త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | ట్రంప్‌కి యూకే, జర్మనీ షాక్.. భగ్గుమన్న క్రూడాయిల్

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరగ్గా, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటాయి. ఇరాన్‌పై దాడికి కలిసి రావాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపును యూకే, జర్మనీలు తిరస్కరించాయి.

J

International | Published On Mar 16, 2026, 7.22 pm IST

US-Israel-Iran War | ట్రంప్‌కి యూకే, జర్మనీ షాక్.. భగ్గుమన్న క్రూడాయిల్
Advertisement
  • దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి
  • మిడిల్ ఈస్ట్‌లో భీకర యుద్ధం

US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రాచ్యంలో పరిస్థితులు క్షణక్షణానికి రణరంగాన్ని తలపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి కేంద్రంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి

సోమవారం ఉదయం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఒక డ్రోన్ దాడి జరిగింది. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోని ఇంధన ట్యాంకర్‌ను డ్రోన్ ఢీకొట్టడంతో భారీ మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, ప్రస్తుతం నెమ్మదిగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. అలాగే, యూఏఈలోని ఫుజైరా పోర్టుపై కూడా డ్రోన్ దాడి జరగడం కలకలం రేపుతోంది. అబుదాబిలో జరిగిన మరో క్షిపణి దాడిలో ఒక పాలస్తీనా పౌరుడు మరణించాడు.

ట్రంప్ ప్రతిపాదన తిరస్కరణ

హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకలను సురక్షితంగా పంపేందుకు 7 దేశాలతో కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో భాగస్వామ్యం అయ్యేందుకు యూకే, జర్మనీ నిరాకరించాయి. హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు మిత్రదేశాలతో కలిసి పనిచేస్తాం కానీ, ఇరాన్‌తో జరిగే విస్తృత స్థాయి యుద్ధంలోకి మాత్రం యూకే అడుగుపెట్టదు అని యూకే ప్రధాని కైర్ స్టార్మర్ స్పష్టం చేశారు. "పవర్‌ఫుల్ అమెరికా నావికాదళం చేయలేని పనిని, కొన్ని యూరోపియన్ నౌకలు చేస్తాయని డొనాల్డ్ ట్రంప్ ఎలా ఆశిస్తున్నారు? ఇది మా యుద్ధం కాదు. మేం దీన్ని మొదలుపెట్టలేదు" అని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ ఘాటుగా బదులిచ్చారు.

ముడి చమురు ధరల రికార్డ్ జంప్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలో దాదాపు 20 శాతం వాటా ఉన్న హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీని ప్రభావంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్, డబ్ల్యూటీఐ ముడిచమురు ధరలు గత నెల రోజుల్లో ఏకంగా 40 శాతం పైగా పెరిగి 2022 తర్వాత తొలిసారి బ్యారెల్‌కు 100 డాలర్ల మార్క్‌ను దాటాయి.

భారత్‌పై ప్రభావం ఉందా? భారతీయులు సేఫేనా?

యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇండియాలో పెట్రోల్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశంలో ముడిచమురు నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని కేంద్ర చమురు, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎక్కడా పెట్రోల్ పంపులు డ్రై కాలేదని స్పష్టం చేసింది.

భారతీయులు సురక్షితం: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 22 భారతీయ నౌకలు, వాటిలోని 611 మంది నావికులు పూర్తిగా సురక్షితంగా ఉన్నారని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

జైశంకర్ మంతనాలు: ఇరాన్ నుంచి 550 మంది భారతీయులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు అర్మేనియా, జార్జియాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించడానికి ఇరాన్‌తో తాను జరుపుతున్న చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నాయని జైశంకర్ వెల్లడించారు.

చబహార్‌పై దాడులు: పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇరాన్‌లోని చబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్ వద్ద ఉన్న మిలిటరీ స్థావరాలపై అమెరికా ఫైటర్ జెట్లు దాడులు చేశాయి.

ఖమేనీ విమానం ధ్వంసం: టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఉపయోగించిన ఒక విమానాన్ని రాత్రికి రాత్రే ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది.

లెబనాన్‌లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్: హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం పరిమిత స్థాయి 'గ్రౌండ్ ఆపరేషన్స్' ప్రారంభించింది. ఒక ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించారు.

AI తో ఇరాన్ తప్పుడు ప్రచారం: ఇరాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక ఆయుధంగా వాడుకుంటూ, యుద్ధ విజయాలపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

Advertisement
Advertisement