 2026, 7.34 pm IST

US-Israel-Iran War | ఇరాన్ గుండెకాయపై భీకర దాడి.. ఖార్గ్ ఐలాండ్‌పై అమెరికా బాంబుల వర్షం
Advertisement

US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు సాగిస్తున్న భీకర యుద్ధం 15వ రోజుకు చేరుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని మాస్కోలోని ఇరాన్ రాయబారి తేల్చిచెప్పారు. పలు దేశాల్లో క్షిపణులు, డ్రోన్ దాడులతో యుద్ధ వాతావరణం మరింత భయానకంగా మారుతోంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల కారణంగా మృతుల సంఖ్య 773కి చేరుకుంది. ఇరాన్‌లోని టాబ్రిజ్ పారిశ్రామిక వాడపై దాడులు జరిగే ముప్పు ఉండటంతో ఇజ్రాయెల్ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

ప్రతీకార జ్వాలల్లో ఇరాన్

ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటి ఖార్గ్ ఐలాండ్ పై అమెరికా భారీ ఎత్తున దాడులు చేసింది. ఓవర్‌నైట్ ఆపరేషన్‌లో భాగంగా 90కి పైగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి బంకర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయి. అయితే, చమురు మౌలిక సదుపాయాలకు ప్రస్తుతానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.

US-Israel-Iran War US Bombs Kharg Island Iran Vows Revenge

ఈ దాడిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. "మధ్యప్రాచ్య చరిత్రలోనే ఇది అత్యంత భీకరమైన బాంబింగ్ దాడి. ఖార్గ్ ఐలాండ్‌లోని మిలిటరీ టార్గెట్లను నామరూపాల్లేకుండా చేశాం," అని తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ దాడితో అమెరికా నేరుగా ఇరాన్‌లోకి గ్రౌండ్ ఇన్‌వేషన్ (భూతల దళాల ప్రవేశం) చేసే వ్యూహంలో ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్ణయాత్మక దశలో యుద్ధం

అమెరికా చేసిన దాడులను ప్రశంసించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి.. ఇరాన్‌తో యుద్ధం ఒక "నిర్ణయాత్మక దశకు" చేరుకుందని, ఈ పోరాటం ఎంతకాలమైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు. చమురు, వాణిజ్య నౌకల రాకపోకలకు కీలకమైన హార్ముజ్ జలసంధి రక్షణకు అమెరికా చర్యలు చేపట్టింది. నౌకలకు భద్రత కల్పించేందుకు 20 బిలియన్ డాలర్ల ఇన్సూరెన్స్ గ్యారంటీలు ఇచ్చే యోచనలో వైట్ హౌస్ ఉంది.

శాంతి చర్చలకు ఫ్రాన్స్ ఆహ్వానం

లెబనాన్ మరింత అరాచకంలోకి కూరుకుపోకుండా నిరోధించడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య పారిస్‌లో శాంతి చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఇరాన్ ప్రయోగించిన 85 డ్రోన్లు, క్షిపణులలో 79ని జోర్డాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విజయవంతంగా కూల్చివేశాయి. ఇరాన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ పతనం కాగానే, దేశంలో పాలనను తన చేతుల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రవాసంలో ఉన్న మాజీ షా కుమారుడు రెజా పహ్లావీ ప్రకటించారు. అప్పటికప్పుడు శాంతి, భద్రతలను పునరుద్ధరిస్తానని ఆయన పేర్కొన్నారు.

తీవ్ర స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం

యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో 43,000 పౌర భవనాలు ధ్వంసమయ్యాయని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఇందులో 36,500 ఇళ్లు ఉండగా.. టెహ్రాన్‌లోనే 10,000 దాడులు జరిగాయి. 120 పాఠశాలలు, అనేక ఆసుపత్రులు దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో 223 మంది మహిళలు, 206 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో కనీసం 112 మంది మరణించగా, 969 మంది గాయపడ్డారు. మరోవైపు అమెరికా దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే యూఏఈలోని ఓ ప్రధాన ఇంధన కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

Advertisement
Advertisement