త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

H-1B Visa Crisis | అమెరికా వెళ్లే వారికి షాక్: 2027 వరకు హెచ్-1బి వీసా ఇంటర్వ్యూలు లేనట్టే

అమెరికా వీసా కోసం నిరీక్షణ మరింత భారమైంది. కొత్త నిబంధనల కారణంగా భారత దేశంలోని అమెరికా కాన్సులేట్లలో హెచ్-1బి, హెచ్-4 వీసా ఇంటర్వ్యూ తేదీలు 2027 వరకు వాయిదా పడుతున్నాయి. 18 నెలల తర్వాత వీసా ఇంటర్వ్యూలు ఉంటాయని అభ్యర్థులకు మెయిల్స్ వస్తున్నాయి.

J

International | Published On Jan 25, 2026, 4.51 pm IST

H-1B Visa Crisis | అమెరికా వెళ్లే వారికి షాక్: 2027 వరకు హెచ్-1బి వీసా ఇంటర్వ్యూలు లేనట్టే

సంక్షిప్త సారాంశం

అమెరికా అమలు చేస్తున్న కఠినమైన సోషల్ మీడియా తనిఖీల వల్ల భారత దేశంలో హెచ్-1బి వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ లిస్ట్ 2027 వరకు పెరిగిపోయింది. 2026 ప్రారంభంలో ఇంటర్వ్యూలు ఉన్నవారికి కూడా 2027 మే నెలకు తేదీలను రీషెడ్యూల్ చేస్తున్నారు. దీనివల్ల వేలమంది భారతీయ టెక్కీలు స్వదేశంలో చిక్కుకుపోగా, మరికొందరు అమెరికా నుంచి ఇండియాకు రావడానికి భయపడుతున్నారు.

Advertisement

H-1B Visa Crisis | త్రినేత్ర.న్యూస్: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెక్కీలకు, ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న హెచ్-1బి వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత దేశంలోని అమెరికా కాన్సులేట్లలో హెచ్-1బి వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ పీరియడ్ అసాధారణంగా పెరిగిపోయింది. తాజా నివేదికల ప్రకారం, ప్రస్తుతం 2027 వరకు రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేవని తెలుస్తోంది.

ఎందుకు ఈ జాప్యం?

గత డిసెంబర్ 15 నుంచి అమెరికా విదేశాంగ శాఖ అమలులోకి తెచ్చిన 'సోషల్ మీడియా వెట్టింగ్' (Social Media Vetting) విధానమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా మారింది. ప్రతి అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి రావడంతో, ఒక్కో ఇంటర్వ్యూ సమయం పెరిగి, రోజువారీ ఇంటర్వ్యూల సంఖ్య సగానికి పడిపోయింది. దీనికి తోడు, ఇతర దేశాల్లో (Third Country Processing) వీసా స్టాంపింగ్ చేసుకునే సదుపాయాన్ని కూడా అమెరికా నిలిపివేయడంతో ఒత్తిడి మొత్తం భారత కాన్సులేట్లపైనే పడింది. తద్వారా డిసెంబర్ 15 నుంచి షెడ్యూల్ అయిన వీసా ఇంటర్వ్యూలన్నీ వాయిదా పడ్డాయి. డిసెంబర్ 15 తర్వాత ఇంటర్వ్యూ షెడ్యుల్ అయిన వాళ్లు, జనవరి 2026 లో ఇంటర్వ్యూలు ఉన్నవారికి కూడా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. ముందుగా ఏప్రిల్, మే 2026 నెలల్లో ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేస్తామని కాన్సులేట్ అధికారులు అభ్యర్థులకు మెయిల్స్ పంపించారు. కానీ.. ఇప్పుడు ఆ రీషెడ్యూలింగ్ కాస్త 18 నెలల తర్వాత అంటే ఏప్రిల్, మే 2027 కి మారుస్తూ ఈమెయిల్స్ పంపిస్తున్నారు.

అయోమయంలో హెచ్-1బి ఉద్యోగులు

వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు వచ్చిన వేలమంది ఐటీ నిపుణులు తిరిగి వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. దీనివల్ల వారి ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల చదువులపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బి హోల్డర్లు అత్యవసరమైతే తప్ప వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు రావొద్దని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కి వచ్చిన వాళ్లకు కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ఆఫర్ చేస్తున్నాయి. కానీ.. ఎన్ని నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందో తెలియదు. ఎప్పుడు కంపెనీ ఆఫీసులకు రావాలంటాయో అని ఐటీ నిపుణులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement