త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangladesh Fuel Crisis | బంగ్లాదేశ్‌లో ఏ క్షణమైనా పెట్రోల్ బంకుల మూత? ఇంధన కొరతతో అల్లాడుతున్న ప్రజలు

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావంతో బంగ్లాదేశ్‌లో తీవ్ర ఇంధన సంక్షోభం నెలకొంది. చమురు కొరతతో రాజధాని ఢాకా సహా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఏ క్షణమైనా మూతపడే ప్రమాదం పొంచి ఉంది. భారత్ ఇప్పటికే 5,000 టన్నుల డీజిల్‌ను పంపి ఆదుకునే ప్రయత్నం చేసింది.

J

International | Published On Mar 24, 2026, 9.50 pm IST

Bangladesh Fuel Crisis | బంగ్లాదేశ్‌లో ఏ క్షణమైనా పెట్రోల్ బంకుల మూత? ఇంధన కొరతతో అల్లాడుతున్న ప్రజలు
Advertisement
  • ఇంధన కొరతతో బంగ్లాదేశ్‌లో దారుణ పరిస్థితులు
  • రాజధాని ఢాకాలో ఇప్పటికే మూతపడిన పలు పెట్రోల్ బంకులు
  • ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, అంతర్జాతీయంగా 'హార్ముజ్ జలసంధి' మూసివేత, చెల్లింపుల్లో తలెత్తుతున్న బ్యాంకింగ్ సమస్యలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం
  • పొరుగు దేశాన్ని ఆదుకునేందుకు భారత్ 5,000 టన్నుల డీజిల్‌ సరఫరా
  • ఇంధన విక్రయాలపై బంగ్లా ప్రభుత్వం రోజువారీ పరిమితులు
  • పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మూసివేత
  • చమురు సంక్షోభంలో బంగ్లాతో పాటు ఆస్ట్రేలియాలోని విక్టోరియా, క్వీన్స్‌లాండ్
  • విక్టోరియా, క్వీన్స్‌లాండ్‌లో మూతపడ్డ వందలాది బంకులు

Bangladesh Fuel Crisis | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం ప్రపంచ దేశాలకు సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల దెబ్బకు బంగ్లాదేశ్ తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో ఏ క్షణమైనా పెట్రోల్ బంకులు మూతపడే పరిస్థితి కనిపిస్తోందని 'బంగ్లాదేశ్ పెట్రోల్ పంప్ ఓనర్స్ అసోసియేషన్ (BPPOA)' హెచ్చరించింది. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే బంకులు క్లోజ్ అయ్యాయి.

సంక్షోభానికి ప్రధాన కారణాలివే..

బంగ్లాదేశ్ ఇంధన కష్టాలకు అంతర్జాతీయ, స్థానిక కారణాలు తోడయ్యాయి.

హార్ముజ్ జలసంధి మూసివేత: పర్షియన్ గల్ఫ్‌ను, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌ను కలిపే 39 కిలోమీటర్ల ఇరుకైన 'హార్ముజ్ జలసంధి' ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతం వాటాను కలిగి ఉంది. దీని దారి మూసుకుపోవడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

బ్యాంకింగ్ ఇబ్బందులు: చమురు దిగుమతుల కోసం చేయాల్సిన చెల్లింపుల ప్రక్రియలో బ్యాంకింగ్ పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. "బ్యాంకులు మూసివేయడం వల్ల చెల్లింపులు చేయలేకపోతున్నాం.. అందుకే ఆయిల్ కంపెనీల నుంచి మాకు ఎలాంటి సరఫరా జరగడం లేదు" అని ఢాకాలోని ఓ బంక్ అసిస్టెంట్ మేనేజర్ అమీనుల్ ఇస్లాం ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు.. పెరిగిన ఘర్షణలు

ప్రభుత్వ రంగ చమురు సరఫరా సంస్థ 'బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (BPC)' ద్వారా ఆయిల్ కంపెనీలు చేస్తున్న సరఫరా ప్రస్తుత డిమాండ్‌కు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులు ఇంధనం కోసం గంటల తరబడి బంకుల ముందు క్యూ కట్టాల్సి వస్తోంది. నిరీక్షణ భరించలేక కస్టమర్లు అసహనానికి గురవుతున్నారు.

మరోవైపు బంక్ సిబ్బంది, వాహనదారుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా సిబ్బంది లేకపోవడం, పనిచేసే వర్కర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతుండటంతో.. భద్రతా కారణాల దృష్ట్యా బంకులను మూసివేయక తప్పని పరిస్థితి వస్తోందని ఓనర్స్ అసోసియేషన్ ఫేస్‌బుక్ వేదికగా తెలిపింది.

రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఆదుకున్న భారత్

ఈ పెను సంక్షోభం నుంచి బయటపడేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేసింది. అలాగే పెట్రోల్, డీజిల్ విక్రయాలపై రోజువారీ పరిమితులను (రేషనింగ్) విధించింది. బంగ్లాదేశ్ రాబోయే ఆరు నెలల్లో కనీసం 90,000 టన్నుల ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉందని బీపీసీ (BPC) చైర్మన్ ముహమ్మద్ రెజనూర్ రెహ్మాన్ వెల్లడించారు. కష్టకాలంలో ఉన్న పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు భారత్ అండగా నిలిచింది. తక్షణ సాయంగా సుమారు 5,000 టన్నుల డీజిల్‌ను పంపిణీ చేసి మద్దతు తెలిపింది.

ఈ ఇంధన కొరత సెగ బంగ్లాదేశ్‌కే పరిమితం కాలేదు. దీని ప్రభావంతో ఆస్ట్రేలియాలోని విక్టోరియా, క్వీన్స్‌లాండ్, న్యూ సౌత్ వేల్స్ తదితర ఏరియాల్లో కూడా వందలాది పెట్రోల్ బంకులు మూతపడటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా Supply Chain దెబ్బతినడంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement